Parimala Biradavolu
ఆ రోజు శనివారం ఐనా, ఆఫీస్ పని ఉండడంతో ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నాడు వాసు. ఇంట్లోకి కావలసిన వస్తువులు తేవడానికి లత బజారుకి వెళ్ళింది.
లత, వాసు ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నారు.
ఇద్దరు పిల్లలు వాళ్ళకి, అర మరికలు లేని ముచ్చటైన సంసారం వాళ్ళది.
లత సూపర్ మార్కెట్ లో ఉండగానే వాసునుంచి ఫోన్ వచ్చింది. ఊరినుండి ఫోన్ వచ్చింది అమ్మకు బాగలేదంట, వెంటనే ఇంటికి రమ్మని, కంగారుగా ఇంటికి వచ్చింది లత. అప్పటికే బాగ్ రెండు జతల బట్టలు సర్ధుకుని రెడీగా ఉన్నాడు వాసు, ఏమైంది అత్తమ్మకు కంగారుగా అడిగింది లత.
అమ్మ పడిందంట కాలుకి దెబ్బ తగిలిందంట. పక్కింటి నారాయణ ఫోన్ చేశాడు, నెల్లూరికి తీసుకుని పోతున్నారంట, రామచంద్రారెడ్డి హాస్పిటల్ లో చూపిస్తున్నారు, నేను బయలుదేరుతున్నాను అన్నాడు వాసు.
నేను కూడా వచ్చేదా అంది లత. వద్దులే నేను వెళ్ళాక పరిస్థితిని బట్టి చెప్తాను అని జాగ్రత్తలు చెప్పి వాసు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడు వాసు "అమ్మ కాలు విరిగింది ఆపరేషన్ చేయాలి అంటున్నారు, నువ్వు వెంటనే బయలుదేరు అని,"
ఇలాంటిదేదో అవుతుందని అనుకుంటూనే ఉంది లత. అందుకే పిల్లలను అక్కడే ఉంటున్న తమ్ముడి ఇంటికి పంపడానికి అన్ని సిద్ధం చేసింది.
వాసునుంచి ఫోన్ రాగానే పిల్లలను తమ్ముడి ఇంట్లో వదిలి పెట్టి నెల్లూరికి బస్ ఎక్కింది లత.
బస్సు చెన్నై సిటీ దాటింది, వాసుకి ఫోన్ చేసి చెప్పింది బయలు దేరానని,
లతకి ఎంత వద్దనుకున్నా గతం గుర్తుకు రాసాగింది. పెళ్ళైనప్పటి నుండి ఈ పదేళ్ళు అత్తమ్మ, ఎలా ఆమె ప్రవర్తనతో తనని బాధ పెట్ఠింది, తన వాళ్ళను ఎలా అవమాన పరచింది. అంతా ఒకసారి మళ్లీ కళ్ళ ముందుకు వచ్చింది.
అత్తమ్మది చాలా దురుసు స్వభావం, తన మాటే నెగ్గాలనే పంతం ఎక్కువ, లత మామగారు కూడా ఆమెను ఏమీ అనేవారు కాదు. దాంతో ఆమెకు తను ఏది చేసినా కరెక్ట్ అని, తనవల్ల తప్పులే జరగవని అహంకారం పెంచేసుకుంది.
అన్నిటినీ ఓర్చుకున్న లత, తన అమ్మ నాన్నలను కూడా అవమానకంగా మాట్లాడుతుంటే ఓర్చుకోలేక పోయింది. గొడవ పడింది, వాసు ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.
అత్త మామలను గౌరవించే క్రమంలో అమ్మ నాన్నలకు అవమానం జరుగుతుంటే సహించలేక పోయింది.
ఆరోజు ఆ ఇంటినుండి బయటకు వచ్చిందంటే మళ్ళీ వెళ్ళలేదు. రెండేళ్లవుతుందేమో అత్తమ్మను చూసి. బంధువులద్వారా, ఊళ్ళో స్నేహితులద్వారా ఆమె విషయాలు తెలస్తుంటాయి.
రెండు రోజులకు ఒకసారైనా నెల్లూరు టౌనుకి వెళ్లాలి ఆమె, ఊరంతా ఒక రౌండు వేసి వస్తుంది రోజు.
ఊళ్లోవాళ్ళు వాసుకి చెప్పే వారు అమ్మను అలా తిరగవద్దు అని చెప్పమని. కాని ఆమే ఎవరి మాట వినదు అని కూడ అందరికి తెలుసు.
వాసు చెప్పడానికి చూసినా వినిపించుకునేది కాదు, పైగా నన్ను ఎవరూ చూడనవసరం లేదు. నాకు మీ సహాయం అవసరం లేదు అనేది పొగరుగా. లత వెళ్ళకపోయినా వాసు నెలకి ఒకసారి వెళ్లి వాళ్ళ అమ్మను చూసి వస్తుంటే వాడు.
లత ఆలోచనలనుండి బయటకు వచ్చింది. బస్సు నాయుడుపేటకి వచ్చింది. సాయంకాలం అవుతుంది, కిటికీనుండి బయటికి చూస్తుంది, రోడ్డు పక్క ఇళ్ళల్లో అందరూ సందె కసువు చిమ్ముకుని నీళ్లు చల్లి సందె ముగ్గు పెడుతున్నారు, చేలల్లో నుంచి పశువులను ఇళ్ళకు తోలుకోని పోతున్నారు, బడి నుండి వచ్చిన పిల్లలు ఇంకా వీధుల్లో ఆటల మీదనే ఉన్నారు.
లత మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఇంత చేసిన ఆమెకు ఇప్పుడు వెళ్ళి సేవ చేయాలి, ఎలా మనసెలా వస్తుంది, మంచి చెప్పినపుడు వినలేదు, ఇప్పుడు కాలు విరిగింది, అన్ని మంచంలోనే చేయాలి, డబ్బులు ఇచ్చినా చేసే మనుషులు లేరు. మనసు విరిగిపోయినాక ఎలా సేవలు చేయాలి అసలు చేయగలనా.... ఇలా రకరకాల ఆలోచనలతో లత తల వేడెక్కి పోయింది.
ఆలోచనల్లో ఉండగానే గూడూరు వచ్చింది. బస్టాండు లో రెండు కప్పుల కాఫీ తాగింది అవును మరి ఒక కప్పులో రెండు గుక్కలకంటే ఎక్కువ కాఫీ ఉండదు.
బస్సు కదిలింది లత ఆలోచనలు కూడా..... ఇప్పుడు అత్తమ్మను చూసుకోవాలి అది తన భాద్యత. ఇది లతవైపు ఆలోచన, కాని అత్తమ్మవైపు ఆలోచిస్తే ఈ పరిస్థితులలో ఆమె కోరుకునేది ప్రేమ ఆప్యాయత, అయిందేదో అయిపోయింది నువ్వు భయపడకు నేను చూసుకుంటాలే అని లత నుండి భరోసా,
కాని తనని అన్ని బాధలు పెట్టిన అత్తమ్మను ఎప్పటికైనా సమాధానం అడిగి తన ఆవేదన తీర్చుకోవాలని ఉంది లతకి, ఆ ఆవేదన తీరకుండా అత్తమ్మతో ప్రేమగా ఉండలేదు. అలాగని తన భాద్యత వదిలి పెట్టలేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి భాద్యత అనుకుని చేస్తే లత మనసులో ఆవేదన తాలూకు వెలితి అలాగే ఉంటుంది, అత్తమ్మకు కూడా భాద్యతలోని బరువు కనిపిస్తుంది, అలా ఇద్దరూ అసంతృప్తిగానే ఉంటారు.
ప్రేమగా ఆప్యాయంగా సేవ చేస్తే అత్తమ్మ సంతోష పడతారు, తృప్తి పడతారు,లత మనసులో ఆవేదన క్రమంగా తగ్గిపోతుంది ఎందుకంటే అన్ని బాధలను, దుఃఖాన్ని నశింప చేసే ఔషధం ప్రేమ .ఆ ఆవేదన స్థానంలో ఆప్యాయత నిండిపోతుంది మనసు తేలిక పడుతుంది. ఇద్దరూ తృప్తిగా ఉంటారు.
కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న లత బస్సు కుదుపుకి కళ్ళు తెరిచి కిటికీ నుండి బయటకి చూసింది, ముసురుకొన్న మబ్బులన్నీ విడిపోయి నిర్మలమైన ఆకాశం ప్రశాంతం గా కనిపించింది. అచ్చంగా లత మనసు లాగానే.
అత్తమ్మ లతకు బాధను, దుఃఖాన్ని ఇచ్చింది, కానీ ఇవి ఇతరులకు ఇవ్వతగినవి కావు, మనకు ఎవరైనా ఇచ్చినా వెంటనే తీసి బయట పడవేయవలసినవి. అందుకని వాటిని తిరిగి అత్తమ్మ ఇవ్వడానికి లత మనసు ఒప్పుకోలేదు.
కాని ప్రేమ, ఆప్యాయతలు అందరికీ పంచవలసినవి, బ్రతికినంత కాలం పదిలం దాచుకో వలసినవి. అందుకని వాటినే లత తన అత్తమ్మకు ఇవ్వాలనుకుంది.
ఇప్పుడు లత మనసు చాలా నిలకడగా ఉంది, ప్రశాంతంగా ఉంది. బస్సు నెల్లూరు టౌన్లోకి వచ్చేసింది. అత్తా కోడళ్ళ అందమైన అధ్యాయం ఆరంభమం అవబోతుంది....
🙂
No comments:
Post a Comment