Wednesday, October 16, 2024

 *విజయనగరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం జాతర శుభాకాంక్షలు*
*15-10-24, మంగళవారం* 🙏🙏🙏🙏🙏

🕉 విజయనగరం సిరిమానోత్సవమంటే ఏంటి?

👉 సిరిమానోత్సవమంటే ఏంటి? 
👉 బొబ్బిలి యుద్ధానికి సిరిమానోత్సవానికి ఉన్న సంబంధమేంటి? 
👉 సిరిమానోత్సవం ఎలా మొదలయింది?

🔆 స్నేహం, వివాదం, యుద్ధం...
1757 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. 
ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు.
అయితే ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలి యుద్ధం.

👉సిరిమానోత్సవానికి దారి తీసిన పరిస్థితులేంటి?

🔆పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ మరణమే సిరిమానోత్సవానికి నాంది పలికిందని పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకటరావు అంటారు
"పైడిమాంబ చిన్నతనం నుంచి అమ్మవారి భక్తురాలు. యుద్ధం ఇరువంశాలకు మంచిది కాదని అపాలని ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన అన్న పెద విజయరామరాజును హతమార్చేందుకు జరుగుతున్న కుట్రను తెలియచేసేందుకు బయలుదేరిన పైడిమాంబకు తాండ్రపాపారాయుని చేతిలో పెద విజయరామరాజు మరణించారనే వార్త తెలుస్తుంది".

🔆"యుద్ధం అపేందుకు తాను చేసిన ప్రయత్నాలు వృధా కావడం, ఆ యుద్ధంలోనే తన సోదరుడు మరణించడం ఆమె తట్టుకోలేకపోతుంది. తన మరణంతోనైనా యుద్దానికి ముగింపు పలికి సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ...తాను విగ్రహాంగా మారి...దేవిలో ఐక్యమైపోతున్నానని చెప్పి ఆమె పెద్దచెరువులో దూకి మరణిస్తారు. ఇదే సిరిమానోత్సవం జరగడానికి కారణమైన తొలి సంఘటన" అని బంటుపల్లి వెంకటరావు వివరించారు.

🔆 కొందరు జాలర్ల సహాయంతో పైడిమాంబను చెరువు నుంచి వెలికి తీసేందుకు అప్పట్లో పైడిమాంబ అనుచరుడిగా ఉన్న పతివాడ అప్పలనాయుడు ప్రయత్నం చేశారు. 
పెద్ద చెరువులో పైడిమాంబ విగ్రహారూపంలో కనిపిస్తుంది. దానిని తీసుకుని వచ్చి దగ్గర్లో ఉన్న తోటలో ఒక గుడికట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనినే ప్రస్తుతం వనంగుడి అని పిలుస్తున్నట్లు  చెప్పారు.

🔆 ప్రజలను కరువు, వ్యాధుల నుంచి కాపాడేందుకు విగ్రహారూపంలో తాను దొరికిన రోజు నాడే తనకు ప్రతి ఏటా, దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు ఉత్సవం నిర్వహించాలని అమ్మవారు ఆజ్ఞాపించినట్లు స్థానికులు చెబుతారు.

👉చింతమాను... సిరిమాను ఎలా మారుతుంది?

🔆 సిరిమానోత్సవానికి నెల రోజుల ముందు అమ్మవారు తమ కలలో కనిపించి సిరిమాను చెట్టు ఎక్కడుందో తెలియచేస్తారని సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు  చెప్పారు.
ఈయన సిరిమానోత్సవానికి ఏడోతరం పూజారి. పైడిమాంబ విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా ఉన్నారు.

🔆"చింతచెట్టు మానునే సిరిమానుగా ఉపయోగిస్తాం. ఈ ఏడాది డెంకాడ పంచాయతీ లో  చింతమాను చెట్టు ఉందని అమ్మవారు చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆ చెట్లు యాజమానిని అడిగి తీసుకున్నాం. అక్కడ నుంచి పట్టుకొచ్చిన చింతమానును హుకుంపేటలో ఉన్న వడ్రంగులు సిరిమానుగా మారుస్తారు. ఈ సమయంలోనే భక్తులు హుకుంపేటలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించడం, చింతమానును సిరిమానుగా మార్చడంలో నీళ్లు, పసుపు చల్లుతూ సహాయం చేస్తారు" అని వెంకటరావు తెలిపారు.

👉సిరిమాను రూపంలోనే ఎందుకు?

🔆 హిందూ ఆలయాల్లో ధ్వజ స్థంభానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. వీటిని చెట్లమానుల నుంచే తయారు చేస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికి ఉన్న రెండు ఆలయాలైన వనంగుడి, చదురు గుడిలో ధ్వజస్థంభాలుండవు.

🔆"సాధారణంగా భక్తులు ధ్వజ స్థంభం దర్మనం తర్వాతే ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయితే పైడితల్లి అమ్మవారికున్న రెండు ఆలయాల్లో ధ్వజ స్థంభాలు లేకపోవడంతో...పైడితల్లి అమ్మవారు ధ్వజస్థంభాన్నే సిరిమాను రూపంలో ప్రజల వద్దకు తీసుకుని వెళ్తాం. దానిపై కూర్చున్న పూజరిని అవహించి ఆమె, ప్రజలకు, రాజకుటుంబీకులకు ఆశీర్వాదం అందిస్తారు" 

👉రథానికొక కథ ఉంది

🔆సిరిమానోత్సవంలో ప్రధాన ఆకర్షణ అందమైన రథాలే. సిరిమానుతో పాటే ఈ రథాలను కూడా తయారు చేయడం లేదా మరమ్మత్తులు, రంగులు వేయడం చేసే పని మొదలవుతుంది. ఇదంతా సిరిమాను పూజరి ఇంటి దగ్గరే జరుగుతుంది. ఇక్కడ తయారయ్యే రథాలు, వాటికి వేసే రంగుల వెనుక ఆసక్తికర విషయాలున్నాయి.

🔆"సిరిమాను సంబరంలో సిరిమాను రథంతో పాటు అంజలి రథం, జాలరివల రథం, తెల్ల ఏనుగు రథం, పాలధార రథం కూడా బయలుదేరుతాయి. విగ్రహ రూపంలో చెరువులో ఉన్న పైడిమాంబని బయటకు తీసిన బెస్తవారికి కృతజ్ఞతగా 'బెస్తలవల రథం, రాజ్య పరిరక్షణలో నిరంతరం ఉండే సైనికులను గౌరవిస్తూ...'పాలధార రథం', గజపతుల వంశానికి గుర్తుగా 'తెల్లఏనుగు రథం', పైడిమాంబ సహాయకులకు గుర్తుగా 'అంజలి రథం', ఉంటాయి.

🔆 సాధారణంగా ఉగాది సమయంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు నాగళ్లతో తొలేళ్ల ఉత్సవాన్ని చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పైడితల్లి అమ్మవారి పండుగనే తొలేళ్ల ఉత్సవంగా జరుపుకుంటారు. సిరిమాను సంబరానికి ముందు రోజు తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరుగుతుంది.

🔆"సిరిమానును అమ్మవారిగా ఆరాధించే ఉత్సవానికి ముందురోజు తొలేళ్లు నిర్వహిస్తారు. తొలి ఏరే తొలేళ్లుగా మారింది. ఏరు అంటే నాగలి. తొలేళ్ల రాత్రి రైతులకు విత్తనాలు అందజేస్తాం. వాటిని పొలాల్లో జల్లి నాగలితో భూమాతను పూజిస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని విశ్వాసం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. సిరిమానోత్సవంలో ఇదే ప్రధానమైనది.

🔆సిరిమాను ఉత్సవాలలో కళారూపాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారి వాహనమైన పులివేషాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.

🔆"ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నీళ్లు చల్లడం, కత్తిసాము, కర్రసాములతో పాటు వివిధ కళారూపాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. విచిత్ర వేషధారణలతో కూడా సందడి చేస్తుంటారు. ఇవన్ని కూడా మొక్కులు చెల్లించుకోవడంలో భాగమే 

👉ఉత్సవం తర్వాత సిరిమాను ఏమౌతుంది?

*🔆ప్రధాన ఉత్సవం రోజున సుమారు 60 అడుగుల పొడవుండే సిరిమాను చివరన పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను పైకి లేస్తుంది. ఈ సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది.
రాజకుటుంబీకులు*, ప్రముఖులు కోట బురుజు వద్ద కూర్చుని అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి రూపంగా భావించే సిరిమానును అధిరోహించిన పూజారి అందరికీ దీవెనలు అందిస్తారు*.
*ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్ ఘడ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా వస్తారు 
*🔆ఉత్సవం ముగిసిన తర్వాత సిరిమానును చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు. దానిని రైతులు తీసుకుని వాటిని ఇంట్లో ఉంచుకుని పూజలు చేస్తారు. కొందరు తమ పొలంలో పూజించే చోట ఉంచుతారు. అలాగే విత్తనాలతో పాటు పొలంలో వీటిని విసురుతారు. ఇదంతా కూడా మంచి పంటలు పండుతాయనే నమ్మకంతో చేస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం,   ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఆ ఏడాది అమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగుస్తాయి*

No comments:

Post a Comment