*మౌనం అంటే ఏమిటి...........!!*
మౌనం అనేది దైవభాష.
లిపి లేని విశ్వభాష
.ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
సనాతన భాషా స్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.
నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు,
వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు,
మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు.) విజ్రుంభణను ఆపడం.
మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.
ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.
మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.
అఖండ ఆనందపు ఆత్మస్థితి.
విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు.
మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.
ఈ మౌనం మూడు రకాలు........
1. వాజ్మౌనం :- వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.
2. అక్షమౌనం :- కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి.
3. కాష్ఠ మౌనం :- దీనిని మానసిక మౌనమంటారు.మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
మౌనం - దక్షిణామూర్తి మౌనం సత్యబోధ. గురువు మౌనం జ్ఞానానుగ్రహం. జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ. భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం.
ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది,అంతర్యామిని దర్శింపజేస్తుంది,మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు.
మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.
'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.
భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం.
మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది.
మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం,ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం.
No comments:
Post a Comment