*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(13 వ భాగము)*
*వేదమూర్తులు తమ స్తుతిని కొనసాగించారు: “దేవా! ఒకానొక జీవుని పట్ల పక్షపాతము చూపించక నీవు సమదర్శిపై ఉంటావు. కోరికల కారణంగానే జీవులు వివిధ జీవనగతులలో సుఖదుఃఖాలను భోగిస్తారు. అంశలుగా వారంతా నిప్పుకణాల వంటివారు. జ్వలించే అగ్నిలో నిప్పురవ్వలు నాట్యమాడినట్లు నీ సహాయ్యముతోనే జీవులందరు నర్తిస్తారు. వారు కోరినవన్నీ నీవు సమకూరుస్తావు, అయినా సుఖ దుఃఖస్థితికి నీవు కారణము కాబోవు. దేవతలు, మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, పశువులు, క్రిములు, జలచరాలు వంటి నానారకాల జీవరాశి నీ యందే నిలిచియుండి సుఖదుఃఖాలను భోగిస్తారు.".*
*జీవులు రెండు రకాలుగా ఉన్నారు. ఒక తరగతివారు నిత్యముక్తులు, ఇంకొక తరగతివారు నిత్యబద్ధులు. నిత్యముక్త జీవులు ఆధ్యాత్మికజగత్తులో ఉంటారు. కాగా నిత్యబుద్ధులు భౌతిక జగత్తులో ఉంటారు. ఆధ్యాత్మికజగత్తులో జీవులు, భగవంతుడు* *ఇద్దరు తమ మూలస్థితిలో నెలకొని ఉంటారు. కాని భౌతిక జగత్తులో. భగవంతుడు తన నిరాకారతత్త్వములో సర్వవ్యాప్తియై ఉన్నప్పటికిని జీవులు తమ కృష్ణభక్తిభావనను కొద్దో గొప్పో మరచిపోయినవారై అగ్ని నుండి దూరమై మెరుపును కోల్పోయిన నిప్పురవ్వల వలె ఉంటారు. నిప్పురవ్వలు రాము పడే వివిధ స్థితుల ననుసరించి తమ వెలుగును ఎంతోకొంత నిలుపుకోగలుగుతాయి. నిప్పురవ్వలు ఎండు గడ్డి మీద పడితే మరొక పెద్ద అగ్నిని కలుగజేస్తాయి. ఇది విశుద్ధభక్తులకు అన్వయిస్తుంది. వారు దీనులు, అమాయకులైన జీవుల పట్ల కరుణను కలిగి ఉంటారు. విశుద్ధభక్తుడు బద్ధజీవుల హృదయాలలో కృష్ణభక్తిభావనను రగిలించగా ఆధ్యాత్మికజగత్తు యొక్క ప్రచండాగ్ని భౌతికజగత్తునందును ప్రకటమౌతుంది. కొన్ని నిప్పురవ్వులు నీటిలో పడి వెంటనే తమ వెలుగును కోల్పోయి ఆరిపోతాయి. లౌకికుల మధ్య జన్మించే జీవులను వీటితో పోల్చవచ్చును. వారి మూల కృష్ణభక్తిభావన నశించిపోయి ఉంటుంది. కొన్ని నిప్పురవ్వలు నేలపై పడి వెలిగి ఆరిపోయే మధ్యస్థస్థితిలో ఉంటాయి.*
*ఈ విధంగా కొందరు జీవులు కృష్ణభక్తిభావన లేనివారుగా, కొందరు ఉండీ లేనట్లుగా, కొందరు నిజంగా కృష్ణభక్తిలో ఉన్నవారై ఉంటారు. ఉన్నతలోకాలలో ఉండే బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడువంటి దేవతలందరు భక్తిభావనాయుతులే; ఇక కొందరు మానవులు ఏదో కొద్దిగా కృష్ణభక్తిభావనను కలిగి ఉంటారు. మరికొందరు పూర్తిగా కృష్ణభక్తి విస్మృతులై ఉంటారు. జంతువులు, పశువులు, మొక్కలు, వృక్షాలు, జలచరాలవంటి తృతీయశ్రేణి జీవులు పూర్తిగా కృష్ణభక్తిభావనను మరచి ఉంటారు. వివిధరకాల జీవుల స్థితులను అర్థము చేసికోవడానికి వేదాలలో ఇవ్వబడిన ఈ నిప్పురవ్వల ఉపమానము చక్కగాపాసగింది. కాని జీవులందరిపైన దేవదేవుడు, పురుషోత్తము డున్నాడు. అతడు సకలభౌతికస్థితుల నుండి సర్వదా ముక్తుడై ఉంటాడు.*
*అసలు జీవులు ఎందుకు అనుకోకుండ వివిధ జీవనస్థితులలోనికి పతనము: చెందారనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మొదట జీవులపై దృష్టప్రభావము ఉండదని తెలిసికోవాలి. ఈ అదృష్టమనే అంశము ఆచేతన జీవులకే అన్వయిస్తుంది. వేదవాఙ్మయము ననుసరించి జీవులు జ్ఞాన సంపన్నులు; ఆ విధంగా వారు చేతనులని పిలువబడతారు. కనుక భిన్నస్థితిలో వారు నెలకొనడము ప్రమాదవశాత్తు కాబోదు. వారు జ్ఞానసంపన్నులు కాబట్టి అది వారి ఇష్టమును బట్టే జరుగుతుంది. "సమస్తాన్ని త్యజించి నన్ను శరణువేడు"మని భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఈ భగవదనుభూతి విధానము ఎల్లరకూ లభ్యమై యున్నది. అయినా ఈ ప్రస్తావాన్ని అంగీకరించడము లేదా తిరస్కరించడ మనేది జీవుని ఇష్టముపై ఆధారపడియుంటుంది. "అర్జునా! ఇప్పుడు నీకు అంతా చెప్పాను. దీనిని ఒప్పుకుంటావో లేదో ఇప్పుడు నీ ఇష్టం" అని శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత చివరిలో అంటాడు. అదేవిధంగా భౌతికజగత్తుకు వచ్చిన జీవులు ఈ జగత్తును భోగించాలనే ఇష్టాన్ని ఎంచుకున్నట్టివారు. వారినందరినీ శ్రీకృష్ణుడే ఈ లోకానికి పంపించాడని కాదు. భగవంతుని నిత్య సేవను విడిచి తామే భోక్తలము కావాలని కోరుకునే జీవుల భోగానికే ఈ భౌతికజగత్తు సృష్టించబడింది. వైష్ణవ సిద్ధాంతము చెప్పేదేమిటంటే జీవుడు ఇంద్రియభోగాన్ని కోరుకొని భగవత్సేవను విస్మరించినపుడు తన ఇచ్ఛానుసారము స్వేచ్ఛగా వర్తించడానికి భౌతికజగత్తులో అతనికి స్థానము ఇవ్వబడుతుంది. ఆ విధంగా అతడు బద్ధజీవనస్థితిని తయారు చేసి సుఖదుఃఖాలను భోగిస్తాడు. భగవంతుడు, జీవులు ఇరువురును శాశ్వతముగా ఎరుక కలిగినవారు. భగవంతునికి గాని, జీవునికి గాని జన్మ మృత్యువులు లేవు. సృష్టిరచనము జరిగినపుడు జీవులు సృజించబడినారని కాదు. ఉన్నతమైన. భక్తిభావనస్థితికి చేరుకోవడానికి బద్ధజీవులకు అవకాశాన్ని ఇవ్వడానికే భగవంతుడు భౌతికజగత్తును సృష్టిస్తాడు. బద్ధజీవుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ప్రళయానంతరము నారాయణుని దేహములో ప్రవేశించి, తరువాత సృష్టికార్యము జరిగేటంతవరకు అక్కడే గాఢనిద్రలో ఉండిపోతాడు.*
*ఈ సందర్భములో వర్షాకాల ఉపమానము చక్కగా పొసగింది. వర్షము తరువాత తడినేల నానారకాలైన మొక్కలు పెరగడానికి అనుకూలమౌతుంది కనుక వర్గాన్ని సృష్టికి కారణంగా భావించవచ్చును. అదేవిధముగా భగవంతుడు ప్రకృతిని వీక్షించి. నపుడు సృష్టి జరుగగానే జీవులందరు వివిధజీవనస్థితులలో ఉత్పన్నమౌతారు. ఇది అచ్చము వాన తరువాత నానారకాలైన చెట్లు చేమలు పెరగడము వంటిదే. వాస ఒక్కటేయైనా మొక్కలు నానారకాలుగా ఉంటాయి. వాన నేల యంతటా ఒకేరకంగా కురిసినా నాటబడిన బీజాలను బట్టి నానారకాలు, నానా ఆకృతులు కలిగిన మొక్కలు ఉత్పన్నమౌతాయి. అదేవిధంగా కోరికల బీజాలు నానారకాలుగా ఉంటాయి. ప్రతీ జీవునికి భిన్న మైన కోరికలు ఉంటాయి. ఆ కోరికయే బీజరూపంలో ఒకానొక రకమైన దేహాన్ని ఉత్పన్నము కావిస్తుంది. దీనిని శ్రీల రూపగోస్వామి పాపబీజమని వర్ణించారు. మనిషి యొక్క భౌతికవాంఛలే పాపబీజాలు. భగవంతునికి శరణాగతులు కాకపోవడమే మానవుల పాపకోరిక యని భగవద్గీత వర్ణించింది. "అన్ని పాపాల నుండి నేను నీకు రక్షణనిస్తాను" అని అందుకే శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అన్నాడు. ఈ పాపపు కోరికలే నానారకాలైన దేహాలుగా ప్రకటమౌతాయి. కనుక ఒకనికి ఒక రకమైన దేహాన్ని, ఇంకొక జీవునికి ఇంకొక రకమైన దేహాన్ని పక్షపాత వైఖరిలో ఇచ్చాడంటూ ఎవ్వరూ భగవంతుని నిందించరాదు. ఎనుబదినాలుగు లక్షల జీవరాశుల దేహాలు జీవుల మనోభావాలను బట్టియే సృజించబడినాయి.. పురుషోత్తముడైన భగవంతుడు తమ ఇచ్చానుసారము వర్తించడానికి వారికి అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. కనుక జీవులు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని తీసికొని వర్తిస్తుంటారు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment