Sunday, January 12, 2025

***†ఆప్తవాక్యాలు 🍁☘️ 74. భార్యా శ్రేష్ఠతమా సఖా భార్య గొప్పదైన స్నేహితురాలు (మహాభారతం)

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


74. భార్యా శ్రేష్ఠతమా సఖా

భార్య గొప్పదైన స్నేహితురాలు (మహాభారతం)

అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు. స్త్రీ-పురుష సంబంధాలపై సనాతనధర్మం తపశ్శక్తితో గొప్పవ్యవస్థను ఏర్పరచింది.

ఆ ధర్మానికి మూలస్తంభం కుటుంబం. కుటుంబానికి మూలాధారం దాంపత్యధర్మం.కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురౌతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.

భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు.

("ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై
ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ,
ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం" -
అని మనుస్మృతి ఉపదేశం.)

“పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు?" - అని యక్షుడు ప్రశ్నిస్తే “భార్య”(భార్యా దైవకృతా సభా) అని సమాధానమిచ్చాడు ధర్మరాజు. ఈ స్నేహాన్ని చాటడానికే
వివాహంలో 'సప్తపది' (ఏడడుగులు) మంత్రాలున్నాయి.

వివాహ మంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక 'సఖ్యం' అని స్పష్టీకరించాయి."ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు. మనం ఎప్పుడూ స్నేహితులుగానే
ఉందాం. నీ స్నేహమే నాకు లభించింది. నీ స్నేహం విడవలేను. నా స్నేహం వీడకు" - అని వివాహమంత్రాల భావం.

“ధర్మార్థ కామాలలో నిన్ను అతిక్రమించను"(నాతి చరామి) అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు
వరుడు.

అసలు “పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థ కామాలను సమన్వయపరచే శక్తి భార్యకే ఉంది"... అని మహాభారతం చెబుతోంది. అర్థకామాలు భార్య ద్వారా
నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు. ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని ఉన్నతుని చేస్తున్నాయి. ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ
పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్ఠితమవుతుంది.

యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ - "స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు. మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు.పుణ్యమార్గం అతనికి గోచరించదు” - అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం.

( కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో
భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ.అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం.ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే
ప్రకృతీ-పురుషులనీ, ఆ అర్ధనారీశ్వరతత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.)

స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి.

మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీపడతాడో తన భార్య(భర్త)తోనూ అలాగే సహనశీలియై సఖ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని భేదాలు
వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం, స్నేహనిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం.

“సామ్రాజ్ఞి శ్వశురేభవ” మూర్థానాం పత్యురారోహ”

- “నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి,” “పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు" - అని ఉత్తమస్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన.

అర్థస్య సంగ్రహే పక్త్యాంచ పారిణాహ్యస్యచేక్షణే||

"ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ
ఆమెకే పూర్ణ అధికారం" - అని మనుస్మృతి ఉపదేశం.

స్త్రీకి ధనాన్ని ఆర్జించే వేదన ఉండరాదు - అని నిబంధించిన సంస్కృతంలోని ఉదారతని గ్రహిస్తే, “స్త్రీధనం కోసం ఆశపడే పురుషుడు అధముడు" - అని హెచ్చరించిన మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే, పవిత్రమైన వివాహ వ్యవస్థలో వరకట్నపు అపశ్రుతులు వినబడనే వినబడవు. 

కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేదబోధ.

అసలు దాంపత్య ధర్మం అనాది. సనాతనం. 

ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే ప్రకృతీ-పురుషులనీ,
ఆ అర్ధనారీశ్వర తత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది.
ఈ విషయాన్నే మనువు -

'ద్విధాకృత్వాత్మనో దేహమర్ధన పురుషో భవత్'
అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజతే ప్రభుః॥ అని తెలియజేశాడు.

విశ్వనిర్మాణానికే మూలం దాంపత్యభావం. ఒకే పరతత్త్వం రెండయ్యింది. అలాగే స్త్రీ-పురుషభావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియయం పాలించబడుతుంది. అంటే - దాంపత్యధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు

"అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా” “సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య(వేరుకానిది)”. దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా!        

No comments:

Post a Comment