*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(19 వ భాగము)*
*మాయావాద తత్త్వవేత్తలు ఒకప్పుడు రజ్జుసర్పభ్రాంతి వాదాన్ని పలుకుతారు. చీకటి సంధ్యలలో మెలికలు తిరిగిన త్రాడును అజ్ఞానవశముగా సర్పమని భావించడము జరుగుతుంది. కాని త్రాడును సర్పమని పొరబడడము త్రాడు గాని, సర్పము గాని మిథ్య యని చెప్పడము కాదు. కనుక భౌతికజగత్తు యొక్క మిథ్యా తత్త్వాన్ని వివరించడానికి మాయావాదులు ఉపయోగించే ఈ ఉపమానము సయుక్తికము కానే కాదు. ఒకానొక వస్తువును యథార్థముగా స్వీకరించినప్పటికిని నిజానికి దానికి అస్తిత్వమే లేనపుడు అది మిథ్య యని పిలువబడుతుంది. కాని ఒకదానిని అస్తిత్వము కలిగిన ఇంకొకదానిగా పొరబడితే అది మిథ్యయని చెప్ప బడదు. వైష్ణవ తత్త్వవేత్తలు భౌతికజగత్తును మట్టికుండతో పోల్చే యుక్తమైన ఉపమానాన్ని ఉపయోగిస్తారు. మట్టికుండను చూసినపుడు అది తత్ క్షణమే ఇంకొక వస్తువుగా మారిపోదు. అది తాత్కాలికమేమైనా* *నీళ్ళు తెచ్చుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. అది మట్టికుండ లాగానే ఎప్పటికీ మనకు కనిపిస్తుంది. కనుక మట్టికుండ తాత్కాలికమేయైనా మూలమైన పృథ్వికి భిన్నమైనా మిథ్యయని చెప్పలేము. అంటే మట్టికుండ, మట్టి అనేవాటిలో ఒక దాని నుండి ఇంకొకటి వచ్చింది.*
*కనుక రెండు కూడ సత్యమేనని నిర్ణయించవలసివస్తుంది. జగత్తు విలయము చెందిన తరువాత ప్రకృతి భగవంతునిలో ప్రవేశిస్తుందని భగవద్గీత నుండి తెలుస్తున్నది. భగవంతుడు తన వైవిధ్యపూర్ణ శక్తులతో నిత్యవిలసితుడై ఉంటాడు. భౌతికజగత్తు అతని నుండి ఉద్భవించింది; అటువంటి దానిని ఏదో శూన్యము నుండి వచ్చినదానిగా చెప్పలేము. శ్రీకృష్ణుడు శూన్యము కాదు. శ్రీకృష్ణుని గురించి మాట్లాడినపుడు అతని రూపము, గుణములు, నామము, పరివారము, వస్తుసామగ్రి అన్నీ ఉంటాయి. సమస్తానికీ మూల కారణము శూన్యము గాని, నిరాకారము గాని కాకుండ పరమపురుషుడే అయియుంటాడు. ఈ జగత్తు అనీశ్వరమని (నియామకుడు గాని, భగవంతుడు గాని లేనట్టిదని) అసురులు పలికినప్పటికిని తుట్టతుదకు అటువంటి వాదములు నిలువబోవు.*
*గోళ్ళు, జుట్టు వంటి నిర్జీవ పదార్థములు సజీవమైన దేహము నుండి ఉత్పన్నము కావడమనే మాయావాద తత్త్వవేత్తల ఉపమానము సరియైన వాదము కాదు. గోళ్ళు, జుట్టు నిస్సందేహముగా నిర్జీవమేయైనా అవి సజీవమైన జీవుని నుండి గాక నిర్జీవమైన భౌతికదేహము నుండే వస్తాయి. అదేవిధముగా తేలు ఆవు పేడ నుండి రావడము, అంటే జీవుడు జడపదార్ధము నుండి ఉత్పన్నము కావడము కూడ యుక్తికము కాదు. ఆవు పేడ నుండి వచ్చే తేలు నిశ్చయంగా ప్రాణియే అయినప్పటికిని జీవుడు ఆవు పేడ నుండి రావడము లేదు. కేవలము జీవుని దేహమే అంటే తేలు దేహమే ఆవు పేడ నుండి వస్తుంది. జీవులందరు ప్రకృతిలో నిలుపబడగా వారందరూ ఉత్పన్నమౌతారని భగవద్గీతలో చెప్ప బడింది. వివిధరూపాలు కలిగిన జీవుని దేహాలు ప్రకృతిచే ఇవ్వబడినా జీవుని కలుగజేసినవాడు భగవంతుడే. జీవునికి అవసరమైన దేహాన్ని ఒకానొక ప్రత్యేకమైన పరిస్థితులలో తల్లిదండ్రులిస్తారు. జీవుడు తన వివిధ కోరికల ననుసరించి ఒక దేహము నుండి వేరొక దేహానికి ప్రయాణిస్తాడు. ఆ వివిధ కోరికలే మనస్సు బుద్ధి అహంకారమనే సూక్ష్మరూపంలో అతనితో కూడి ఉంటాయి. ఉన్నతమైన ఏర్పాటుచే జీవుడు ఒకానొక దేహగర్భములో ఉంచబడగా ఆ రకమైన దేహము తయారౌ తుంది.*
*కనుక ఆత్మ జడపదార్ధము నుండి ఉత్పన్నము కాదు. అది ఉన్నతమైన ఏర్పాటుతో ఒకానొక దేహాన్ని పొందుతుంది. మన ప్రస్తుత అనుభవము ననుసరించి జడపదార్థము, ఆత్మ కలయికయే భౌతికజగత్తు. ఆత్మ జడపదార్థానికి కదలికను కలిగిస్తున్నది. ఆత్మ (జీవుడు), జడపదార్థము రెండును భగవంతుని భిన్నశక్తులు. ఇవి రెండును పరమ శాశ్వతుడు లేదా పరమసత్యము నుండే వచ్చినవి కనుక యథార్థములే గాని మిథ్య కావు. జీవుడు భగవదంశ కనుక శాశ్వతముగా నిలిచి ఉంటాడు. కనుక అతనికి జననమరణాలనే ప్రశ్నయే ఉండదు. భౌతికదేహము కారణముగానే నామమాత్రమైన జన్మమృత్యువులు కలుగుతాయి. రెండుశక్తులు పరబ్రహ్మము నుండియే ఉత్పన్నమైనవి కనుక మన అనుభవములో ఉన్నట్టి సమస్తము బ్రహ్మానికి అభిన్నం అనడమే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనే మహావాక్యానికి అర్థము.*
*ఈ భౌతికజగత్తు ఉనికిని గురించి అనేకమైన వాదములు ఉన్నను వైష్ణవ సిద్ధాంతమే సర్వోత్తమమై ఉన్నది. మట్టికుండ ఉపమానము కూడ చక్కగా పొసగుతుంది. మట్టికుండ రూపము తాత్కాలికమేయైనా దానికొక ప్రత్యేకమైన ప్రయోజనము ఉన్నది. ఒక చోట నుండి వేరొక చోటకు నీళ్ళు తీసికొని పోవడమే మట్టికుండ ప్రయోజనము. అదేవిధంగా ఈ భౌతికదేహము తాత్కాలికమేయైనా దానికొక విశేషమైన ప్రయోజనము ఉన్నది. అనంతకాలము నుండి ప్రోగుపడిన కోరికల ననుసరించి వివిధ రకాలైన దేహాలను పొందడానికి జీవునికి సృష్ట్యారంభము నుండియే అవకాశము ఇవ్వబడుతుంది. వాటిలో మానవజన్మము ఉన్నతమైన చేతనమును చక్కగా ఉపయోగించుకోగలిగిన మహత్తరమైన అవకాశము.*
*ఈ భౌతికజగత్తు సత్యమేయైతే దీనితో సంబంధాన్ని త్యజించి సన్న్యాసము తీసికొమ్మని గృహస్థులకు ఎందుకు ఉపదేశిస్తారని మాయావాద తత్త్వవేత్తలు ఒకప్పుడు వాదము చేస్తారు. కాని జగత్తు మిథ్య కాబట్టి లౌకికకర్మలను త్యజించమని చెప్పడము వైష్ణవ తత్త్వవేత్త అభిప్రాయము కాదు. వస్తువులు దేని కొరకు ఉద్దేశించబడినాయో దాని కొరకే వాటిని ఉపయోగించడము వైష్ణవ సన్న్యాస ప్రయోజనము. ఈ భౌతికజగత్తుతో వ్యవహారానికి శ్రీల రూపగోస్వామి ఆధ్యాత్మిక సురులకు రెండు సూత్రాలు ఇచ్చారు. వైష్ణవుడు లౌకికజీవనరీతిని త్యజించి సన్న్యాసము స్వీకరించేది భౌతికజగత్తు మిథ్య యనెడి భావనలో కాకుండ భగవత్సేవకే తనను పూర్తిగా అంకితము చేసికోవడానికి అయియుంటుంది. అందుకే శ్రీల రూపగోస్వామి ఈ సూత్రాన్ని ఇచ్చారు "భౌతికాసక్తి అర్థరహితము కనుక మనిషి భౌతికజగత్తు పట్ల అనాసక్తుడై ఉండాలి. సమస్త జగత్తు శ్రీకృష్ణునికే చెందినట్టిది. కనుక సమస్తాన్ని కృష్ణుని కొరకే ఉపయోగించాలి; భక్తుడు లౌకిక విషయాల పట్ల అనాసక్తుడై ఉండాలి." వైష్ణవ సన్న్యాసముయొక్క ప్రయోజన మిదే. లౌకికుడు ఇంద్రియభోగార్ధమై భౌతికజగత్తు పట్ల ఆసక్తుడై ఉంటాడు. కాని వైష్ణవ సన్న్యాసి స్వీయభోగార్ధము దేనినీ స్వీకరించక పోయినా భగవత్సేవార్ధము సమస్తాన్నీ ఉపయోగించగలిగే కళను ఎరిగి ఉంటాడు. అందుకే శ్రీల రూపగోస్వామి తమ రెండవ సూత్రముతో మాయావాద సన్న్యాసులను ఈ విధంగా విమర్శించారు. "ప్రతిదానిని భగవత్సేవ కొరకు వినియోగించవచ్చునని ఎరుగని కారణంగానే మాయావాదులు ఈ జగత్తును మిథ్యగా భావించి తాము సంసారకల్మషము నుండి ముక్తులమైనామని మిథ్యగా తలుస్తారు." సమస్తము భగవచ్చక్తి విస్తారమే కనుక అదంతయు భగవంతుని వలెనే సత్యమై ఒప్పారుతుంది.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని 87 వ అధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment