Sunday, August 20, 2023

విద్య ఎక్కువయితే వినయం పెరగాలి కదా..... కానీ ఇతనికి మాత్రం పొగరు బాగా పెరిగిపోయింది.

 ఒక ఉరిలో ఒక పండితుడు వుండే వాడు. అతనికి రాని విద్యంటూ ఏదీ లేదు. వేద వేదాంగాలూ, సకల శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలూ అన్నీ నేర్చేసుకున్నాడు. విద్య ఎక్కువయితే వినయం పెరగాలి కదా..... కానీ ఇతనికి మాత్రం పొగరు బాగా పెరిగిపోయింది. 
         నా అంత మొనగాడు ఈ ముల్లోకాల్లో ఎక్కడా వుండడని విర్రవీగుతూ నెలకొక రాజ్యానికి వెళ్ళి "మీ రాజ్యంలో ఏ విద్యలోనైనా సరే నాతో పోటీపడే పండితుడుంటే రమ్మనండి. మీరు గెలిస్తే నేను గుండు చేసుకొంటా, ఓడిపోతే వాళ్ళు గుండు చేయించ్చుకోవాలి" అని పందెం కట్టేవాడు. 
        మొదట్లో చాలా మంది పండితులు అతనితో పోటీ పడ్డారు గానీ ఎవరూ గెలవలేదు. నెమ్మదిగా అతని పేరు అన్ని రాజ్యాలకూ పాకిపోయింది. అంతే ఈ దెబ్బతో అతనితో పోటీ అంటే చాలు ఎవరు చూసినా 'మేం రామంటే మేం రాం' అని పారిపోయేటోళ్ళు.              దానితో అతనికి ఇంకా బాగా పొగరు పెరిగిపోయింది.
        అలా ఆ పండితుడు ఒక్కొక్క రాజ్యమే వెళ్ళడం, అక్కడి పండితుల్ని ఓడించి వస్తూవుండగా... ఒకరోజు కందనవోలు అనే రాజ్యానికి చేరుకున్నాడు. 
       దానికి రాజు విక్రమసింహభూపతి. ఆయన చాలా పరాక్రమవంతుడు. గొప్ప సమయస్ఫూర్తి కలవాడు. యుద్ధంలో గెలవడమే తప్ప ఓడడం తెలీనివాడు. చాలా మంచి వాడు కూడా, అడిగిన వాడి కల్లా లేదనకుండా దానం చేసేటోడు. అటువంటి ఆ మహారాజు ఆస్థానానికి వెళ్ళి ఈ పండితుడు సవాల్ విసిరాడు.
       అప్పటికే ఆ పండితుని గొప్పతనం గురించి అన్ని రాజ్యాలలోని వాళ్ళకు బాగా తెలిసిపోయింది. దాంతో పోటీ పడడమెందుకు, గుండు కొట్టిచ్చుకోవడమెందుకు అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
       పోటీలో పాల్గొని ఓడిపోయినా పరవాలేదు గానీ అసలు పోటీలోనే పాల్గొనకుండా చేతులెత్తేస్తే ఏం మర్యాదగా వుంటుంది అనుకొని ఆ రాజు పోటీలో పాల్గొన్న వాళ్ళకు అడిగినంత ధనమిస్తా అని ప్రకటించినాడు. కానీ ఒక్కరు గూడా ముందుకి రాలేదు. 
         అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించి ఆఖరికి అంతఃపురంలో వంటలు చేసేవాన్ని పిలిపించడం జరగింది. అతనికి ఒకే ఒక కన్ను కలవాడు. అంతేగాదు అచ్చరం ముక్క గూడా రాదు. ఒట్టి చవట మెుద్దు.
           అతనితో  రాజు “రేయ్... రేపు ఆ పండితునితో పోటీకి నిన్ను పంపుతూవున్నా అన్నాడు. దానికి ఆ వంటవాడు  "మహరాజా నాకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు కదా... మరినేనెట్టా పండితుడితో పోటీ పడేది" అన్నాడు పనివాడు. అది విన్న రాజు నవ్వి...    "నువ్వు పోట్టీలో నిశబ్ధంగా మాట్లాడకుండా కూర్చొని వుండు.     
          అప్పుడు నేనుండుకొని  సైగల్లో పోటీ అని చెప్తా. నీ ఇష్టమొచ్చినట్లు సైగలు చెయ్,.... అంతే నీకు వచ్చిన భయమేమి వుండదు. ఆ తరువాత అంతా నేను చూసుకొంటా" అన్నాడు. అప్పుడు ఆ పనివాడు సరేనన్నాడు.
       తరువాత రాజు వంటోనికి గొప్ప పండితుని లాగా వేషం వేయించి పోటీకి నిలబెట్టాడు. అతని డాబూ, దర్పం చూసి ఆ పండితుడు అబ్బో పెద్ద పండితుడేమో అని అనుకున్నాడు. 
           అంతలో రాజు “మా రాజ్యంలో వున్న పండితులందరి కన్నా ఈయనే గొప్పోడు. కానీ ఈయన ఇప్పుడు మౌనవ్రతంలో వున్నాడు. కాబట్టి సైగలే తప్ప నోరు విప్పి ఒక్కమాటా మాట్లాడడు. నీవు అన్ని విద్యలలోనూ పండితునివి గదా. చేతనయితే సైగల్లో పోటీ చేసి అతనితో గెలువు చూద్దాం" అన్నాడు. 
            పండితుడు “దానిదేముంది. సరే" అని నాకన్న మించినవారు ఎవరున్నారనుకొంటూ ఒప్పు కొన్నాడు.
             రాజు పండితున్ని మెుదట మొదలు పెట్టమన్నాడు.  అప్పుడు పండితుడు వంటోని వైపు చూసి చిరునవ్వు నవ్వి చెయ్యెత్తి 'ఒక వేలు' చూపించినాడు. 
                      అది చూస్తూనే వంటోనికి చాలా కోపమొచ్చేసింది. వెంటనే వంటోడు  'రెండు వేళ్ళు' ఎత్తి చూపించినాడు. 
                పండితుడు కాసేపాలోచించి ఈసారి 'మూడువేళ్ళు' ఎత్తి చూపించినాడు. 
         వెంటనే వంటోడు పల్లు పటపటపట కొరుకుతూ కోపంగా వూగిపోతూ 'పిడికిలి' ని బిగించి ఆ పండితుడికి చూపించాడు  . 
            అది చూసిన ఆ పండితుడు  ఆశ్చర్యానందంతో పరుగు... పరుగున వచ్చి వంటోడి కాళ్ళు పట్టుకొని “మహానుభావా ఏమో అనుకుంటి గానీ మీ అంత గొప్ప పండితుడును నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు  ఇక నేను ఓడిపోయాను" అని అందరి ముందూ గుండు కొట్టిచ్చుకోని వెళ్ళబోతుండగా.....ఇదంతా చూసి ఆ రాజుకు ఏమీ అర్ధం కాలేదు. “ఈ వంటోడేంటీ...., ఆ పండితున్ని ఓడించడమేంటీ" అనుకుంటూ...     ఆ పండితున్ని పక్కకు పిల్చుకోని పోయి 'మహానుభావా! మీరిద్దరు ఏమి సైగలు చేసుకున్నారో, దానికర్థం ఏమిటో నాకు ఒక్క ముక్కా అర్ధం కావడంలేదు. దయచేసి కొంచం వివరించి చెప్పండి" అన్నాడు రాజు.
        అప్పుడా పండితుడు "ఏం లేదు మహారాజా! ఈ లోకాన్ని పరిపాలించే దేముడొక్కడే గదా... అందుకే నేను మొదట 'ఒక వేలు' ఎత్తి చూపించినాను. కానీ మీ పండితుడు దాన్ని ఒప్పుకోకుండా శివకేశవులు ఇద్దరు గదా అని 'రెండు వేళ్ళు' చూపించినాడు. 
      దానికి సమాధానంగా నేను అట్లాగయితే బ్రహ్మను కూడా కలుపుకోని సృష్టిస్థితిలయకారులైన త్రిమూర్తులకు గుర్తుగా 'మూడు వేళ్ళు' చూపించినాను.        కానీ వెంటనే అతను దేవుల్లెంతమంది వున్నా అందరూ కలిసే ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు అని 'పిడికిలి' బిగించి చూపించాడు. 
               దాంతో ఇక ఏమి సమాధానం చెప్పాల్నో అర్ధంగాక నేను ఓటమిని ఒప్పుకున్నాను. ఎంతో మంది పండితులను ఒడించిన నేను, నిజంగా .....అంత గొప్ప పండితున్ని నేనింతవరకూ ఎక్కడా చూడలేదు" అని వివరించి చెప్పాడు.
           ఆ మాటలకు రాజు ఆశ్ఛర్యపోయినవాడై ఆ పండితున్ని సత్కరించి అతన్ని సాగనంపడం జరిగింది .          
                కానీ ఆరాజుకు ఏమీ పాల్పోవడం లేదు.
వంటోనికి అచ్చరం ముక్క గూడా రాదు గదా... మరి ఇన్ని విషయాలు ఎట్లా తెలిసినాయో కనుక్కోవాలని వంటోన్ని పిలిపించి “మీరిద్దరూ ఏమి సైగలు చేసుకున్నారో, దానికర్ధం ఏమిటో నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. అసలేం జరిగిందో కాస్త వివరించి చెప్పు" అన్నాడు.
               అప్పుడా వంటోడు “ ఏమిలేదు మహారాజా! ఏమో అనుకుంటిగానీ వానికి అతను పెద్ద పండితున్నని చాలా కొవ్వు. అందుకే నన్ను ఎగతాళి చేయడానికని నాకుండేది ఒకటే కన్ను గదా... అందుకని  ఎక్కిరిస్తూ 'ఒక వేలు' చూపించినాడు. 
          దాంతో నాకు కోపమొచ్చి నీకు రెండు కండ్లున్నా అవి నా ఒక్క కన్నుతో సమానం కావు..., అని వానికి 'రెండువేళ్ళు' చూపించినాను. 
         అంతటితో వాడు వూరుకోవచ్చు గదా... నన్ను మరింత ఎగతాళి చేస్తూ 'నీ ఒక కన్నూ, నా రెండు కండ్లు కలిపితే మూడవుతాయి గదా' అంటూ నాకు 'మూడు వేళ్ళు' చూపిచ్చి నవ్వినాడు. 
              దాంతో నాకు ఒళ్ళు మండిపోయి 'రేయ్... ఇంకొక్కమారు నా కన్ను గురించి ఎగతాళి చేసావో వంగబెట్టి గుద్దుతా చూడు" అని 'పిడికిలి' బిగించి చూపించినాను. 
      అంతే ఆ దెబ్బకు వాడు బెదరిపోయి నేను ఎక్కడ తంతానో ఏమో అనుకొని  లటక్కన నా కాళ్ళు పట్టుకొని  ఓడిపోయానని ఒప్పుకున్నాడు" అని చెప్పాడు పనివాడు. 
                         అది విన్న రాజు పక...... పక అని బిగ్గరగా నవ్వడంతో ...... రాజు అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక  వంటోడి తలగొక్కుంటూ వెళ్ళి పోయాడు.

No comments:

Post a Comment