పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ” అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.
తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.
ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు.
పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాథ. ఈ విధముగా రాలిన చెమట బొట్లే భీమా నదిగా గుర్తింపు వచ్చింది భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమన్నాడు. అప్పుడామె తనయుడి పేరు చిరస్థాయిగా వుండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా శివుడు వెలయవలెనని కోరుకుంది. అంతట పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహాద్రి పర్వతములలో వెలసాడు.
No comments:
Post a Comment