Sunday, August 20, 2023

జీవులు - గమ్యస్థానం

 *జీవులు - గమ్యస్థానం*
                  ➖➖➖✍️


ఒక కుక్క కాశికి వెళ్దామని బయలు దేరింది. దారి మధ్యలో ఒక బొక్క (ఎముక)కనపడింది. కాశికి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. 

అలాగే…
జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు.

కానీ జన్మించిన తర్వాత..
భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు.
సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు.

ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు.
జన్మించిన  తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు.

అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు.

అదృష్టవంతులలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను...

ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.

ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.

దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద (ఊబి)ఉంది అందులో ఆవు పీకవరకూ కూరుకుపోయింది.

ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.

ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.

కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది…
"నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది."

దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది…”నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా.

అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా..”అంది.

అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది.

అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు.మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?” అంది.

ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. 

కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.


ఈ కథలో...

ఆవు -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.

పులి-  అహంకారం నిండిఉన్న మనస్సు.

యజమాని - సద్గురువు/పరమాత్మ.

బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం

మరియు,

ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.

నీతి:

ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.

దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.

ఈ జగత్తులో 'సద్గురువు'(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?ఉండరు.

ఎందుకంటే.? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.

పరమాత్మా నీవే ఉన్నావు...!
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!
.

No comments:

Post a Comment