*బ్రహ్మ ముహూర్తం విశిష్టత................!!*
*నలుబై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కాని పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు.*
ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విధ్యలో వెనకబడటంపై అధ్యాయనం జరిపి అలాంటి విధ్యార్థులు బ్రహ్మ ముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్థారించారు.
సూర్యోదయానికి నలుబై ఎనిమిది నిమిషాలకు ముందు బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతోంది. ఈ సమయాన్ని సరస్వతీ యానం అని కూడా అంటారు.
బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః
తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్
‘బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయి.’
"ఆలస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ అథనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం"
ఆలస్యంగా లేచే వానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుంటే మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖముండదు.
తెల్లవారుజామున లేచి ఆరోజు ఆరోగ్యంతో నిద్రలేచి నందుకు సృష్టి-స్థితి-లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకుని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నేరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి.
కశ్యప ప్రజాపతికి వినీతకి పుట్టిన అనూరుడు వినీత తొందరపాటు వల్ల జన్మతోనే కాళ్లు లేకుండా జన్మించాడు. బ్రహ్మదేవుడు అతణ్ణి సూర్యరథానికి సారధిగా నియమించి అతను (అనూరుడు) సూర్య రథాన్ని తీసుకువచ్చే సమయానికి ఎవరు నిద్ర లేచి కార్యసాధనలో నిమగ్నలవుతారో వారిపై ఏ గ్రహం, నక్షత్రం చెడు ప్రభావం చూపలేదని వరమిచ్చాడని ఒక కథ.
మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారు జాము సమయం ( బ్రహ్మ ముహూర్తం) అమృతం వంటిది. అధర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త...) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన...) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివికా! రాత్రి నిద్రోన్ముఖుడివికా! అంటారు మన మహర్షులు.
తెల్లవారు జామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి ప్రతి స్పందించగల్గుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.
తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది అత్యంత శక్తివంతమైన సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.
"కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్
తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః"
చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు.
‘తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్!
తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగల్గుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి. మార థాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు.
No comments:
Post a Comment