[7/6, 17:05] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
హీనగుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ!
*తాత్పర్యం*
దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.
[7/6, 17:05] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*ముసలి తనానికి దసరావేషం లాగ*
ఏవయసులో చేయాల్చిన పనులు ఆ వయసులోనే చేయాలని లేకుంటే నవ్వుల పాలవుతారని చెప్పే సామెత ఇది.
[7/6, 17:05] +91 79819 72004: *🤘నేటి సుభాషితాలు🤘*
వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం
*- డా.బి.ఆర్. అంబేద్కర్ *
స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ..
బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర
భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
*- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్*
దేశం అభివృద్ధి చెందడమంటే,
అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు..
పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
*- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్*
[7/6, 17:05] +91 79819 72004: మూడొంకాయలు (జానపద హాస్య కథ) - డా.ఎం.హరికిషన్
*********
ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వానికి చిన్నప్పటి నుంచీ వంకాయ కూరంటే చానా చానా ఇష్టం. కానీ ఆ వూర్లో ఆ సమ్మచ్చరం ఎవరూ వంకాయ తోట ఎయ్యలేదు. దాన్తో తినాలని ఎంత కోరికున్నా వంకాయలు దొరకక బాధపడా వుండేటోడు.
ఒకరోజు వానికి పనుండి పక్కూరికి పోతా వుంటే దారి నడుమ ఒక చెట్టుకు మూడు వంకాయలు కనబన్నాయి. దాండ్లను చూడగానే వాని నోట్లో సర్రున నీళ్ళూరినాయి. "ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు" అని లొట్టలేసుకుంటా బెరబెరా ఆ మూడు కాయల్నే తెంపుకోని, పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చేసినాడు.
అట్లా ఇంటికి రావడం, రావడం పెండ్లాన్ని పిల్చి “ఏమే!...నాకు పక్కూల్లో కొంచం పనుంది. జర్రున పోయి జర్రునొస్తా. అంతలోపల బాగా మసాలా యేసి ఈ మూడు కాయల్తో ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూరొండు. రుచి గనుక బాగా లేదనుకో కిందా మీదా యేసి తంతా చూడు" అని చెప్పెల్లిపోయినాడు.
ఆమె చానా అమాయకురాలు. మొగుడు ఎట్లా చెప్తే అట్లా చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలీదు. దాంతో మొగుడు చెప్పినట్లే ఆ మూడు వంకాయలూ తీసుకోని, మాంచి మసాలా చేసి, వంకాయలకు నాలుగువైపులా గాట్లు పెట్టి, లోపలంతా మసాలా కూరి పొయ్యిమీదికి ఎక్కిచ్చింది.
కాసేపున్నాక ఆమెకు వంకాయలు బాగా ఉడికినాయా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగాలేకపోతే మొగుడు తన్నినా తంతాడనుకోని భయపడి చూద్దామాగు అని ఒకటి తీసుకోని నోట్లో ఏసుకోని వుడికిందో లేదో చూసింది. బాగా ఉడికిందిలే ఇంకా భయం లేదు. నా మొగుడు బాగా మెచ్చుకొంటాడు అనుకొంది.
కాసేపున్నాక ఆమెకు మల్లా వంకాయలకు ఉప్పూ కారం బాగా పట్టిందా లేదా అని అనుమానమొచ్చింది. కూర బాగా లేదనుకో మొగుడు తన్నినా తంతాడని భయపడి “చూద్దామాగు" అని ఇంగోదాన్ని తీసి నోట్లో ఏసుకోని ఉప్పూకారం పట్టిందో లేదో చూసింది. బాగా సరిపోయింది ఇంక భయం లేదు అనుకొంది.
అంతలో ఆమె మొగుడు పనులన్నీ పూర్తిచేసుకొని వంకాయ కూర తిందామని వురుక్కుంటా ఇంటికొచ్చినాడు. ఇంట్లోకి రావడం, రావడం వానికి మసాలా వాసన ఘుమ్మని తగిలింది. నోట్లో నీళ్ళు సర్రున వూరుతా వుంటే పల్లెం తెచ్చుకొని ముందు పెట్టుకోని "ఏమే! వాసన అదిరిపోతా వుంది! దాదా... తీసుకోనొచ్చి ఏద్దురా. ఆకలి చంపేస్తా ఉంది" అన్నాడు.
ఉడికిందా లేదా అని ఒకటి, ఉప్పూకారం పట్టిందా లేదా అని మరొకటి వండేటప్పుడే తినేసింది గదా! ఇంగ అక్కడ మిగిలినేది ఒకే ఒక్కటి. దాంతో ఆమె వాని పళ్ళింలో ఆ ఒక్క వంకాయనే వేసింది. అది చూసి వాడదిరిపడ్డాడు.
“అదేందే! నేను తెచ్చినేది మూడయితే నువ్వు ఒకటే ఏసినావు మిగతా రెండూ ఏమయిపోయినాయి" అన్నాడు కోపంగా.
దానికామె "నువ్వేగదా రుచిగా లేకుంటే కిందా మీదా ఏసి తంతాననింది. అందుకే వంట చేస్తా... చేస్తా... ఉడికిందో లేదో చూద్దామని ఒకటి, ఉప్పూకారం పట్టిందో లేదో చూద్దామని మరొకటి తిన్నా" అనింది.
దానికి వాడు "ఏమే! నీకు తెలీదా వంకాయ కూరంటే నాకెంత ఇష్టమో? ఐనా తెలిసి తెలిసీ ఎట్లా తింటివే ఆ రెండూ" అన్నాడు కోపంగా.
ఆమె అమాయకురాలు గదా దాంతో “ఎట్లా తింటివే" అని మొగుడు అడుగుతా వున్నా చూపియ్యకపోతే ఏమంటాడో ఏమో అని బెదపడి వణికిపోతా వానీ పళ్ళెంలో వున్న ఆ ఒక్క వంకాయను గబుక్కున నోట్లో వేసుకోని నములుతా "ఇదిగో ఇట్లా తింటి" అని చూపిచ్చింది.
*********
[7/6, 17:05] +91 79819 72004: *🌻ఉత్తమ రాజలక్షణం!🌻*
💫సువర్ణపురి రాజు సుబలదేవుడు పరాక్రమశాలి; రాజ్యకాంక్షాపరుడు. పొరుగున ఉన్న వ్రతశిలా రాజ్యంతో సువర్ణపురికి తరతరాలుగా పగ కొనసాగుతున్నది. ప్రస్తుత వ్రతశిలా రాజు సుధర్ముడు శాంతి ప్రియుడు. అయితే, మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగగలదనే నమ్మకం సుబలదేవుడికి లేదు.
💫ఇప్పుడు తనవద్ద శక్తివంతమైన సేనలు ఉన్నాయి గనక, పొరుగురాజ్యంపై దండెత్తి వెళ్ళి శత్రుశేషం లేకుండా చేయాలని ఆలోచించసాగాడు. ఇది సుబలదేవుడి రాణికి ఏమాత్రం నచ్చలేదు. ‘‘ప్రభూ! శాంతి వర్థిల్లుతున్నప్పుడు మనంగా దండెత్తి వెళ్ళడం భావ్యమవుతుందా? పైగా, వ్రతశిలారాజు ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టూ, ఆయన మనమీద దాడి చేసే అవకాశం లవలేశం లేదనీ మన చారుల ద్వారా తెలియవచ్చింది కదా....
💫మైత్రి పెంపొందించుకోవలసిన సమయంలో కయ్యానికి కాలుదువ్వడం సబబేనా? ప్రభువులు మరొక్కసారి ఆలోచించండి,'' అని తన అభ్యంతరాన్ని సున్నితంగా తెలియజేసింది.
💫రాణిగారి అభిప్రాయంతో ఏకీభవించిన మహామంత్రి, ‘‘అవును ప్రభూ. మునుపటి రాజు శత్రుభావంతో మనమీద కత్తికట్టిన మాట వాస్తవమే. అయితే, ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఈనాటి రాజు సత్వ సంపన్నుడు; శాంతి ప్రియుడు. పైగా యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేము.
💫రాజు వ్యాధిగ్రస్తుడైవున్న మాట నిజమే. అయితే, ప్రజలు ఆయన పట్ల అపార గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారు. ఇంకా పసివాడైన యువరాజు సుశాంతుడంటే దేశ ప్రజలకు పంచప్రాణాలు. కాబట్టి ఒక వేళ మనం వాళ్ళ సేనలను ఓడించినప్పటికీ ప్రజలు తిరుగుబాటుచేయ గలరు.
💫అప్పుడు రాజ్యంలో శాంతి కరువవుతుంది,'' అన్నాడు. ‘‘ఇప్పటి రాజు మరణించాక, అంతగా ప్రజాభిమానం చూరగొన్న యువరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే, మునుముందు మనమీదికి దండెత్తి రాడన్న నమ్మకం ఏమిటి? మనం బలంగా వున్నప్పుడే శత్రుశేషం లేకుండా చేయడం క్షాత్రధర్మం. ఇక ప్రజల తిరుగుబాటు అంటారా? ఉక్కుపాదంతో అణచివేద్దాం. అంతే!'' అన్నాడు రాజు.
💫ఆ తరవాత సువర్ణపురి సైన్యం, వ్రతశిలా రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వ్రతశిలారాజ్య రాజు సుధర్ముడు, స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రుసేనలను ఎదుర్కొన్నాడు.
💫సుబలదేవుణ్ణి తీవ్రంగా గాయపరచి, అతడితో పోరాడుతూ వీరమరణం పొందాడు. సుబలదేవుడు వాంఛించిన విధంగానే యుద్ధంలో విజయం సాధించాడు. సువర్ణపురితో వ్రతశిలా రాజ్యాన్ని కలుపుకున్నాడు. అయినా, తాను సాధించిన విజయం ఆయనకు ఆనందం కలిగించలేదు.
💫యుద్ధంలో సుధర్ముడి ద్వారా కలిగిన గాయం ఎన్నివైద్యాలు చేసినా మానలేదు. దాంతో ఒకసంవత్సరం బాధపడి మరణించాడు. సుబలదేవుడికి ఉన్నది ఒక్కగానొక్కకుమార్తె. మగ సంతానం లేదు. సద్గుణ సంపన్నుడైన ఒక యువకుణ్ణి దత్తత తీసుకోవాలని మహారాణి ఆశించింది. అలాంటి యువకుడి కోసం, మంత్రి ఆయన పరివారం, అన్వేషణ ప్రారంభించారు.
💫ఒకవారం గడిచింది. సుప్రసిద్ధ గురువు హేమచంద్రులు నడుపుతూన్న గురుకులాశ్రమానికి వెళ్ళి, అక్కడ విద్యనభ్యసిస్తూన్న యువకులను చూడడానికి మంత్రి, ఇద్దరు అనుచరులతో బయలుదేరాడు. ముగ్గురూ బాటసారుల్లా మారువేషాలు ధరించారు. వాళ్ళు గురుకులాశ్రమాన్ని సమీపించే సరికి సూర్యుడు పడమటి దిశకు చేరుకున్నాడు.
💫బంగారం లాంటి లేతపసువు ఎండలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. దాపులనున్న చిన్న గుట్ట మీదికి ఎక్కి మంత్రీ, ఆయన అనుచరులూ ఆడుకుంటూన్న విద్యార్థులను జాగ్రత్తగా పరిశీలించసాగారు.
💫ఆ విద్యార్థుల బృందంలో ఒకడు చూడడానికి చాలా ముచ్చటగా ఎంతో హుందాగా ఉన్నాడు. సహవిద్యార్థులు అతడి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూండగా, హఠాత్తుగా ఎక్కడినుంచో ఒకరాయి రివ్వునవచ్చి, అతడి నుదుటికి తగిలింది. బొటబొటా రక్తం కారసాగింది.
💫వెంటనే కొందరువెళ్ళి ఏవో ఆకులు కోసుకువచ్చి, వాటి పసరును గాయంపై పిండి కట్టుగట్టారు. మరి కొందరు మిత్రులు, ఆ రాయి వచ్చిన దిశగా వెళ్ళి, పొదకు ఆవలినుంచి దాన్ని విసిరినవాణ్ణి పట్టుకు వచ్చి తమ మిత్రుడి ఎదుట నిలబెట్టారు.
💫‘‘ఇతన్ని తప్పక శిక్షంచాలి,'' అన్నాడు ఒక విద్యార్థి.*
💫అవును. మనమూ రాళ్ళు విసిరి, అతని తలను గాయపరచాలి,'' అన్నాడు మరొక విద్యార్థి ఆవేశంగా...
💫అయితే, గాయపడిన వాళ్ళ నాయకుడు మాత్రం, అతనికేసి ప్రశాంతంగా చూస్తూ, ‘‘నువ్వు రాయిని ఎందుకు విసిరావు?'' అని అడిగాడు.
💫‘మరీ ఆకలి వేసింది. ఆ చెట్టుకొమ్మలో మాగిన జామపండు ఒకటి కనిపించింది. దానిని కొట్టడానికి రాయి విసిరాను,'' అన్నాడు వచ్చిన మనిషి.
💫‘జామపండు పడిందా?'' అని అడిగాడా విద్యార్థి నాయకుడు.💫
💫‘పడింది. దాన్ని అప్పుడే తినేశాను,'' అన్నాడా మనిషి.
💫‘‘ఆకలి తీరిందనుకుంటాను, అవునా,'' అని అడిగాడు విద్యార్థి.
💫ఆ పెద్దమనిషి కాస్సేపు అటూ ఇటూ చూసి, ‘‘ఎలా తీరుతుంది? ఎలాగైనా అడవికి దాపుల నున్న గ్రామాన్ని చేరుకుని గుడిప్రసాదం తిని ఆకలి తీర్చుకుంటాను. ఆ జామపండే గనక తినలేదనుకుంటే మాత్రం, ఇక్కడే శోషవచ్చి పడి పోయేవాణ్ణి,'' అన్నాడు.
💫‘మాతో రా, మా గురుకులాశ్రమంలో భోజనం పెడతాం. చీకటి పడుతోంది. అడివి మార్గంలో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడం క్షేమంకాదు. తెల్లవారాక వెళ్ళవచ్చు,'' అంటూ ఆ విద్యార్థి నాయకుడు ఆపెద్ద మనిషిని వెంట పెట్టుకుని గురుకులం వైపు నడవసాగాడు.
💫‘ఏమిటి మిత్రమా! నీ తలను గాయపరచిన వాడికి సాయపడడమా?'' అన్నాడు ఒక మిత్రుడు.
💫‘‘అవును మిత్రమా. అతడు చెట్టు మీదికి రాయి విసిరినప్పుడు చెట్టు ఏం చేసింది? తన ఫలాన్ని ఇచ్చింది కదా! ఒక చెట్టే అలా చేయగలిగినప్పుడు, మనిషినైన నేను అంతకన్నా మంచి పని చేయాలి కదా? చెట్టు పండునిచ్చింది. నేను భోజనం పెట్టి తీరాలి!'' అన్నాడు వాళ్ళ నాయకుడు మందహాసం చేస్తూ.
💫‘‘అద్భుతం! ఇదీ ఉత్తమమైన రాజలక్షణం! ఆ యువకుడు ఎవరై ఉంటాడు?'' అని అడిగాడు వాళ్ళ సంభాషణ విన్న మంత్రి తన అనుచరులను. ఆ తరవాత మంత్రి గురుకులాశ్రమానికి వెళ్ళి గురువుకు తానెవరైనదీ చెప్పి ఆ యువకుడి వివరాలడిగాడు. అతడు వ్రతశిలా రాజ కుమారుడు సుశాంతుడని గురువు తెలియజేశాడు.
💫ఆ తరవాత మంత్రి, మహారాణి కోరిక ప్రకారం, వ్రతశిలా రాణిని దర్శించి సంగతి చెప్పాడు. ఇద్దరు రాణులూ కలుసుకున్నారు. సువర్ణపురి యువరాణి సువర్చలాదేవిని వ్రతశిలా రాజకుమారుడు సుశాంతుడికిచ్చి ఘనంగా వివాహం జరిపారు. ఉభయ రాజ్యాలకూ రాజై, సుశాంతుడు ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసి ఆదర్శ ప్రభువుగా కీర్తిగాంచాడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7/6, 17:05] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🛑బ్యాక్టీరియా, వైరస్ల మధ్య తేడా ఏమిటి? What is difference between Bacteria and Virus?*
❇️బ్యాక్టీరియా, వైరస్ల మధ్య ప్రధానమైన ఒక తేడా వాటి పరిమాణం. బ్యాక్టీరియా వ్యాసం ఒక మైక్రోమీటర్ (మిల్లీమీటర్లో వెయ్యో వంతు) ఉంటే, వాటి పొడవు 1 నుంచి 3 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే ఒక వైరస్ పొడవు 0.02 నుంచి 0.3 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక బ్యాక్టీరియా స్వతంత్రంగా సంతానోత్పత్తి చేయగల సూక్ష్మజీవి. వైరస్ వాటి పునరుత్పత్తికి జీవమున్న వేరే కణాలపై ఆధారపడతాయి. వైరస్లలో ఒక రకమైన న్యూక్లియక్ యాసిడ్ మాత్రమే ఉండి, వాటి ప్రాజనిక రూపం (genotype) అయిన వాటి సంతతి డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాత్రమే కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా డీఎన్ఏలో జన్యు సంబంధిత సమాచారం పూర్తిగా ఉండడమే కాక, ఇతర జీవ ప్రక్రియలను కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాను ఎదుర్కోవడం సులభం. ఎందుకంటే వాటి జీవప్రక్రియ (metabolism)ను యాంటీబయోటిక్స్ మందులతో అంతమొందించి చంపవచ్చు. వైరస్ల ఉత్పత్తి వేరే కణాల జీవ ప్రక్రియపై ఆధారపడి ఉండడంతో, వాటిపై యాంటీబయోటిక్స్ పనిచేయవు. ప్రస్తుత కాలంలో వైరస్లను అంతమొందించడానికి ఏవో కొన్ని మందులను మాత్రమే కనిపెట్టగలిగారు.
No comments:
Post a Comment