సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే ముఖ్య విషయం , హైదరాబాద్ పై సైనిక చర్య.
మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని
పాకిస్తాన్ లో కలపాలనుకున్న నిజాం మెడలు వంచి ,
భారత్ లో కలిపేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెందుతుంది.
ఆపరేషన్ పోలో గా పిలిచే ఆ పోలీస్ చర్య గురించి చదవండి.
1948 సెప్టెంబర్ 13 (సోమవారం) బ్రాహ్మీ ముహూర్తాన…
భారత సేన హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం పథ సంచలనం ప్రారంభించింది.
‘ఉక్కు మనిషి’ సర్దార్ పటేల్ మార్గదర్శనం, లెఫ్టినెంట్ మేజర్ జనరల్ మహరాజ్ రాజేంద్రసింగ్ నిర్దేశకత్వంలో మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వాన జరిగింది ఈ ‘పోలీసు చర్య’.
భారత యూనియన్ సేనలు మొత్తం ఎనిమిది విభిన్న ప్రాంతాల నుంచి
హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించాయి. అయితే ప్రధానమైన ముట్టడి
షోలాపూర్, బెజవాడల నుంచే. భారత సేనల వ్యూహమేమిటో నిజాం సేనలకు
అంతే పట్టలేదు. చాలాచోట్ల నిజాం సైనికులు ఆయుధాల్ని పారేసి పారిపోయారు.
పారిపోతున్నప్పుడు ఇన్నాళ్లూ హింసలకు గురైన పల్లెజనం నిజాం సైనికులను వెంటబడి తరిమారు. చాలాచోట్ల వాళ్లకి దేహశుద్ధి జరిగింది.
మొదటిరోజు జరిగిన యుద్ధంలో ఏడుగురు భారత సైనికులు మరణించగా
632 మంది నిజాం సైనికులు వధించబడ్డారు.అదేరోజు ఉస్మానాబాద్ జిల్లాకి చెందిన తుల్జాపూర్, పర్బణీ జిల్లాకి చెందిన మానిక్ గఢ్, కనౌడ్గావ్, బెజవాడ వైపున్న బోనకల్లు భారత సేనల వశమమ్యాయి. సైనికచర్య దృష్ట్యా హైదరాబాద్- బెజవాడ మధ్యనున్న ట్రంక్ టెలిఫోన్ తప్ప భారత్- హైదరాబాద్ మధ్యగల రాకపోకలనన్నిటినీ నిలిపివేశారు.
రెండోరోజున సెప్టెంబర్ 14 నాడు దౌలతాబాద్, జాల్నా యూనియన్ పరమయ్యాయి. దాంతో ఔరంగాబాద్ తేలిగ్గానే చేజిక్కింది. చౌధరి నేతృత్వంలోని సేనలు పురోగమిస్తూ రాజేశ్వర్కి చేరాయి. అది సరిగ్గా షోలాపూర్- సికింద్రాబాద్ పట్టణాలకి మధ్యన ఉంటుంది. ఉస్మానాబాద్, నిర్మల్ చాలా తేలిగ్గా పట్టుబడ్డాయి. సికింద్రాబాద్ నుంచి 60 మైళ్ల దూరాన ఉన్న సూర్యాపేట దగ్గర భారత సేనలు ముందడుగు వేస్తున్నాయి.
సెప్టెంబర్ 15 నాడు మూడోరోజున తెల్లవారుజామున 4 గంటలకి మురాద్లోని నిజాం సైన్యం లాతూర్ రోడ్డువైపు తిరోగమించింది. వాయువ్యంలో ఔరంగాబాద్, షోలాపూర్- హైదరాబాద్ లైన్లోని హుమ్నాబాద్ యూనియన్ దళాల వశమయ్యాయి. జాల్నా నుంచి దక్షిణాన 40 మైళ్ల దూరాన షాదన్ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన బ్రిడ్జీ కూడా భారత బలగాల పరమైంది. వరంగల్ జిల్లాలో అర్తర్భాగంగా ఉన్న ఖమ్మం సైతం భారత సేనల ఆధీనమైంది. బీదర్ విమానాశ్రయం మీద బాంబింగ్ జరిగింది.
సెప్టెంబర్ 16నాడు నాల్గవ రోజు ముఖ్య రైల్, రహదారి కూడలి అయిన జహీరాబాద్ టౌన్ను వశం చేసుకుంది. ఇటు సూర్యాపేట నుంచి యూనియన్ సైన్యం హైదరాబాద్ దారిన వస్తూ ఉంటే సూర్యాపేటకి నాలుగు మైళ్ల దూరాన మూసీ నదిపై ఉన్న వంతెనని నిజాం సైన్యం పేల్చివేసింది. అయితే, మద్రాసు సాపర్స్ సాయంతో భారత దళాలు బ్రిడ్జీని పునర్నిర్మించాయి. సుటెర్ దిశన మునీరాబాద్ రైల్స్స్టేషన్ను భారత బలగాలు తమ వశం చేసుకున్నాయి. అక్కడ భారత సేనలకు భారీఎత్తున ఆయుధాలూ మందుగుండు సామగ్రీ దొరికాయి. చాలామంది రజాకార్లూ చిక్కారు.
సెప్టెంబర్ 17న ఐదవరోజు హైదరాబాద్ దళాలు భారతీయ సేనల్ని రానీయకుండా చేయటానికి పటన్చెరు దగ్గరి బ్రిడ్జీని పేల్చివేశాయి. రోడ్డుమీద పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టి గచ్చిబౌలి, లింగంపల్లి మధ్యకు చేరుకున్నాయి. మల్కాపూర్ దగ్గర కూడా మందుపాతరలు అమర్చారు. వాటన్నిటినీ దాటుకొని భారత సేనలు పురోగమించాయి.ఇక చేసేదిలేక అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం యుద్ధవిరమణని ప్రకటించి యూనియన్ సేనలను సికింద్రాబాద్లోకి స్వేచ్ఛగా రావడానికి అనుమతించాడు.
సెప్టెంబర్ 18నాడు సాయంత్రం 4 గంటలకు ప్రజలంతా హారతులిస్తూ విజయతిలకాలు దిద్దుతూ హర్షాతిరేకాన స్వాగతిస్తుండగా భారతసేనలు సికింద్రాబాద్లోకి అడుగుపెట్టాయి.
మేజర్ జనరల్ చౌధరి ఎదుట నిజాం సైన్యాధ్యక్షుడు అహ్మద్ అల్ ఎడ్రూస్, నిజాం యువరాజు ఆజంజా అసఫియా పతాకాన్ని దింపి లాంఛనంగా లొంగిపోయి శరణువేడారు. ఇక్కడితో పోలీసుచర్య పూర్తయింది.
మొత్తం అంతా కలిపి 108 గంటల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ వశమైంది. హైదరాబాద్మీద దాడిచేస్తే మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తానన్న రజ్వీ తోకముడిచాడు. అతడి అనుచరులూ మద్దతుదారులూ పిక్కబలం చూపారు. పెద్ద రక్తపాతమేదీ లేకుండానే నిజాం రాజ్యం విముక్తమయింది.
No comments:
Post a Comment