Sunday, November 6, 2022

పూజల్లో దోషాలు..

 Viii.xi. 1-6.  301022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

             పూజల్లో దోషాలు..
                ➖➖➖✍️

ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.

ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి "అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను" అని ప్రాధేయపడింది.

ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు...
"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా!" అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.

ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.

అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, "ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.

ఆమె ఆయనకు నమస్కరించి "అయ్యా! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.

"ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.

ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

"అవ్వా! తప్పు చదువుతున్నావు! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది" అని కోపంతో వెళ్ళిపోయాడు.

ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ "తవ, మమ" అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.

ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.

ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.

ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి..."అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.

కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.

మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. కావాలని చేయరు ఎవరూ! పొరపాటులు జరగవచ్చు అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.✍️
                       🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment