Monday, June 2, 2025

 పారాయణం అంటే ఏమిటి ? ఈ పారాయణలను చేసే పద్ధతులు తెలపండి ?
పారాయణం.....

పారం' అంటే- ఒడ్డు, దాటడం అనే అర్థాలున్నాయి. వాటి నుంచి పుట్టిందే ''పారాయణం' అనే పదం! ఏదైనా గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా చదివే ప్రక్రియను పారాయణం చేయడమంటారు. ఇది సాధారణమైన అర్థం. అంతరార్థం గ్రహించగలిగితే, -గ్రంథం చదివినవారి జీవితం తరిస్తుంది. ఫలితంగా వారు తమ జీవితాల్లో-చతుర్విధ పురుషార్థాల్లోని అర్ధ, కామాలకు బదులు ధర్మ, మోక్షాలకే ప్రాధాన్యమిస్తారు.

గ్రంథాన్ని మామూలుగా చదివితే అది పఠనం. దాని వల్ల విషయం ఒక్కటే తెలుస్తుంది. మనసులో కోరిక కలిగి, అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు కొందరు. దాని వల్ల ఆ గ్రంథం లోని అంతర్గత విషయాలు తెలుస్తాయి. భక్తి, వైరాగ్య, జ్ఞానాలు కలుగుతాయి. వాటితో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి.

మొదట ఏదో ఒక కోరికతో పారాయణం మొదలు పెడితే, అది పూర్తికావచ్చేసరికి ఆ గ్రంథంతో పాటు దైవంతో విడదీయలేని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటుచేసు కుంటుంది. పాడగా, పాడగా రాగం వీనులవిందుగా మారుతుంది. అభ్యాసం చేయగా, చేయగా వైరాగ్యం అలవాటవుతుంది. పర్యవసానంగా, ఐహిక వాంఛల మీద వ్యామోహం తగ్గుతుంది.

ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత, రామాయణం, భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తారు. మొత్తం గ్రంథాన్ని లేదా అందులోని భాగాన్ని/ఘట్టాన్ని ఎంచుకుంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు, రామాయణంలో iసర్గలు, భాగవతంలో ఘట్టాలు ('రోజుకు ఇన్ని' అని) నిర్ణయించుకుంటారు. నియమాలకు లోబడి, వాటిని నియమిత కాలంలో పూర్తిచేస్తారు. ఒక్కో గ్రంథ పారాయణాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో కొనసాగిస్తారు.

పారాయణం చేయడంలో ఇతర గ్రంథాలకు, భాగవతానికి తేడా ఉంది. దీన్ని పఠించడం వల్ల ఐహిక (ఈ లోకం), ఆముష్మిక (పర లోకం) ప్రయోజనాలు నెరవేరతాయి. ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది. నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా మారినా, పైకి మామూలుగానే కనిపిస్తుంది. పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది. అలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి, మనిషి పైకి మామూలుగా ఉన్నా అంతరాంతరాల్లో ఆధ్యాత్మిక పరిణతి కలిగినవాడవుతాడు.

ఏవైనా విఘ్నాలు, ఇబ్బందులు ఏర్పడితే గజేంద్ర మోక్షం, రుక్మిణీ కల్యాణం పారాయణ చేస్తారు. అవి పూర్తయ్యేసరికి వారిలో ధైర్యం, ఆత్మ స్థైర్యం పెంపొందుతాయి. అవరోధాల్ని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు లోకజ్ఞానం అలవడుతుంది. అంబరీష, ధ్రువ ఉపాఖ్యానాలు; ప్రహ్లాద చరిత్ర వంటి అనేక ఘట్టాల్ని పలు కోరికలతో పారాయణ చేస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు.

ఏ ప్రయోజనమూ ఆశించకుండా భాగవతాన్ని ఏడు రోజుల్లో పారాయణ చేయాలన్న నియమం ఉంది. దీన్ని 'భాగవత సప్తాహం' అని పిలుస్తారు. పరీక్షిత్తులోని మృత్యు భయం, ఆందోళన పోగొట్టడానికి శుక మహర్షి భాగవత కథల్ని వారం రోజుల్లో చెప్పి పూర్తిచేస్తాడు. అవి విన్న పరీక్షిత్తు మృత్యువును జయించిన అనుభూతి పొందుతాడు. భయం తొలగి ప్రశాంతచిత్తుడవుతాడు. ఆ కథల్లో మాయామో హాలు నశింపజేసే అంశాలు ఉండటమే అందుకు కారణం. అప్పటి నుంచి- భాగవతాన్ని చదవడం ఏడు రోజుల్లో పూర్తిచేయాలన్న నియమం వచ్చిందంటారు.

సప్తాహం అనే పదానికి కొందరు మరో అర్థమూ చెబుతారు. ఆదివారం మొదలు శనివారం వరకు వారానికి ఏడు రోజులు. అన్ని రోజులూ ఏనాడూ ఆగకుండా జీవితాంతం నిత్య పారాయణ చేస్తూనే ఉండాలంటారు. మాయా మోహాలు, ఐహిక వాంఛలు నశిస్తాయన్నదే అందులోని ఆంతర్యం!

No comments:

Post a Comment