Thursday, September 21, 2023

శివుడే విష్ణువు విష్ణువే శివుడు..

 శివుడే విష్ణువు విష్ణువే శివుడు.. 
దేవుడు మనిషిని సృష్టించి పంచభూతాలతో ప్రకృతిని సృజించి అద్భుతమైన జీవనసౌఖ్యాన్ని అనుభవాన్ని పొందమన్నాడు అయితే హిందూ మతధర్మం, ఆర్ష విజ్ఞానం భోదించేది ఒకటే. దైవం ఒక్కడే భారత వర్షంలో మతవిధానము ఒక్కటే అని ఉద్భోదించినా, మనుషులు తమ స్వార్ధానికి నిర్మించుకున్న పాపకూపాలే వివిధ మతాలు అది శైవమైనా వైష్ణవమైనా అంతే. దైవానికి విభజన లేదు.
శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యు ని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు. అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.
అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక, శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు. అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు ' అని అంటాడు.
దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు. అంత వేగంగా, తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు. సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే, వారిని వేరు చేసి చూడటం తగదు.
ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేసాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయుణ్ణి తనకు నమ్మకమైన మిత్రునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే. శివ కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడనికి ఆంజనేయుడే ఉదాహరణ.
శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి తోడ్పడినట్లే, విష్ణుమూర్తికి శివుడు తోడ్పడాడు. ఈశ్వరాంశ సంభూతు డైన ఆంజనేయుడు సీతాన్వేషణలో శ్రీరామచంద్రునికి తోడ్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
"శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే " అని సంద్యావందనం శ్లోకాలు తెలుపుతున్నాయి.
శివ, కేశవుల్లో ఎవరిని అరాధించినా ఒకటే.ఇద్దరినీ అరాధించినా తప్పు లేదు. సృష్టిలోని ప్రాణులనునిలబెడు తున్నది విష్ణుమూర్తి అయితే లయం చేసుకుంటున్నది పరమేశ్వరుడు.

No comments:

Post a Comment