Monday, January 27, 2025

 ☘️ *_కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ_* ☘️
✍️.......................................... 

*⭕విజయుడు అనే రాజు  "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.*

*⭕అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా  "మీరేమంటారు మంత్రిగారూ?!" అని అడగడం మొదలుపెట్టాడు..*

*⭕మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. 'ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే' అనుకున్నాడు ఆయన.*

*⭕ "మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.*

*⭕దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. 'ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.* 

*⭕ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు- ఆవుల్ని మేపుకుంటూ.*

*⭕"ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.*

*⭕"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.*

*⭕పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.*

*_⭕"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?"_ అడిగాడు విజయుడు.*

*⭕'గాలి'.... చెప్పాడు పశువుల కాపరి.*

*_⭕అన్నింటికంటే ఉత్తమమైన జలం?_*

*⭕"గంగాజలం"* 

*_⭕అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?_*

*⭕" ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే"*

*⭕"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.*

*⭕ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.*

*⭕"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.*

*⭕"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ..." అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.*

*⭕"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.*

*⭕"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి.*

*⭕"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.*

*⭕"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే 'ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"*

*⭕విజయుడు నివ్వెరపోయాడు. _"అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, 'అందరిలోకీ తెలివైనవాళ్ళు' అంటూ అసలు ఎందుకుండాలి?"_ అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.*

*⭕పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!*

*⭕అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా _" మంచి రాజు - అందరినీ ప్రోత్సహిస్తాడు"_ అని పేరు తెచ్చుకున్నాడు.*

⭕ *_చదివి చదివి కొంత చదువంగ చదువంగ_* 
 *_చదువు చదివి యింక చదువు చదివి_* 
 *_చదువు మర్మములను చదువలేడయ్యెను_* 
 *_విశ్వదాభిరామ! వినురవేమ!_* 

*⭕భావం: ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!*
~~~~~~~~~~~~~~~~~~
*_{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి. 

ఇది సేకరణ

No comments:

Post a Comment