Sunday, August 20, 2023

శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ధర్మ సూత్రాలు.

 *శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ధర్మ సూత్రాలు.🙏*

*ఒక పురుగు దేహంలో ప్రవేశించి నపుడు రోగం మొదలౌతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు. అలాగే చెడుని  చంపితేనే మంచి వస్తుంది.   ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది. కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి. నీవు నిమిత్త మాత్రుడివి. పుట్టిన వానికి చావు తప్పదు. యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట, కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది. మమకారం వదిలి పెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు.*

*కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు “ఇది ధర్మమా కృష్ణా!” అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు “నీవు ఒకే ధర్మాన్నిచూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. ఆవు శాకాహారము తింటుంది. మాంసాహారము తినదు. కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మమే.*
                 
*యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం  చేయలేదు. వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రావణుడు శివుణ్ణి దూషిస్తాడు. నీవు భక్తుణ్ణి రక్షించలేదని. ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడ్డాడు.*

*అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి. కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. మన ఇంట్లో దొంగలు పడ్డారు. సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. నీవు కారు వేసుకుని తారురోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి కదా! అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు.* 

*అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన ‘భగవంతుడు ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు’ అని నమ్మి విశ్వాసంతో నడవాలి.*

*పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు.*

*పొట్టకూటికి ప్రపంచ విద్యలు అనేవి ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే       దైవజ్ఞానం కావాలి.* 

*ప్రతి దేశంలోనూ యుద్ధం చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ‘ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా!’ అనుకోరు. కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధంఅయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం ఏమి చేయగలము? వారికి బానిసలు కావాలి. అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది. దీనుడైన అర్జునుడిని ధీరునివలె భగవద్గీత మార్చివేసినది. అదేవిధంగా చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసినవారు  ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.*
    
*భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే ‘గీతా పారాయణ కన్నా గీతా ఆచరణ ముఖ్యం’ అన్నారు. భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అంటే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరం లేదు. ఒక్క పుల్ల చాలు.*🦋

No comments:

Post a Comment