Monday, December 5, 2022

 ఒకరోజు గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, *ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి* అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యునికి ఇచ్చి, *ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు* అన్నాడు. రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి *దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు* అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ గమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవి ఏవైనా, లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. అదే ఈ కథలోని తత్త్వం. మనందరికీ అనుసరణీయం.

అలాగే మంచి వారితో గొప్ప వారితో శక్తి మంతులతో స్నేహం చేద్దాం... ఎవరా స్నేహితులు వారితో ఎలా స్నేహం చెయ్యాలి అనే సత్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకుందాం ఆచరిద్దాం, అధ్బుతంగా జీవిద్దాం.
     
ముందుగా ఆరోగ్యంతో స్నేహం చెయ్యండి, ఆ అరోగ్య మిత్రుడు మీకు పరిపూర్ణ మైన ఆరోగ్యాన్ని తద్వారా ఆనందాన్ని కూడా అందిస్తాడు.
     అలాగే సిరి సంపదలతో స్నేహం చెయ్యండి.
     కీర్తి ప్రతిష్టలతో స్నేహం చెయ్యండి.
     ఆనందం తో స్నేహం చెయ్యండి
     ఆత్మ జ్ఞానంతో మితృత్వం చెయ్యండి.
     ఇలా మీకు ఏది కావాలంటే వారితో స్నేహం చేసి ఆ ఆ స్నేహితులు ద్వారా కావాల్సినవి పొందండి.
     ఈ స్నేహానికి అడ్డుగా మనసు మాయగాడు అడ్డు తగులుతూ ఉంటాడు. వాడిని ఏమీ అనకుండా సరైన సాధన చేస్తే మనసు మాయగడికి పగ్గాలు పడతాయి.
     కావల్సిన వారందరితో స్నేహం చెయ్యాలంటే ఆషా మాషి కాదు... వారికి అతి ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు... ముందుగా వారిని పట్టుకుంటే మిగతా వారందరూ మీకు మిత్రులే.
     ఆ ముఖ్యమైన మిత్రుడు అందరిలో ఉన్న పరమాత్మ స్వరూపం అయిన ఆత్మ...
   ఆయన ఎక్కడో లేడు, మీలోనే మీతోనే ఉన్నాడు... వారిని కలసే మార్గం సరైన సాధన అనే ప్రయాణం.ఆ  సాధనలో ప్రయాణించాలి.
     ఇంకెందుకు ఆలస్యం ఆ మిత్రుని కలసి మిగతా మిత్రులతో కూడా స్నేహ బంధం ఏర్పరచుకొని ఆనంద తీరాలలో విహరించుదాం.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment