Thursday, June 26, 2025

 జగతికి హితం జగన్నాథయాత్ర

సాధారణంగా ప్రతి దేవతా క్షేత్రంలోను ఆలయ నియమాలను అనుసరించి, ఆగమ శాస్త్రాల ప్రకారం రథోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

కానీ పూ(పు)రీ క్షేత్రంలోని రథోత్సవానికి మాత్రం ప్రత్యేకత ఉంది.
జగత్ప్రసిద్ధి చెందిన ఈ 'రథయాత్ర'లో ఆ క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ఎన్నో విశిష్టతలున్నాయి.

నిరంతరం తన దర్శనం కోసం ప్రజలు తరలి వస్తుంటే, ఏడాదికోసారి భగవానుడే ప్రజల వద్దకు వచ్చి, ఊరేగుతూ తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరించడం అద్భుతమైన అనుభూతి. విశేషించి- పురుషోత్తమ క్షేత్రం (పూరీ)లో రథాలు ఆగమ శాస్త్రానుసారం తయారు చేస్తారు.

వీటిలో మూల విరాట్టులే స్వయంగా అధిరోహించి ఊరేగుతారు.

వివిధ పురాణాల్లో విస్తృతంగా వివరించిన ఈ క్షేత్ర మాహాత్మ్యాలను పరిశీలిస్తే-పురాణకాలం నాటికే ఈ క్షేత్రం ప్రసిద్ధి వహించింది. అత్యంత ప్రాచీనకాలంలో ఇక్కడ 'నీలాచలం' పేరుతో కీర్తి పొందిన కొండ ఉన్నది.

'నీల మాధవుడు' పేరుతో నారాయణుని ఆరాధించేవారు. విష్ణుని వివిధ రూపాలతో ఇక్కడ ఋషులు, దేవతలు, భక్తిపరులు ఆరాధించిన వైనాలను పురాణాలు వర్ణిం చాయి. కల్పాంతకాలంలోనూ నశించని ముక్తి క్షేత్ర మిది-అని వ్యాసుని వాక్కు ఈ క్షేత్రాన్ని ఆధారం చేసుకొని ఒక గొప్పచరిత్ర, సంస్కృతి, భక్తి సంప్రదాయం ప్రవర్ధిల్లాయి. ప్రవర్ధమానమయ్యాయి.

కాలక్రమేణా- పూర్వ ఆరాధనల స్థానంలో, విష్ణువు ముగ్గురు మూర్తులుగా అర్చనలు పొందిన చరిత్రని పురాణకథలు పేర్కొన్నాయి. ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తికి విష్ణువు ఈ క్షేత్రంలో ప్రత్యక్షమై, వృక్ష రూపంలో వెలసి, దానితో నాలుగు మూర్తులను నిర్మించ మని ఆజ్ఞాపించాడని ఐతిహ్యం. బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు స్వయంగా విశ్వకర్మ నిర్మించిన మూర్తులివి అని మహర్షి వ్యాసుడు వర్ణించాడు.

ఆ మూర్తులను చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా ప్రతిష్ఠించాడంటారు. నాటినుంచి ఆయన విధించిన పద్ధతుల ప్రకారం వివిధ ఉత్సవాల నిర్వహణ ఏర్పాటైందని ఈ క్షేత్ర సంబంధ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

ఒకే విష్ణు స్వరూపం నాలుగు రూపాలై ఇక్కడ ప్రతిష్ఠితుడయ్యాడని పురాణ వచనం. సుభద్ర శక్తి స్వరూపిణి. ఈమె విష్ణు సోదరి (పద్మనాభ సహోదరీ- అని లలితానామం). బలభద్రుడు సంకర్షణమూర్తి, జగన్నాథుడు వాసుదేవ బ్రహ్మమే. సుదర్శన దేవుని ప్రతిమ ఒక స్తంభంపై మలచి, జగ న్నాధుని పక్కనే ఉంటుంది. ఈ నాలుగు మూర్తులకు వివిధ ఆరాధనలు జరుగుతాయి.

ఆషాఢ మాస శుక్ల ద్వితీయ (విదియ) నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ తిథి పుష్యమీ నక్షత్రంతో కూడినట్లైతే గొప్ప మహిమాన్వితమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ యోగంతో కూడిన ఉత్సవాన్ని 'మోక్షదాయినీ' అంటారు.

ఈ రోజున మూర్తులు రథాలపై 'గుండిచా మండపం' అనే పేరున్న స్థానంలో చేరతారు. జగన్నాథుడు మొదటగా ప్రకటమైన స్థలమిది. ఇది వేల యజ్ఞాలు జరిగిన స్థానమనీ, అత్యంత పవిత్రమైనదనీ ఆగమాల వచనం. ఇక్కడ కొన్నాళ్ళున్న తరువాత తిరిగి మందిరానికి ప్రవేశిస్తారు.

ఈ సమయమంతా ఉత్సవవేళ.

ఈ దివ్య రథయాత్ర ప్రభావం ఎంతటిదంటే- ఒరిస్సా రాష్ట్రంలోని ఇతర ప్రాంతా ల్లోనూ దీన్ని నిర్వహించడమే కాదు... విదేశాల్లో సైతం అక్కడి కృష్ణ భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

పూరీలోని ఈ నాలుగు మూర్తులు పూర్తి వేద విద్యాస్వరూపులు- అని వ్యాసుని నిర్వచనం.

బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు,
జగన్నాథుడు సామవేద స్వరూపుడు,
సుభద్ర యజుర్వేదమూర్తి,
సుదర్శనుడు అథర్వణవేద రూపం,

సర్వమంత్రమయ మైన నాలుగు మూర్తుల్లో- బలభద్రుని ద్వాదశాక్షరీ మంత్రంతోను. జగన్నాథుని పురుష సూక్త మంత్రాలతోనూ, దేవీ సూక్తాలతో సుభద్రా దేవిని, ద్వాదశాక్షరి (వాసుదేవ) మంత్రంతో సుదర్శనదేవుని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు స్పష్టపరచాయి.

ఇక్కడ నారాయణుడు నృసింహస్వామిగా, శ్రీకృష్ణునిగా, ద్వాదశాదిత్య మూర్తులుగా ఉపాసితులైనట్లు ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.

అనేక తీర్థాలతో, దేవతామందిరాలతో భాసిల్లే ఈ మోక్షపురి అణువణువూ దివ్య గాథానిలయం. సాక్షాత్తు మహాలక్ష్మి అధ్యక్షతలో, ఆ తల్లి బంగారు చేతులతో పాకమయ్యే అన్న పదార్థాలు 'పరమ పవిత్ర దివ్య ప్రసాదం'గా శాస్త్రప్రసిద్ధి.

పురీ అన్నప్రసాదం ఒక ప్రత్యేకాంశం.

ఆశ్చర్యకరమైన దివ్య పద్ధతిలో, అత్యంత శుచిగా వండే వివిధ రకాల ఆహార పదా ర్థాలను ఆగమ ప్రకారాలతో స్వామికి నివేదిస్తారు.

అలా నివేదించిన అన్న ప్రసాదాన్ని కుల మతాది భేదాలు లేకుండా అత్యంత పవిత్రంగా సేవిస్తారు.

చతుర్ధామాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ విష్ణుభూమి రథోత్సవంతో, ప్రసాదమహిమతో అత్యంత ప్రతిష్ఠను పొందింది.

సోదర సోదరీలతో కొలువుదీరిన వాసుదేవుడు జగన్నాథుడై విశ్వరథాన్ని నడిపిస్తున్న పరమాత్మగా దర్శన మిచ్చే ఈ పర్వదినం జగతికి హితం కలిగించుగాక!

సర్వ జగతిని సృష్టించి, పాలించి, లయింపజేసే నాథుడే జగన్నాథుడు. ధర్మ రక్షణ కోసం, భక్తుల భావన కోసం, తారణ కోసం ఆ విశ్వచైతన్యమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ పరమాత్ముడు శేషస్వరూపుడైన సోదరుడు బలభద్రునితో, సోదరిగా వచ్చిన పరాశక్తి (పద్మనాభ సహోదరి) సుభద్రతో వెలసిన దివ్యక్షేత్రం పురుషోత్తమ క్షేత్రం.

మనం 'పూరీ' అని వ్యవహరించే ఈ క్షేత్రాన్ని పురాణాలు 'పురి' అని పేర్కొన్నాయి. ప్రపంచంలో అరుదైన అద్భుతాలెన్నో ఈ క్షేత్రంలో ఉన్నాయి.

ఒక మహాగ్రంథమంత విస్తృతి కలిగిన అద్భుతాలకీ, చరిత్రకీ, విష్ణుశక్తికీ ఆలవాల మైన క్షేత్రమిది.

'జగన్నాథస్వామీ నయన పథగామీ భవతుమే' అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్థించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్ఠించారు.

సాగరతీరాన వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణ భక్తిసముద్రుడైన చైతన్య మహా ప్రభువులకు ఆరాధ్యమై, ముక్తిధామమయ్యింది.

జయదేవుని 'గీత గోవిందం' ఈ స్వామి ఆరాధనయే. ఈ మూర్తులలో జగన్నాథుని మూర్తి విలక్షణమైనది. అందులోనూ నయనాల శోభ ప్రత్యేకం. అవి చక్ర నయనాలు. అనంత దృష్టికి ప్రతీకలు. రెప్పలులేని కళ్లు భక్తులను రెప్పపాటు కూడా లేకుండా కరుణతో వీక్షించే నారాయణుని దయాంతరంగాన్ని చాటుతున్నాయి.

ఎక్కడా జరగని ఒక ప్రత్యేక రథోత్సవం ఈ క్షేత్రంలో ఏటా (ఆషాడ శుద్ధ విదియ నాడు) జరుగుతుంది. జగత్ప్రసిద్ధి చెందిన ఈ జగన్నాథ రథోత్సవం ఒక దివ్యానుభవం.

*"రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే"* అని స్మృతివచనం.

రథ మందున్న వామనుని చూస్తే పునర్జన్మ ఉండదని భావం.

శరీరాన్ని రథంతో పోల్చాయి ఉపనిషత్తులు, ఇంద్రియాలు గుర్రాలుగా, బుద్ధి శక్తులు పగ్గాలుగా నడిచే రథం ఈ శరీరం. నడిచే రథాన్ని చూస్తున్నాం గానీ - నడిపే రథిని దర్శించాలి. అతడే పరమాత్మ.

రథ సదృశమైన దేహమే నేను – అనే భ్రాంతిని వదిలి, దీనికి మూలమైన పరమాత్మ చైతన్యంతో ఈ 'నేను' తాదాత్మ్యం చెందితే... అతడే జ్ఞాని, అతడి జీవితమే నిజమైన రథయాత్ర. రథాన్నీ, తిరిగే ప్రపంచాన్నీ మాత్రమే చూసే చూపును దాటి రథంలోనున్న మూల చైతన్యాన్ని (ఆత్మను) గ్రహించే ఆత్మజ్ఞానం పొందినవాడు మోహాల వలయంలో చిక్కు కోడు. రథస్థ వామన దర్శన మంటే అదే.

'వామను'డంటే సూక్ష్మస్వరూపుడు. స్థూలమైన దేహ రథంలో అత్యంత సూక్ష్మంగా భాసించే జగన్నాథుడే వామనుడు. కేవలం శరీర రథంలోనే కాదు, విశ్వరథంలో విరాజిల్లేది కూడా విష్ణువే. ఒక రథంలా సూర్యచంద్ర గ్రహాది ఉపకరణాలతో తయారైనది ఈ విశ్వం. వేటికవి వేరైనా రథమంతా కలిపి ఒకటి. విశ్వంలో కూడా విడివిడిగా వివిధ ప్రత్యేకతలు గోచరించినా, అన్నీ ఒక దానితో ఒకటి సూక్ష్మమైన, బలీయమైన సంబంధం కలవి. అవన్నీ కలిపి ఒకే విశ్వ రథం. వీటన్నిటినీ నడుపుతున్న మహా చైతన్యమే విశ్వవిభుడు - జగన్నాథుడు.

*'కదలికను భావించినప్పుడు రథం. నిశ్చలతను దర్శించినప్పుడు క్షేత్రం.'* *'ఇదం శరీరం కౌత్తేయ క్షేత్ర మిత్యభిధీయతే'- 'నవద్వారే పురే దేహీ'.*

తొమ్మిది ద్వారాల పురమే ఈ దేహం. ఇదే క్షేత్రం. ఈ కారణం చేతనే ఈ క్షేత్రం పేరు 'పురి'.

మన తీర్థ క్షేత్రాలలో, ఉత్సవాలలో అందిరినీ అలరించే వేడుకలతోపాటు, ఆలోచించ గలిగే అంతర్ముఖులకు ఆత్మదర్శనం చేయించే తత్త్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

పూరీలోని మూడు రథాలలో జగన్నాథుని రథానికి 'నంది ఘోష' అనీ, 'గరుడధ్వజ' అనీ పేర్లు. సుభద్ర రథానికి 'దర్పదళన' అనీ, 'పద్మధ్వజ' అనీ పేర్లు. బలభద్రుని రథానికి 'తాళధ్వజ' అని పేరు. వీటి అశ్వాలకీ, ధ్వజాలకీ సంఖ్యలోనూ, నామాలలోనూ కూడా మంత్ర, దేవతా సంకేతాలు ఉన్నాయి.

స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో - జాగ్రత్ స్వప్న సుషుప్తులలో- భూత భవిష్యద్వర్తమానాలలో వ్యాపించిన విష్ణు చైతన్యాన్ని అవగాహన చేసుకోవడమే మూడు రథాలలోని ముమ్మూర్తుల సాక్షాత్కారం.

...

No comments:

Post a Comment