#వ్యక్తిత్వం_2
🌹🌹🌹🌹
అనసూయ వడలి స్వీయ రచన
🌹🌹🌹🌹🌹
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి లోపలికి వెళ్లి ఆలూ వేపుడు, అన్నం ప్లేట్ లో తెచ్చి కలిపి తినిపించసాగింది. 'కధ' అన్నాడు. వాడికి ఇష్టమైన కధ రాజుగారు, ఏడు చేపల కధ.ఇంకే కధ చెప్పినా కంచం తోసేస్తాడు. శ్రావణి అది చెప్తూ అన్నము తినిపించింది.
వాడు తిని మంచం ఎక్కేసాడు. తల్లి చెయ్యిని గుండెలమీద పెట్టుకున్నాడు. ఆంటే జో కొట్టమని. జో కొడుతూ ఆలోచించసాగింది. వాడు పాట అన్నాడు. శ్రావణి తన కమ్మని కంఠం తో 'జో అచ్యుతానంద జో జో ముకుందా 'అని పాడసాగింది.
మధ్యలోనే సుధీర్ నిద్ర పోయాడు. కాని శ్రావణి చివరివరకు ఆ కీర్తన పాడింది. ఆమెకి సంగీతం ఆరో ప్రాణం. చిన్నప్పుడు పాడుతూవుంటే ఇంట్లో అందరు పనులు మానేసి వినేవారు. తండ్రీ వెంకట్రావు కి సంగీతమంటే ప్రాణం. అందుకే ఒక్కగానొక్క కూతురైన శ్రావణి కి సంగీతం చెప్పించాడు. శ్రావణి అతడి నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. చక్కగా నేర్చుకుంది.
కాని అత్తగారింట్లో ఒక్కరికి సంగీతజ్ఞానం లేదు. పెళ్ళి చూపుల్లో సంగీతం పాడమన్నారు కాని మొదటి చరణం పాడాక చాలు అన్నారు ఏకగ్రీవంగా.
పెళ్ళి అయిన కొత్తల్లో ఏదో పని చేస్తూ కళ్యాణి రాగం లో కీర్తన పాడుతుంటే అత్తగారు వచ్చి "ఇంక ఆపు శ్రావణి! ఇలా పాటలు
పాడుతూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి, అయినా పెళ్ళచూపుల సంగీతం విన్నాము కదా, ఇంక చాల్లే,"అని చీవాట్లు పెట్టింది.
అప్పటినుండి శ్రావణి గొంతు మూగపోయింది. తన పెళ్ళికి మరుదులు ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు. తనకి బిడియంగా ఉండేది. అసలు ఆ ఇంట్లో ఆంతా కొత్తగా ఉండేది.
శ్రావణి కి చిన్నతనం గుర్తుకు వచ్చింది. తండ్రి కలెక్టర్ ఆఫీస్ లో పని చేసేవాడు. తల్లి అట్టే చదువుకోకపోయినా చక్కని గాత్రం ఉండేది. సంగీతం నేర్చుకుంది, పట్టుబట్టి. తండ్రికి కూడా కొంచెం సంగీతజ్ఞానం వుంది.
తన ఇంటరెస్ట్ చూసి తనకి సంగీతం నేర్పించారు.ఒక్కసారి రాగం, తాళం చూసి వెంటనే పట్టేసేది. తను అమ్మ పోటీ పడి పాడేవారు.
తనకు ఇద్దరు తమ్ముళ్లు. తను ఇంటర్ మంచి పర్చెంటేజ్ తో పాస్ అయింది. తనకి మాథ్స్, ఎకనామిక్స్ ఇష్టం. ఎకనామిక్స్ లో పీహెచ్డీ చెయ్యాలని అనుకునేది. కాని ఈలోగా వీళ్ల సంబంధం వచ్చింది. పెద్ద ఆస్తిపరులు, అందరు మురిసిపోయారు, తను తప్ప.
అందరు తెల్లగా వున్నారు, పెళ్ళికొడుకు తప్ప. తను పెద్ద తెలుపు కాదు, కాని మెరిసే పెద్దకళ్ళు, తీరైన శరీరం సౌష్టవం, పెద్దజడ అందరు మెచ్చుకునేవారు. తను అందము గానే వున్నానన్న భ్రమ కలిగించాయి.
తండ్రితో ఇంకా చదువుకుంటాను అప్పుడే పెళ్ళి వద్దని అంది.
తండ్రీ "చూడు శ్రావణి నీ తరువాత ఇద్దరు మగపిల్లలు వున్నారు. వాళ్ళ చదువు చూడాలి కదా "అన్నాడు.
శ్రావణి ఇంక మాట్లాడలేకపోయింది. తండ్రీ ఖర్చు పెట్టినదానికి మూడింతలు ఖర్చు పెట్టి తనకు నగలు, చీరలు కొన్నారు. అందరు తన అదృష్టాన్ని పొగిడారు. అన్ని తంతులు అయి అత్తవారింటికి వచ్చింది. మరుదులు ఇద్దరు ఇంకా డిగ్రీ చదువుతున్నారు. వచ్చిన వారానికే భాగ్యలక్ష్మి తెలివిగా ఇంటి బాధ్యతలు కోడలికి అప్పగించి, ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతూ కూర్చునేది.
అప్పట్లో అందరికి మామూలు ఫోన్లే. అవి ఎక్కువ ఇళ్లలో కనిపించేవి కాదు.
వంటావిడ ఉండేది కాని ఆవిడకి ఏమేమి చెయ్యాలో పురమాయించవలసి వచ్చేది. ఆవిడ నెలలో నాలుగు రోజులు వచ్చేది కాదు. ఆ భారం శ్రావణి మీద పడేది. తల్లి దగ్గర సరదా పడి నేర్చుకున్న వంట అలా అక్కరకు వచ్చేది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం కి తినేవారు.
కాని అత్తగారు మామగారు మటుకు కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం చేసేవాళ్ళు.
తను, భర్త అందరి తరువాత భోజనం చేసేవాళ్ళు.
తను వడ్డీంచి కూర అన్నం తినేటప్పటికి రామచంద్ర మజ్జిగ లోకి వచ్చేసేవాడు. ఈ అష్టావధానం భరించలేక రామచంద్ర తిన్నాకే తను భోజనం చేసేది.
అన్ని సర్దుకుని వచ్చేటప్పటికీ 10.30 అయ్యేది. ఆ టైమ్ కి రామచంద్ర గుర్రు పెడుతూ నిద్రపోయేవాడు.
రోజు ఇదే రొటీన్. దానికి తోడు పిల్లలు పుట్టడం లేట్ అయింది. పెళ్ళి అయిన మూడేళ్ళకి సుధీర్ పుట్టాడు. అప్పటివరకు దెప్పుళ్ళు భరించింది. సుధీర్ పుట్టాక నల్లగా వున్నాడని అదో దెప్పుడు.
వాడికి ఏడాదిన్నర నిండింది, సరసిజని కడుపు తోటి వుంది.
సరసిజ, అదే' శ్రీ' తెల్లగా బొద్దుగా పుట్టింది. ఉంగరాల జుట్టు. అందరికన్నా అత్తగారు ఎక్కువ సంతోషించారు, తన పోలికతో పుట్టిందని.
ఈ లోగా పెద్దమరిదికి లెక్చరర్ పోస్ట్ రావడం, పెళ్ళి కుదరటం అన్ని ఒకేసారి కుదిరాయి. అమ్మాయి పేరు మీనాక్షి. తండ్రికి బంగారం షాప్, బోలెడు ఆస్తి. మీనాక్షి చక్కని చుక్క, తనలానే ఇంటర్ చదివింది.
ఎంత చేసినా బాధ కలగలేదు కాని తన రంగు గురించి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం తన చెవిలో పడింది. రామచంద్ర ఏమి అందగాడు. తనకన్నా బాగా నలుపు, అందుకే తనని చేసుకోవడానికి ఒప్పుకున్నారు, అని అనుకుంది
ఉక్రోషంతో.ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది.
తరువాత అంతకన్నా ఎక్కువైన మాటలు పడాల్సివచ్చింది.
పిల్లవాడి ఎలా పెంచాలో తెలియదు.వాడు పుట్టేటప్పటికి తనకి ఇరవై ఏళ్ళు. సుధీర్ కి మూడో నెల వచ్చేవరకు పుట్టింట్లో వుంది. ఇంక అక్కడనుండి ఫోన్ల మీద ఫోన్లు, వెంటనే వచ్చేయమని. అమ్మ అంటూనే వుంది, ఐదో నెల రానీవే, వెడుడుదువు కాని, అని బ్రతిమలాడింది.
తనకే కోపం వచ్చింది.
"ఇంకా చదువుకుంటానని ఆంటే, మీ భారం తీరిపోతుందని పెళ్ళి చేశారుగా, చూడు, మా అత్తగారికి తన ఫ్రెండ్స్ కి ఫోన్లు చేసే తీరుబడి ఉండి ఉండదు, అందుకే ఆ ఫోన్లు అని అక్కసుగా, ఇంకో తోడికోడలు కలవారి అమ్మాయి కదా, నాకన్నా తెల్లగా అందము గా ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇటు పుల్ల తీసి అటు పెట్టదు. మళ్ళీ దేంట్లోను నా సలహాలు, సంప్రదింపులు ఉండవు."అంది కోపంగా, శ్రావణి.
సారెతో శ్రావణిని అత్తారింట్లో దింపి వచ్చారు. ఇంటిల్లిపాదికి బట్టలు పెట్టారు.
మళ్ళీ బారసాల హడావుడి. సుధీర్ అని పేరు పెట్టారు. పిల్లాడికి, మురుగులు, గొలుసు, తల్లిదండ్రులు పెట్టారు. మళ్ళీ అందరికి బట్టలు.
శ్రావణి ఆ ఖర్చులకు నొచ్చుకుంది.
ఆంతా సద్దుమణిగాక అత్తగారు
గొణుగుడు ఏమిటో అర్థం కాలేదు.
ఆఖరికి అర్థం అయింది ఏమిటంటే నాసిరకం బట్టలు పెట్టారని, తనకి, మీనాక్షికి పెట్టిన చీరెలు పనిమనిషికి, చాకలి కి తను చూస్తుoడగానే ఇచ్చేసింది అత్తగారు.
తను తెల్లబోయింది.
తనకి పెట్టిన చీర వంటావిడకి ఇమ్మని హుకుం జారి చేసింది అత్తగారు. కాని తను ఇవ్వలేదు. తెలిసే చేసుకుని ఇప్పుడు ఈ విధముగా ప్రవర్తించడం తనకు నచ్చలేదు.
మొండిగా మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర నేను ఇవ్వను అని ఖండితముగా చెప్పింది.
రెండు రోజుల తరువాత తండ్రీ వచ్చి ఒక ప్యాకెట్ తెచ్చి అత్తగారికి అందించాడు. ఆవిడ అ ప్యాకెట్ లో చీర వంటావిడకి ఇవ్వడం చూసి తను తెల్లబోయింది.
(సశేషం)
No comments:
Post a Comment