Friday, December 2, 2022

శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?* *పండితుడూ - జ్ఞానీ:-*

 *🧘‍♂️74 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*పండితుడూ - జ్ఞానీ:-*

ఆధ్యాత్మికోన్నతులు సమకాలికు లైనప్పటికీ పరస్పరం కలవకుండానే ఈ లోకం నుండి దాటిపోవచ్చు. ఇరువురూ హృదయ సామ్రాజ్యాధిపతులైన కారణం చేత, ఒకే రకమైన భావ సమాధిని అనుభవిస్తుండడంచేత ఒకరినొకరు కలసి చర్చించదగింది ఏమీ ఉండదు.

 ఇద్దరూ పరిపూర్ణులే కాబట్టి ఒకరి ద్వారా మరొకరు కొత్తగా తెలుసుకోదగింది ఏమీ ఉండకపోవచ్చు. తనని తాను విస్మరించి నవనవోన్మేషమైన దానిని చూడడంలోనే నిమగ్నమైన మనిషికి ప్రయత్నపూర్వకంగా ఒక పని చేయాలని కాని, ఒకర్ని కలవాలని కాని ఉండే అవకాశం లేదు. అతడి ఆనందానికి ఎప్పుడూ ఏ కొరతా ఉండదు కాబట్టి అతడు ప్రత్యేకంగా తలపెట్టే కార్యమంటూ ఉండదు. తటస్థ పడ్డవారిని చూడడం, వారడిగిన మాటకు సమాధానం చెప్పడంతోనే సరిపోతుంది.

అలాంటి ఇద్దరు జీవన్ముక్తులు కలవడం తటస్థించకపోయినప్పటికీ, మధ్య కాలంలో ఒకరు దేహం చాలించినప్పటికీ ఆ ఇద్దరి మధ్యా ఉన్న దృష్టి సారూప్యాన్ని గమనించిన వారు, వీరిద్దరూ సమావేశమై ఉంటే ఎలా ఉండేదో అనే ఊహాగానం చేయడం కద్దు.

 ఆకాశంలో ఇద్దరు సూర్యులు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందోమోనని అనిపించవచ్చు. కానీ ఆకాశంలో సూర్యుడెప్పుడూ ఒక్కడే. నిజమైన ఆధ్యాత్మికోన్నతిని అందుకున్నవారు, ఒకరిలో ఒకరు మిళితమైపోతారు. వారసలు విడివిడి వ్యక్తులైతే గదా వేర్వేరుగా కనిపించడానికి? దేహధారులు కాబట్టి ఇద్దరుగా కనిపిస్తుంటారేగానీ, జీవన్ముక్తులైన కారణం వల్ల, ఇద్దరిలో ఎవరు నోరు విప్పి మాట్లాడినా ఒకటే; సత్యమే ప్రకటితమవుతుంది.

ఇది గ్రహించలేనివారు ఈ పురుషుల్ని ఏవో అనవసర ప్రశ్నలు వేస్తుంటారు. బొంబాయి పట్టణంలోని ఒక సామాన్య గృహంలో సంసారిగా నివసించి కాలం చేసిన మహనీయుడు నిసర్గదత్త మహరాజ్ను “రమణ మహర్షిని గురించి మీ అభిప్రాయమేమి టండీ?” అని ఒకరు అడిగారు. “మేమిద్దరమూ ఒకేరకమైన సనాతన స్థితిలో ఉన్న వాళ్ళమే. ఆ విషయం అలా ఉంచండి. మీకైతే మీ పేరూ, మీ శరీరమూ తప్పితే,

మిమ్మల్ని గురించి మరేమీ తెలియదు. రమణ మహర్షి గురించైనా మీకంతే తెలిసే వీలుంటుంది. ఆయన్ని గురించి మీకంత కన్నా ఏమి తెలుసు కాబట్టి నన్నీ ప్రశ్న అడుగుతున్నారు?” అని సమాధానమిచ్చాడు నిసర్గదత్తుడు.

 అప్పటికీ ఊరుకోక ఆ పృచ్ఛకుడు, “మీరు మహర్షిని కలిసి ఉంటే ఏమై ఉండేదంటారు?" అని సంభాషణను పొడిగించాడు.

 “బహుశా ఇద్దరమూ సంతోషపడుండే వాళ్ళమనుకుంటాను. నాలుగైదు మాటలు కూడా మాట్లాడుకొని ఉండవచ్చు" అన్నాడు ఆ అద్వైతి. "ఆయన మిమ్మల్ని జీవన్ముక్తుడుగా గుర్తించి ఉండేవారంటారా?" అని సాగదీశాడు ఆ వ్యక్తి. “తప్పకుండాను. మనిషిని మనిషి గుర్తించగలిగినట్లే, జ్ఞాని అయినవాడు మరో జ్ఞానిని ఇట్టే గుర్తించ గలడు. మీరు స్వయంగా అనుభవించిందే మీరు మెచ్చుకో గలుగుతారు. మీ అనుభవంలోకి రాని గుణాన్ని మీరూ గ్రహించలేరు" అన్నాడు నిసర్గదత్తుడు.

అరుణాచల రమణుణ్ణి కలవాలనుకున్న వారిలో కూడా రకరకాల వారు ఉండే వారు. రమణుడు విరూపాక్ష గుహలో ఉండే కాలంలో, పండితుడైన శివగంగ పీఠాధిపతి ఒకరు తనని కలిసే నిమిత్తం వచ్చారని చెపుతూ రమణులిలా అంటారు.

 "వారు శిష్యులతో వచ్చి తిరువణ్ణామలై నగర సత్రంలో బసచేసి నన్ను అక్కడకు రమ్మని ఆహ్వానించారు. మనమేమి పండితులమా పోయేందుకు? మనకేమి అర్హత ఉన్నదని, రానన్నాను. వారది విని తామే శిష్యులతో బయలుదేరి పెద్ద పళ్ళెంలో సరిగంచు శాలువ, నూట పదహారు రూపాయలూ పెట్టుకొని నా వద్దకు రావాలని కొండ ఎక్కుతూ ఉంటే, నేను ములైపాలు తీర్థం వద్ద నుండి కమండలం పట్టుకుని విరూపాక్ష గుహకు పోతున్నాను. ఆ మధ్యన ఉన్న వృక్షం వద్ద ఉభయులమూ కలుసుకున్నాము.

 వారు పళ్ళెం నా ముందుపెట్టి - "ఇది తాము స్వీకరించాలి" అంటే నేను సమ్మతించలేదు. కడకు డబ్బు వారే ఉంచుకొని, “శీతకాలంలో కప్పుకోడానికి ఉపయోగపడుతుంది, శాలువ గ్రహించండని” బలవంతపెట్టారు. తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకొని సరిగ అంతా చింపి ఉంచి, అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను. వారు వెంటనే వెళ్ళారు. అప్పటికే చాలా వృద్ధులు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన కొద్దిరోజులకే సిద్ధి పొందారు” అన్నారు.

“వారేమైనా భగవానుని ప్రశ్నించారా?” అన్నాడొక భక్తుడు.

"ప్రశ్నించటానికి ఏమున్నది? వారు మంచి వివేకం కలవారూ, పండితులూను. నన్ను చూసిన వెనుక తమ సమీపస్థులతో "సుఖి అంటే రమణుడే సుఖి. ఈలాంటి సుఖం నాకు వెయ్యి జన్మలకైనా లభించడం దుర్లభం” అని అన్నారట వారు” అంటూ ముగించాడు రమణుడు.

పాండిత్యానికి ఉండే ప్రయోజనాలు పాండిత్యానికున్నాయి. కానీ ఆత్మజ్ఞానం వల్ల లభించే అత్యంత సుఖం, సాఫల్యం వేరు.

*మనస్సు మెదడు*

మనస్సు మెదడులో పుట్టిందనుకుంటారు. కానీ మెదడు ఎక్కడ వున్నది? శరీరంలో వున్నది. శరీరమే మనస్సు చేసిన కల్పన అని నేను అంటున్నాను. శరీరాన్ని అందులోని మెదడును సృష్టిచేసినది మనస్సే. ఆ మెదడు తన స్థానమైనట్లు నిర్ణయిస్తున్నదీ మనస్సే.

No comments:

Post a Comment