Thursday, July 28, 2022

ఈశ్వరేచ్ఛ

 ఈశ్వరేచ్ఛ

💝 ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్నే మనం"ఈశ్వరేచ్ఛ" అంటాం. 

💖 ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. 

💕 ప్రతి మనిషికీ ప్రతీ సంఘటనకీ తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని అతిక్రమించకూడదు. 

💓 అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్నచోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు. (అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ) ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు. అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్నిఅతిక్రమించిన దోషం కలుగుతుంది. 


❤️ శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు.మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన పరిథిని అతిక్రమించలేదు. 

❤️ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు. 

 కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళుమరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. 

💖 సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు.గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.. “ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు. 

 నువ్వు చేయవలసింది, నీ పరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించు” అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు. 

💞 కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు...”నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడే తప్ప “నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు. అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా…! అలా చేయలేదు. 

💝 అంటే... మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. “ఈశ్వరేచ్ఛ" అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరోటికాదు.  

No comments:

Post a Comment