Monday, October 27, 2025

 *#పురానీతి-అతి తెలివికి ఆశాభంగం* 

విభీషణుడు లంకానగరానికి రాజైన తర్వాత శ్రీరంగపట్నంలోని రంగనాధాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేవాడు .  ఒక వ్యక్తి ఇది గమనించాడు.     అతను  ఆశపోతు .  అతి తెలివిగలవాడు.  లంకానగరం చాలా సంపన్నమైనది కాబట్టి  ఎలాగైనా విభీషణుని కన్నుగప్పి లంకకు వెళ్తే  బోలెడంత డబ్బు , బంగారం తెచ్చుకోవచ్చననుకున్నాడు.  ఆ ఆలోచన వచ్చిందే తడవు ఒకరోజున విభీషణుడు పూజలో లీనమై ఉన్న సమయంలో మెల్లగా ఆయన వెంట ఉన్న పూలసజ్జలో దూరాడు .  పూజ అయిపోయిన వెంటనే విభీషణుడు ఆ సజ్జను తీసుకుని ఆకాశమార్గాన లంకకు పయనమయ్యాడు .  విభీషణుడు రాక్షస జాతిలో జన్మించాడు కాబట్టి , అతనికి ఆ వ్యక్తి ఒక చీమ వంటి వాడే .  విభీషణుడు లంకకు చేరుకున్న తర్వాత తన  పూలసజ్జను దింపాడు .  అందులోనుంచి ఈ వ్యక్తి బయటికి వచ్చాడు .  విభీషణుని చూసి భయంతో వణికి పోయాడు . అతన్ని చూసి ఆర్చర్యపోయిన విభీషణుడు అతన్ని అనునయించి , భయాన్ని పోగొట్టి మెల్లగా అతని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు .  సహజంగానే మంచివాడు . దానగుణం సంపన్నుడు అయిన విభీషణుడు అతని సాహసానికి ముచ్చటపడ్డాడు.  అతని కోరిక తీర్చాలనుకుని , తన అనుచరులను పిలిచి , ఇతనికి ఏమి కావాలో అది ఇచ్చి తిరిగి భద్రంగా శ్రీరంగపట్నం చేర్చమని ఆదేశించాడు .

విభీషణుని సేవకులు అతన్ని అరచేతిలో పెట్టుకుని తీసుకుని వెళ్లి కోశాగారము ముందు దించారు .  అక్కడ ఉన్న అమూల్యమైన మణి మాణిక్యాలు , రత్నాభరణాలు , అపారమైన సంపదను చూసి సంబ్రమాశ్చర్యాలతో నోటమాట రాలేదు .  ఏది కావాలో తేలుచుకోలేక దిక్కులు చూడసాగాడు . విభీషణుని సేవకులు అది చూసి చిన్నగా నవ్వుకుని , ఏం కావాలో తొందరగా చెప్పామన్నారు .  అతను ఎంతో తెలివిగా " మీరలా అడిగితే నాకేమి తెలుస్తుంది ? మీ రాజ్యంలోకెల్లా అమూల్యమైనది , అపురూపమైనదీ అయిన వస్తువును తెచ్చి ఇవ్వండి " అన్నాడు 

. ఆ రాక్షసులు కాసేపు అలోచించి ఒక చిన్న బంగారు భరిణను తీసుకొని వచ్చి దానిని అందంగా అలంకరించి ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టి అతని ముందుంచారు .  " మా రాజ్యంలోకెల్లా అపురూపమైన వస్తువు ఇదే . నిన్ను తీసుకుని వెళ్లి మీ రాజ్యంలో దించాలి మేము. ఇక రా నువ్వు ". అంటూ కళ్ళు మూసి తెరిచేలోగా అతన్ని శ్రీరంగపట్నంలోని స్వామివారి ఆలయం ముందుంచి , అక్కడినుంచి మాయమైపోయారు.

ఆవ్యక్తి ఎంతో ఆత్రంగా ఆ పెట్టెలోనుంచి ఆ భరిణను బయటకు  తీసి , దానిలో ఉన్న వస్తువును చూసి నిర్ఘాంత పోయాడు .  ఆ తర్వాత తన అతితెలివికి లబోదిబోమని నెత్తీనోరూ కొట్టుకున్నాడు .  ఎందుకంటె అది ఒక సాధారణమైన సూది మాత్రమే   కానీ లంకానగరవాసులకు అదే ఎంతో అమూల్యమైనది మరి !

 ఈ సంఘటన నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ , శ్రీ రామకృష్ణ పరమహంస ఈ కదా ద్వారా ఆశపోతులకు ఎప్పటికైనా శృంగభంగం తప్పదని శిష్యులకు బోధించేవారు..*

No comments:

Post a Comment