Sunday, June 29, 2025

 శ్రీ రమణ కథామృతం-2
దేహానివా? చైతన్యానివా?
తేజోమూర్తి అయిన ఆ యువస్వామికి ఆకర్షితులైన వారిలో పళనిస్వామి అనే విరాగి ఒకరు. ఈయన మాతృభాష మళయాళం. స్వామి కన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దాయన. ఊళ్ళో గ్రంథాలయానికి వెళ్లి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను చెప్పే గ్రంథాలను తెచ్చి స్వామికి ఇస్తూ ఉండేవాడు. అప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవని రమణునకు పళనిస్వామి తెచ్చే పుస్తకాలలోని విషయాలు తనకి అనుభవ సిద్ధమైనవేనని తెలిసొచ్చింది. ఆ విధంగా గ్రంథపఠనం ప్రారంభమైంది.
తల్లిగారు వెళ్లిపోయిన తరువాత రమణులు అరుణగిరిపై నుండే గుహలలో నివాసమేర్పరచుకున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు విరూపాక్ష గుహలో, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో ఉండేవారు. మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే ఆ స్వామిని దర్శించుకోవడానికి ఎందరో వచ్చేవారు. వీళ్లంతా ఆ మౌనస్వామి కంటే పెద్దవారే! వీళ్లలో ఇద్దరి, ముగ్గురి గురించి చెప్పుకుందాం.
స్వామి తిరువణ్ణామలైలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ఒక సాధువుండేవారు. ఆయన తరచూ స్వామిని కొండ మీదకు రమ్మంటూ ఉండేవారు. తీరా కొండపైకి స్వామి వెళ్లిన తరువాత ఆ సాధువు గ్రహించినదేమంటే ఇంతకు పూర్వం తన దర్శనానికి వచ్చే సామాన్యజనం ఇప్పుడు స్వామి దగ్గరకు వెళ్తున్నారనీ, తనని నిర్లక్ష్యం చేస్తున్నారని. అసూయను ఆపుకోలేక ఒకసారి స్వామి ముఖం మీద ఉమ్మేశాడు. పళనిస్వామి అతనిని కొట్టబోతే మౌనంగా సంజ్ఞలు చేసి స్వామి వారించారు. ఇదెట్లా సాధ్యమని మనం అనుకుంటాం. దేహం పట్ల ఏ విధమైన అభిమానమూ లేని ఆ మౌనస్వామిని ఆ సాధువు చేసిన అకృత్యం ఏమీ బాధపెట్టలేదు! ఇంతకూ ఆ సాధువు తన దేహాన్నే కదా అవమానపరచాడు? తానేమో చైతన్యస్వరూపుడాయె! స్వామి విరూపాక్షగుహలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ముఖ్యులిద్దరి గురించి చెప్పుకుందాం. ఒకాయన శివప్రకాశం పిళ్ళై! ఇంకొకరు కావ్యకంఠ గణపతిముని! శివప్రకాశం పిళ్ళై పట్టభద్రుడు. కాలేజీలో ఫిలాసఫీ అధ్యయనం చేశాడు. ఆయన స్వామిని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చేవారు. వాటినన్నిటినీ భద్రపరచుకుని కొన్నేళ్ల తరువాత ‘‘నాన్ యార్’’(నేనెవరిని) అనే గ్రంథంగా రూపొందించారు పిళ్ళై. ఈ ప్రశ్నోత్తరాల సంగతి తరువాత చూద్దాం.
కావ్యకంఠ గణపతిముని రమణుల కంటే ఒక ఏడాది పెద్దవారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేస్తుండేవారు. కాని ఆశించిన ఫలితం దొరకలేదు. చివరికి 1907లో మౌనస్వామిని ఆశ్రయించి, ‘తపస్సంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. గణపతిముని వైపు పదిహేను నిమిషాలు తదేకంగా చూసి మౌనస్వామి నోరు విప్పి మాట్లాడారు. అంటే అప్పటి వరకు (11 సంవత్సరాలు) మౌనంగా ఉన్న స్వామి మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట! రమణులు ఇచ్చిన సమాధానమేమిటో, దాని పర్యవసానమేమిటో తరువాత చూద్దాం.
………………….
భిక్షాటనలో పరమానందం

తన జనకుడైన అరుణాచలేశ్వరుని దర్శనం తరువాత దాదాపు రెండేళ్లు స్వామి (వెంకటరామన్) తిరువణ్ణామలైలోనే ఉన్నారు. కానీ, చిత్రమేమిటంటే ఆ కాలంలో వారు మళ్లీ ఆలయంలోకి వెళ్లలేదు. ఈ రెండేళ్లలో జరిగిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి.
మొదటిది.. ఆయన రూపంలో, ఆహార్యంలో వచ్చిన మార్పు. ఒత్తుగా పెరిగిన జుట్టునంతా తీయించేసుకున్నారు. యజ్ఞోపవీతాన్ని తీసేశారు. పంచెను చింపేసి.. కేవలం కౌపీనం మాత్రమే ధరించారు.
రెండోది.. భిక్షాటనం. దాని గురించి వారెమన్నారంటే.. ‘‘నేను భిక్షకు పోతుండేవాణ్ణి. రాత్రిళ్లు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకొని చూస్తూ ఉండేవారు. ఆ రోజులలో భిక్షకు వెళ్లడమంటే భలే హుషారుగా ఉండేది. అంతా అన్నం కలిపి నా చేతుల్లో ముద్దలు వేసేవారు. రెండు మూడు ముద్దలు వేయించుకొని తినేవాణ్ణి. నాలుగైదు ఇళ్లల్లో తినేసరికి కడుపు నిండిపోయేది. అలా బిచ్చమెత్తుకోవడంలో నేను అనుభవించిన రాచఠీవీనీ, దర్జానీ మీరు ఊహించలేరు. మొదట్లో పెంపకం ప్రభావం వల్ల కొంత సిగ్గుపడ్డాను. కానీ, ఏమాత్రం న్యూనతాభావం కలుగలేదు. ఒక్కొక్కసారి రాజాధిరాజులాగా ఉండేది నాకు. ఒక్కోసారి పాచిపోయిన గంజి పోసేవారు. ఉప్పురవ్వ కూడా ఉండేది కాదు. దానినే వీధిలో తీసుకునేవాణ్ణి. పండితులూ, ఇతర ప్రముఖులు వచ్చి సాగిలపడి నాకు నమస్కరించేవారు. నేను బిచ్చాన్ని ఆరగించిన తరువాత అరచేతులను తలకి రాసుకునేవాణ్ణి. పరమానందభరితుడినై పోయేవాణ్ణి’’ అని చెప్పేవారు స్వామి. ఆయన చెప్పిన ఈ స్థితిని మనం ఊహించలేం.
(సశేషం)
ఫ పింగళి సూర్య సుందరం
Sekarana from granthanidhi. Blogspot.com

No comments:

Post a Comment