Tuesday, November 19, 2024

 #ఎవరికివారు_బతికుండగానే_పిండం_పెట్టుకోవచ్చా? 

     చాలామంది అది కూడదని, అలా పెట్టుకుంటే వారు లోకవ్యవహారాలకు  పనికిరారని, కొంతమంది గురువులను, పెద్దలను ఉదహరిస్తూ కామెంట్ చేయడం జరిగింది. దీనిపై శాస్త్రాభిప్రాయం ఏమిటో మీముందు ఉంచే ప్రయత్నమే ఈ వ్యాసం. 
               ఏ పని చేయవచ్చు? ఏ పని చేయకూడదు? అనే విషయంలో శాస్త్రమే మనకు ప్రమాణమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో తెలియచేస్తూ 
#తస్మాచ్ఛాస్త్రం_ప్రమాణం_తే_కార్యాకార్యవ్యవస్థితౌ  అని (16అ-24శ్లో) పేర్కొనడం జరిగింది. దీనికి శంకర భగవత్పాదులు తమ గీతాభాష్యంలో "కర్మాధికారభూమి ప్రదర్శనార్థమ్" - అని ఆశ్లోకంలోని "ఇహ" అనే పదాన్ని వివరించారు. అనగా ఏయే కర్మలు చేయడానికి అధికారమున్నదో తెలుసుకోవడానికి శాస్త్రమే మనకు దిక్కు అని చెప్పకనే చెప్పడం జరిగింది. 

                 ఇదే విషయంలో కాశీలో కొన్ని దశాబ్దాల క్రితం పండితులమధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. అనంతరం మహామహోపాధ్యాయ, ఆహితాగ్ని, కాశీహిందూవిశ్వవిద్యాలయం లోని ధర్మశాస్త్ర విభాగాధ్యక్షులు అయిన పం.ప్రభుదత్తజీ శాస్త్రి గారు #జీవచ్ఛ్రాద్ధపద్ధతి పేరుతో గ్రంథం కూడా రాయడం జరిగింది. అనంతరం జీవచ్ఛ్రాద్ధపద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనదేనని మహామహోపాధ్యాయ పం. శివకుమారమిశ్రా గారు, జ్యోతిర్వింద్వాంసులైన గణేశదత్త శాస్త్రి, ప్రియానాథ, గౌరీదత్త, కుబేర శర్మ గార్లు దీనికి ఉపాదేయత కల్పించడం జరిగింది. 

ఇవన్నీ సరే, పెట్టవచ్చా? కూడదా? పెట్టవచ్చునంటే పెట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారేమో.. 

#నిరభ్యంతరంగా_జీవశ్రాద్ధము_అందరూ_చేసుకోవచ్చు.

ప్రయాగలోని " శ్రీ హరిరామగోపాలకృష్ణ సనాతనధర్మ సంస్కృత మహావిద్యాలయం" లోని రిటైర్డ్ ప్రిన్సిపాల్ 
పండిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు, కాశీలో తమకుతామే శ్రాద్ధం పెట్టుకున్నారు. చేయించినవారు "శ్రీజోషణ్ రామ్ జీ పాండేయ్" గారు. జీవచ్ఛ్రాద్ధం పెట్టుకున్న రామకృష్ణ శాస్త్రి గారిని - ఆ విధానమంతా పుస్తకరూపంలో అందించమని గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారు అడగడం, ఆయన రాసి ఇవ్వడం, దానిని గీతాప్రెస్ వారు అచ్చువేయడంకూడా జరిగింది.  

             హేమాద్రి, వీరమిత్రోదయం లాంటి ధర్మశాస్త్ర గ్రంథాలు అయితే అలా పెట్టుకోమని ఆజ్ఞాపించాయి. 
#జీవన్నేవాత్మనః_శ్రాద్ధంకుర్యాత్_అన్యేషుసత్స్వపి
         ( హేమాద్రి - 1710పేజీ , వీరమిత్రో.శ్రాద్ధప్ర.363పేజీ) 
  
కొడుకులు ఉన్నవారు కూడా తమకు తాము శ్రాద్ధం పెట్టుకోవాలని దానర్థం. 
                                   లింగ పురాణం, ఆది పురాణం, ఆదిత్య పురాణం, బౌధాయనగృహ్యశేషసూత్రాలు, కృత్యకల్పతరు ఇత్యాది గ్రంథాలు కూడా ఈ శ్రాద్ధమును తెలిపాయి. ఇక సందేహాలు-సమాధానాలు చూద్దాం........ 

1. అలా పెట్టుకున్నవారు లోకవ్యవహారాలకు పనికొస్తారా? 

సమాధానము :- చక్కగా పనికి వస్తారు. పనికిరారనేది ఒక భ్రాంతి మాత్రమేనని పండితులు తెలియజేసారు. అదీగాక, లింగపురాణం అయితే, దంపతులు జీవచ్ఛ్రాద్ధం ఆచరించాక పిల్లలు కలిగితే, పిల్లవాడు బ్రహ్మవేత్త అవుతాడని, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు పార్వతీదేవి వలె విలసిల్లుతుందని తెలియజేస్తోంది. వారికి జాతకర్మాది సంస్కారాలను ఆ తల్లిదండ్రులు అందరువలెనే ఆచరించవచ్చునని కూడా లింగ పురాణం తెలిపింది. 

2. తాను పెట్టుకుంటే భార్య విధవ అయినట్లేనా ? 

సమాధానం:- ముందు భార్యకి చేసి, అనంతరం తాను చేసుకున్నట్లయితే ఆ శంక కూడా ఉండదు కదా! 

3. తనకి పెట్టుకునే శక్తి లేనట్లయితే, వేరే వారిచే పెట్టించవచ్చా? 

సమాధానం :- నిరభ్యంతరముగా పెట్టించవచ్చు.

4. పెట్టుకున్న వారికి అశౌచాదులు ఉంటాయా? 

సమాధానం :- అశౌచం, సూతకం ఉండవు. స్నానంతో శుద్ధి

5. ఎక్కడ పెట్టుకోవాలి? 

"పర్వతే వా నదీతీరే వనే వాయతనేऽపి వా 
జీవచ్ఛ్రాద్ధం ప్రకర్తవ్యం మృత్యుకాలే ప్రయత్నతః "
              అని లింగ పురాణ వచనం. అనగా పర్వతములయందు గానీ, నదీతీరమునందుగానీ, అడవియందుగానీ, ఇంటియందుగానీ ఈ జీవచ్ఛ్రాద్ధం ఆచరించాలి. 

6. అలా పెట్టుకున్నవారు ఇక చనిపోయినట్లే లెక్కా? 

సమాధానం :- కాదు. ఆ భావన తప్పు. ఎందుకంటే వారికి శ్రాద్ధప్రక్రియ లో "ప్రేత" శబ్దం వాడ వద్దని, జీవ శబ్దమే వాడమని శ్రాద్దమయూఖము, శ్రాద్ధ పద్ధతి అనే గ్రంథాలు చెబుతున్నాయి. 

7. ఈ ప్రక్రియను సంక్షిప్తంగా వివరించగలరా ? 

      ఈ జీవచ్ఛ్రాద్ధపద్ధతి ని ఏ నెలలోనైనా  కృష్ణద్వాదశి నాడు మొదలుపెట్టి శుక్లప్రతిపత్ నాటితో పూర్తి చేయాలి. మొత్తం 5 రోజుల కార్యక్రమం ఇది. పరిశీలించండి....... 

#మొదటిరోజు :- అధికారప్రాప్తికై ప్రాయశ్చిత్తానుష్ఠానము, దాని పూర్వాంగ,ఉత్తరాంగ కృత్యాలు, దశమహాదానాలు, అష్టమహాదానాలు, పంచధేనుదానము మొదలైనవి 

#రెండవరోజు :- సాలగ్రామ పూజ, జలధేనుస్థాపన-పూజ, వసురుద్రాదిత్యపార్వణశ్రాద్ధము , రాత్రి జాగరణ మొదలైనవి. 

#మూడవరోజు :- పుత్తలనిర్మాణము , షట్పిండదీనములు, పుత్తలదాహము, దశగాత్రపిండదానము, శయనాదులు. 

#నాల్గవరోజు :- మధ్యమషోడశీ, ఆద్యశ్రాద్ధము, శయ్యాదానం, వృషోత్సర్గం, వైతరణీగోదానం, ఉత్తమషోడశశ్రాద్ధము మొదలైనవి. 

#ఐదవరోజు :- సపిండీకరణశ్రాద్ధము, అనంతరం గౌరీ-గణపతులకు పూజ, కలశ పూజ, శయ్యా-పద దానములు, బ్రాహ్మణభోజనాదులు. 

           అందువలన ఈ ప్రక్రియను అందరూ నిరభ్యంతరంగా ఆచరించుకొనవచ్చునని తెలియజేస్తూ , దీనిని ఖండించే వారెవరైనా ఉంటే, దానికి సంబంధించిన శాస్త్ర ప్రమాణములతో కామెంట్ చేయమని ప్రార్థిస్తూ.....

🌹🌹🌹సర్వంశివసంకల్పం🌹🌹🌹

No comments:

Post a Comment