*_“మిడతంభొట్ల శకునం”_*
_[ఇదొక విచిత్రమైన సామెత. అదెలా పుట్టిందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే..]_
-----------------------
*ఈ వ్యావహారిక పదం వెనక ఒక కథ ఉన్నట్లు చెబుతారు. ఎవరైనా పనిమీద వెళ్ళే టప్పుడు వేరేవారు ఎదురైనప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిన పని క్షణాల్లో జరిగి లాభం చేకూరితే.. అతని శకునం _"మిడతంభొట్ల శకునం"_ అంటారు.*
*ఒక అగ్రహారంలో మిడతంభొట్లు అనే పేరుగల సామాన్యుడైన బ్రాహ్మణుడుండే వాడు.*
*అతను బ్రతుకుతెరువు కోసం జనాలకు జాతకాలు, శకునాలు చెబుతూ వాళ్లిచ్చినది తీసుకొని బ్రతుకు బండి లాగిస్తుంటాడు. వాస్తవానికి అతనికి జాతకాల గురించి ఏమీ తెలియదు.*
*అతని అదృష్ట మేమో గానీ... అతను చెప్పింది నిజంగానే జరిగేది. ఒకవేళ ఎప్పుడైనా జరగక పోతే ఏదో విధంగా సర్ది చెప్పేవాడు.. దానితో మిడతంభొట్లు కీర్తి పెరిగి పోయింది. అతని దగ్గర ఏదో అతీత శక్తి ఉందని ప్రచారం జరిగింది.*
*ఈ విషయం ఆ దేశపు రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన మిడతం భొట్లును పిలిపించి, నీ దివ్యశక్తితో నా పిడికిట్లో ఉన్నది ఏమిటో చెప్పమన్నాడు.*
*తలవని తలంపుగా జరిగిన ఆ పరీక్ష అతని పాలిట మృత్యువని నిర్ధారించుకొని, ఏమని చెప్పాలో పాలుపోక ఆ బ్రాహ్మణుడు తన దుస్థితికి చింతిస్తూ, ఏడ్వలేక నవ్వుతూ రాగయుక్తంగా _"చిక్కావయ్యా మిడతం భొట్లూ రాజు చేతిలోన"..._ అంటూ ఆలపించాడు.*
*రాజు పిడికిలి విప్పగానే అందులోని మిడత యెగిరి పోయింది. రాజు ఆ విప్రుని శక్తికి మెచ్చి, తన రాజ్యంలో ఉన్న ఏకైక జాతకరత్న మేధావి యని ప్రశంసించి, తన కొలువులో పదవి యిచ్చి గౌరవించాడు.*
*అచిరకాలం లోనే మిడతంభొట్లు పేరు రాజ్యమంతా మారుమ్రోగిపోయింది. పొగడ్తలు అతన్ని అందలం ఎక్కించాయి. అయినా మిడతం భొట్లుకు మాత్రం తను ఏ క్షణంలోనైనా ఉరికంభం ఎక్కవచ్చుననే భయం లోపల వెంటాడుతూనే ఉంది.*
*ఈ పరిస్థితుల్లో రాణిగారి వజ్రాలహారం కనిపించలేదు. రాణి గారు పనివాళ్ళనూ, దాసీలనూ ఎంత బెదిరించినా ఆ హారం ఎవరు తీశారో తెలియరాలేదు. విధిలేక రాణి గారు రాజుగారికి చెప్పారు. రాజుగారు మన మిడతంభొట్లు ఉండగా మనకేం భయం? అని మిడతం భొట్లును రమ్మని కబురు పంపించాడు.*
*రేపు ఉదయం లోపల దొంగ ఎవరో చెప్పాలని మిడతం భొట్లు ను ఆజ్ఞాపించాడు.. అతడు తను భయపడినంతా జరిగిందని విచారిస్తూ రాజప్రాసాదం దగ్గర పచార్లు చేస్తూ _"కాలి కొచ్చునో.. కంటి కొచ్చునో"_ అని పాడుకుంటూ తిరుగసాగాడు.(తన కాలే తెసేస్తారో, కన్నె తీసేస్తారో అని అలా పాడుతున్నాడు)*
*ఆ హారం కాలి, కంటి అనే ఇద్దరు దాసీలు తీశారు. వాళ్ళిద్దరూ మిడతం భొట్లు ఏమి చేస్తున్నాడోనని నక్కినక్కి చూస్తున్నారు. వాళ్ళు అతను పాడే పాట విన్నారు.*
*'అమ్మో! ఈ అయ్య అసాధ్యుడే...! మనమే దొంగలమని కనిపెట్టేశాడు.' అని తమ పేరు రాజు గారికి చెప్తే తమకు శిక్ష తప్పదని భయపడి గజగజ వణుకుతూ ఏడుస్తూ వచ్చి మిడతంభొట్ల పాదాలపై పడి తామే ఆ నగను దొంగిలించామని ఒప్పుకొని హారం అతనికి యిచ్చి తమ పేర్లు బయట పెట్టొద్దని ప్రాధేయపడ్డారు.*
*బ్రతుకు జీవుడా అని మనసులో అనుకోని మిడతంభొట్లు పైకి మాత్రం _"యిక మీదట యిలా చేశారంటే ఊరుకునేది లేదు వెళ్ళండి"_ అని గద్దించాడు. వాళ్ళు అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు.*
*మిడతంభొట్లు రాజుగారి దగ్గరకు వెళ్లి ఒక దొంగ దగ్గర ఆ హారం దొరికిందనీ, వాడు హారం తన చేతిలో పెట్టి తనకు చిక్కకుండా పరిగెత్తి పోయాడనీ వెళుతూ వెళుతూ తాను దేశం విడిచి పెట్టి పోతున్నానని అరిచాడనీ... కల్పించి చెప్పాడు. అప్పటినుండీ _"మిడతంభొట్ల శకునం"_ అనే మాట వాడుకలోకి వచ్చింది.*
_(--Suguna Rupanagudi)_
---------------------
*_{💠🌹శుభోదయం🌹💠ఇది సేకరణే: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
---------------------
No comments:
Post a Comment