Tuesday, June 3, 2025

 *మార్గదర్శి.....* 

*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా... 8వ రోజు* 

*వృత్తి ధర్మాన్నిభగవదారాధనగాపాలించు!*

*పుట్టిన ప్రతిమనిషీ బ్రతికి ఉన్నంతవరకూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అరక్షణం గూడ ఊరికే ఉండడు. గాలి పీల్చడం, వదలడం గూడ ఒక పనే గద! అది లేకుండా ఉండడు గద! అలాంటపుడు దేహంలోని ప్రతికదలికా ఒక పనే అవుతుంది.*

*ఈ చేసే పనులు శరీర నిలకడ కోసం కొన్నైతే, జీవిస్తూ సమాజంలో బ్రతుకు తెరువుకోసం చేసేవి మరికొన్ని. తినడం, త్రాగడం, జనన క్రియ, నిద్ర, గాలిపీల్చడం వంటివి జీవులందరికీ తప్పవు. మారవు. అయితే సమాజంలో చేసే పనులు మాత్రం వ్యక్తినిబట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతూంటాయి. బ్రతుకు తెరువుకోసం, ఒకనాడు వ్యవసాయం, మరోనాడు వ్యాపారం, ఇంకోనాడు అధ్యాపనం (Teaching). ఇలా మారవచ్చు. మొత్తానికి పుట్టిన క్షణం నుండి తుదిశ్వాసదాక ఈ పనులు తప్పవు.* *ఆతడు గృహస్థుకావచ్చు, సన్యాసి కావచ్చు. వీటన్నిటిని శారీరక విధులంటారు. ఇవే 'స్వధర్మ'మని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఇవి మానరాదు. ఇవి చేయడం ఒక్కొక్కసారి కష్టంగ, ఆయాసజనకంగ అనిపించవచ్చు. అయినా మానరాదనేది శ్రీకృష్ణుని సిద్ధాంతం. చేతకాక మానడం తప్పదు. ఫర్వాలేదు. శ్రమకదా అని మానడం దోషం. మానినవానిని పాపిని చేస్తుంది. ఒక వేళ అలా చేస్తూ తలపెట్టిన ఆ పని పూర్తికాక మధ్యలోనే ప్రాణం పోయినా 'స్వధర్మాచరణ' అనే సన్మార్గంలో ఉన్నాడు కనుక వానికి మరుజన్మలో ఉత్తమ స్థానం లభిస్తుంది. ఇక అది చేసేటపుడు, లోపభూయిష్టంగానో, నీచమైనపని అనో అనిపించినా, దానికి తాను సిగ్గుపడనవసరంలేదు. తనపని తాను చేసుకొంటున్నపుడు నీచమైన పని, గొప్పపని అనే తేడా చూడనవసరమే లేదు. ఒక వేళ ఇతరులు గేలి చేసినా దానిని పట్టించుకోనవసరం లేదు. ఇది బుద్ధిమంతుడు గుర్తించాలి. ఇదే స్వధర్మమంటారు. దీనినే కర్మయోగము అని కూడా అంటారు.*

*బాధ్యతను విస్మరించి చేసే పని ఏదైనా అది పరధర్మమే. శరీరంవల్ల ఏర్పడ్డ విధులను (కర్మయోగాన్ని) మాని, జ్ఞానం సాధిస్తానని, బాధ్యతలను పట్టించుకోక, వదలినవాడు సాగించే సాధన ‘పరధర్మం” అవుతుంది. ఆ సాధన ఎప్పుడూ ప్రమాదంతో కూడి ఉన్నదే. ఇంద్రియాలూ, మనస్సు, వాటికుండే వాసనల వల్ల ఏర్పడే కోరికలూ మొదలైనవి ఈ పరధర్మీయుణ్ణి ఎప్పుడూ దిగజారుస్తూనే ఉంటాయి. ఎందుకంటే, అసలు శరీరంలో అధికారం చెలాయించేది రజోగుణమే. దాని సంతానమే కోరికలు. జ్ఞానయోగి వాటిని మూసివేయాలి గద! వాటిని నిర్బంధించడం ఎవరితరమూ కాదు. వాటిని వాడవద్దని అనుకున్నా, దిగజారిన తర్వాత కానీ తెలియనివ్వవు. జడభరతుడు, విశ్వామిత్రుడు దీనికి దృష్టానాలు. నిప్పును పొగ ఆవరించి, తడి తగిలినపుడల్లా పైకి లేస్తుంది. కోరికలూ అంతే. తుడిచినపుడు అద్దం బాగున్నా మళ్ళీ మలినం అద్దాన్ని పట్టినట్లు కోరికలు పుడుతుంటాయి. అసలిదంతా ఎందుకు? గర్భస్థపిండాన్ని మావి ఆవరించి ఉంటుంది. దాన్నుంచి తప్పించుకోవడం ఆ పిండానికి ఎలా వీల్లేదో, ఈ రజోగుణ ప్రభావంవల్ల కలిగే కోరికలనుండి తప్పించుకోవడం ఎంతటి జ్ఞానయోగ సాధకుడికైనా అసంభవమే. అందుకే శరీరంలో ఉంటూ జ్ఞానయోగ సాధన చేయడం కంటే కర్మయోగమే మేలు. ఇక నీకు భయమెందుకు? ఇది తెలియక జ్ఞానయోగమని సాధన ప్రారంభించి బాధ్యతను విస్మరించినందున, అదేదో ఫలిస్తున్నట్లనిపించినా, ఆ ఫలితం రాదు సరికదా, కర్మమానిన దోషం వల్ల ఉన్న స్థితిగూడ చెడి భరతుడు, మానవజన్మలోంచి లేడిజన్మలోకి దిగజారినట్లు నష్టపోక తప్పదు. అని, ధర్మాచరణ ఎంత ముఖ్యమో తెలుపుతున్నాడు.*

*శ్రీకృష్ణుడే వసుదేవుని సుతుడైనా, గోకులంలో ఉంటే ఆవులు మేపాడు. సాందీపని వద్ద శిష్యధర్మం పాలించాడు. కురుపాండవుల మధ్య రాజధర్మాన్ని పాలించాడు. రణరంగంలో రథసారథిగ తన బాధ్యత నెరవేర్చాడు. సారథిగ గుఱ్ఱాలను కడిగాడు. దేనికీ సిగ్గుపడలేదు. అభిమానమునందలేదు. వెనుదీయలేదు. కర్మాచరణ 'స్వధర్మం'గ ఆచరించి ఆదర్శమయ్యాడు లోకానికి. స్వలాభం కోసం ఏది చేసినా దోషమే. లోకహితానికై చేసినది దోషం కాదు. నేను చేస్తున్నాననేది, నా కోసం చేస్తున్నాననే కర్మఫలాశ లేకుంటే, కర్మలు అంటవు. అనే మర్మాన్ని తన ఆచరణలో లోకానికి చూపాడు.*

*శరీరాన్ని కోస్తే పాపం. శిక్షార్హమైన నేరము కూడా. కాని అదే డాక్టరు చేస్తే అది స్వార్థము కోసము కాదు, రోగి హితం కోసం కనుక నేరము కాదు. నేరస్థుని జడ్జి శిక్షించినా, పోలీసు దండించినా అంతే కదా! స్వధర్మాచరణ చేసే వాడిని గౌరవించడం అందరి బాధ్యత. 'వృత్తి గౌరవం' అంటారు గద! రోడ్లు తుడిచేవాడు అదొక వృత్తి కనుక, అందులో ఉన్నంతవరకూ అతణ్ణి మనం గౌరవించవలసిందే. బయటికి వచ్చాక అతడ్డాక పౌరునిగ గౌరవించక తప్పదు. అతడు స్వధర్మ నిష్ఠుడు. మనుషులు అవగాహనా లోపం వల్ల ఈ రోజులలో 'వృత్తి గౌరవ'మనేది తెలియకుండా పోయింది. కానీ అది తప్పు. ఎవరి వృత్తి వారికి దైవారాధనతో సమానమని గుర్తించాలి.*

*కాళిదాసు తన కావ్యంలో ఒక చోట ఈ సందేశం స్పష్టం చేసాడు. ఒక చేపలు పట్టేవాడు పెద్దచేపను పట్టికోయగ, దాని పొట్టలోంచి ఓ ఉంగరం బయటపడింది. అదేమిటో తెలియక బజారులో విచారించాడు. ధనం కోసం. అది రాజముద్రిక. రాజభటులు వానిని నిర్బంధించారు. రాజువద్దకు తీసుకువెడుతూ 'ఏమిటి నీ వృత్తి?' అడిగాడొక భటుడు. 'చేపలు పట్టుకోవడం' అన్నాడీ ధీవరుడు. నీ ఒంటి కంపే చెప్తోందిలే నీ వెంత గొప్పపని చేస్తున్నావో అంటూ అవమానించాడు రాజభటుడు. దానికి మత్స్యకారుడు బాధపడి ఎవని వృత్తి వానికి గొప్ప కనుక చులకన చేయతగదంటాడు.*

*'సహజం కిల యద్వినిందితం నిహితం కర్మ వివర్ణనీయమ్' అని బోధిస్తాడు.*

*సహజకర్మలెప్పుడూ వదలరాదు. లోకం దానినెలాగైనా భావించవచ్చుగాక! పూవులమ్మేవాడు ఆ పని చేస్తే, మాంస విక్రేత ఆ పని గౌరవంగ చేస్తాడు. అది వానికి స్వధర్మం. ఈ స్థితి గుర్తించకపోతే లోక వ్యవస్థే చెడుతుంది. ఇలా పవిత్రంగ ఆచరించే లోకసాధ్యం కాని స్వధర్మాచరణ చేస్తూ చనిపోయినా సద్గతే కలుగుతుంది. పైగా, వంశానుగతంగ అవి సంక్రమించేటపుడు ఆ కర్మాచరణ సులభమూ, నేర్పరితమూ, నైపుణ్యంతో కూడినదీ గూడ అవుతుంది. వైద్య వ్యవసాయ వృత్తులవలె. అందుచే ఏ కర్మ అయినా ప్రీతితో గౌరవపురస్సరముగా, భగవత్సేవగా భావిస్తూ నిర్వహించడంలోనే ఉదాత్తత ఉంటుందని గుర్తించాలి (Dignity of Labour) అది ప్రోత్సహించాలి. అది మానిన జ్ఞానయోగ సాధకునికి మాత్రం అధోగతే అని శాసిస్తున్నాడు శ్రీకృష్ణుడు.*

*┈┉┅━❀꧁మార్గదర్శి ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment