Monday, June 1, 2026

 _*భక్తి*_

ఈశ్వరుని కృప పొందడానికి ఉత్తమ మార్గం నిస్వార్థ , నిర్మలమైన భక్తి. 
ఆ భక్తి కనక ఉన్నట్లయితే వేరే అర్హతలు ఏమీ అవసరం లేదు, వనంలోని నిషాదుడు కూడా అందరి గౌరవాన్ని పొందే స్థాయికి ఎదుగుతాడు.
మనం అందరం కన్నప్పగురించి విన్నాము. 
అతడికి చదువు,ఆచారం, సంపత్తు ఏమీ లేదు, కానీ అతడి భక్తి అనన్యసామాన్యమైనది...
కన్నప్ప అడవిలో ఎవరూ అర్చించని శివలింగాన్ని చూశాడు, దాన్ని పూజించాలని నిశ్చయించుకున్నాడు. 
శివలింగం పైన దుమ్మును దేనితో శుభ్రం చెయ్యాలో తెలియక తన పాదరక్షలను ఉపయోగించాడు, నదినుండి నీటిని పుక్కిలి పట్టి నోటితో తెచ్చి అభిషేకిమ్చాడు, అంతకుముందు తాను వేటాడిన మృగమాంసం నివేదించాడు, కన్నప్పలాగ మనం కూడా ఆచారం లేకుండా పూజ చేయ్యగలము అనుకునే వారికి కొంచెం హెచ్చరించాలి. 
శివుని కన్నులనుండి నీళ్ళు కారటం చూసి తన కన్నులు పేరకి అక్కడ పెట్టాడు. 
అతడి శ్రద్ధాభక్తి అలాంటిది, అందుకే శివుడు మోక్షమిచ్చాడు, మనకు అటువంటి భక్తి ఉన్నదా అటువంటి సేవ చేస్తే సరిపోతుందని అనుకోవడానికి?
భక్తి అందరికీ ముఖ్యమే. 

శాస్త్రాలు నవవిధభక్తుల గురించి చెబుతాయి, కొంతమందికి భగవంతుని మీద ప్రవచనం వినడంలో సంతోషం లభిస్తుంది, కొందరికి నిరంతర భగవన్నామ పారాయణ ఇష్టం. 
గోపికాస్త్రీలకు శ్రీకృష్ణ భగవానుడంటే విపరీతమైన భక్తి, ఓక గోపిక తాము తీసిన పాలు, పెరుగులు అమ్ముతూ పాలు, పెరుగు అని అరవడం బదులు “గోవిందా, దామోదరా, మాధవా...” అంటూ అరుస్తోందిట. 
అందరూ ఆవిడకు పిచ్చెక్కిందా అనుకున్నారట, కానీ ఆ గోపస్త్రీ మనస్సు పూర్తిగా భగవంతుని యందు నిమగ్నమైవున్నది, మహాత్ముడైన శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు గొప్ప జీవన్ముక్తులు, వారి ప్రవర్తన పరికించిన వ్యక్తులు ఆయనకు మతి చలించిందని భావించి వారి గురువు గారిదగ్గరకు వెళ్లి విన్నవించారట. దానికి గురువుగారు విచారంగా “మా శిష్యుడికి పిచ్చేక్కిన్దంటున్నారు. 
ఆ పిచ్చి నాకేక్కలేదే అని నాకు బాధగా వుంది. 
నన్ను నేను గురువు అని చెప్పుకుంటున్నా, ఆ దశకు ఇంకా చేరుకోలేదు. 
ఆయన మహాత్ముడు” అని చెప్పారట. 
ఏ పని చేసినా భగవంతుని ధ్యానిస్తూ చెయ్యడం కూడా ఒక గొప్ప భక్తియే.

కొంతమందికి భగవంతుని పూజలో సమయం గడపడం చాలా ఇష్టం. 
ఎటువంటి ఆటంకం లేకుండా పూజగదిలో గడపడానికి వారు సంతోషపడతారు.
వీళ్ళకు విరుద్ధంగా కొంతమంది పట్టుమని పది నిముషాలు గడపడానికి ఎంతో అసహనం ప్రదర్శిస్తారు. 
వాళ్ళు తమ పురోహితుడిని సహస్రనామం బదులు శతనామం, లేదా ఇంకా లఘువుగా ముగించమని తొందర చేస్తుంటారు. 
పూజా సమయంలో కూడా వాళ్ళు ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటారు. 
శ్రద్ధ గలిగిన వాడు పూజలో కూర్చున్నప్పుడు సమయం గడచిపోవదాన్ని గుర్తించడు,
పూజించడం ఒక విధమైన భక్తి,
ఆంజనేయుని వంటి భక్తులకు స్వామి సేవయే పరమావధి.
 ఆత్మనివేదన విషయంలో అన్నీ అర్పించిన బలి చక్రవర్తి మనకు స్ఫూర్తి.

*నవవిధ భక్తులు:*
భగవంతుని గురించి వినడం ( శ్రవణం )*
2.భగవంతుని స్తుతించడం (కీర్తనం)
౩. భగవంతుని మనస్సునందు నిలుపుకోవడం ( స్మరణం)
4. భగవంతుని పాద సేవనం
5. భగవంతునిరూపాన్ని పూజించడం ( అర్చనం )
6. భగవంతుని ముందు సాష్టాంగ ప్రణామం (వందనం)
7. భగవంతుని ముందు దాసుని వలె సేవించడం ( దాస్యం)
8. భగవంతుని స్నేహితునిగా భావించడం ( సఖ్యం)
9. భగవంతుని సర్వదా శరణు చొచ్చటం(ఆత్మ నివేదనం )
వీనిలో ఏ భక్తి మార్గాన్ని ఆశ్రయించినా మనకు శ్రేయస్సు లభిస్తుంది.

         *_🥀శుభమస్తు🥀_*

No comments:

Post a Comment