వీర నారి
*లక్ష్మీ బాయి* (1828 – 1858)
ఆమె, ఈ రోజు (జూన్ 18, 1858) న ఆంగ్లేయులతో పోరాడుతూ వీర మరణం పొందిన రోజు
భారత దేశ చరిత్రలో ధైర్య సాహసాలు గొప్ప పరిపాలనా దక్షత ప్రదర్శించిన వీర నారీమణులు పెక్కు మంది ఉన్నారు. మన అందరకి సుపరిచితమైన పేరు లక్ష్మిబాయి.
ఆమె పరిపాలించిన సంస్థానం, ఝాన్సీ, చిన్నదే మరియు ఆమె రాణిగా పరిపాలించిన సమయం కూడా తక్కువే. అయినా, ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆంగ్లేయులను ఎదుర్కొన్న తీరు గొప్పవి. మరియు ఆమె ఎదురుతిరిగిన సందర్భం భారత్ చరిత్రలో ప్రధమ స్వాతంత్ర్య పోరాటం గా నిలిచిపోయిన ముఖ్య ఘట్టం.
ఈమె జన్మ స్థలం వారణాసి. తల్లితండ్రులు పెట్టిన పేరు మణికర్ణిక. ముద్దు పేరు ‘మను’. ఈమె తండ్రి మరాఠా నాయకుడు రెండవ బాజీ రావు పీష్వా వద్ద సైన్యాధ్యక్షుడు. అప్పుడే ఈమెకు పలు యుద్ధ విద్యలలో ప్రావీణ్యం పొందినది.
ఆమె వివాహం 1842 లో ఝాన్సీ (झाँसी) రాజు గారు గంగాధర రావు తో జరిగినది. అప్పటి ఆచారం ప్రకారం ఆమె పేరు మార్పు జరిగి లక్ష్మి బాయి గా మారింది. ఈ దంపతులకు సంతానం లేదు. వారు దామోదర్ రావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు.
అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కి గవర్నర్ జనరల్ డల్హౌసి. అతను సంస్థానాలు ఆక్రమించుకోవడానికి ఒక పధకం ప్రవేశ పెట్టాడు. దాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ఏ సంస్థానం లో వారసుడు లేడో ఆ సంస్థానం బ్రిటిష్ రాజ్యం లో విలీనం అయిపోతుంది. డల్హౌసి ఈ పద్ధతి ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బ్రిటన్ లో దత్త పుత్రునికి రాజ్యాధికారం సంక్రమించదు. అది వారి చట్టం. వారి చట్టం మనదేశం లో చెల్లదు కదా. ఆక్రమించుకోవడానికి ఏదో సాకు కావాలి.
లక్ష్మి బాయికి, ఈ బలవంతపు విలీనం, సహజం గానే ఇష్టం లేదు. ఆమె లండన్ కోర్టు లో దావా వేసింది. లాభం లేక పోయింది. తమ మీద దావా వేసిన లక్ష్మి బాయి మీద కంపెనీ ప్రభుత్వం కక్ష పూని ఆమెను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళ వలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. రాజుకు రాజ్యం వదలి పోవటం కన్నా అవమానం మరొకటి లేదు. ఇలాటిదే ఆంధ్ర దేశం లో విజయనగరం సంస్థానం లో జరిగినది. అది భీమిలి వద్ద ‘పద్మనాభం’ అనే ప్రదేశం లో భీకర యుద్ధానికి దారితీసింది. (ఆ వివరం మరొక సారి).
1857 మీ లో ఈస్ట్ ఇండియా కంపెనీ పై యుద్ధం మొదలైనది. దీనినే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. లక్ష్మి బాయి యుద్ధానికి సిద్ధమైనది. భీకర పోరు రెండు వారాలు సాగింది. ఝాన్సీ నగరం బ్రిటిష్ వారి వశమైంది. లక్ష్మి బాయి తప్పించుకొని, తాంతియా తోపే అనే విప్లవ నాయకుడి సహాయం తో గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకున్నది. కానీ తరువాత గ్వాలియర్ వద్ద జరిగిన యుద్ధం లో ఆమె వీర మరణం పొందినది.
మొదటి స్వాతంత్ర్య పోరాటం సఫలమై ఉంటే పరాయి పాలన అప్పుడే అంతమై ఉండేది. చరిత్రగతి మరో విధంగా ఉన్నది.
ఫోటో: గ్వాలియర్ వద్ద ఆమె సమాధి వద్ద ఆమె కాంస్య విగ్రహం. నేను మధ్య ప్రదేశ్ లో పనిచేసే రోజుల్లో, గ్వాలియర్ వెళ్ళినపుడు చూసే భాగ్యం కలిగింది.
వీరనారి లక్ష్మి బాయికి నీరాజనం.
జై భారత్!
P.S. झाँसी (Jhansi) – Here, the Jha represents a nasalized vowel sound. The "n" is not pronounced like the English hard "n", ( or Telugu న్ ) but rather nasalizes the preceding vowel (Jhaa see) So it's something like: Jhaa-see — where "Jhā̃" has a nasal tone, not a separate "n" sound.
- MA MURTY
No comments:
Post a Comment