Thursday, July 7, 2022

భగవంతున్ని ఏం కోరాలి?

భగవంతున్ని ఏం కోరాలి

భగవంతుణ్ని మనం ఏం కోరుకోవాలి? ఇది చాలా సులభంగా కనిపించినా, చాలా కఠినమైన ప్రశ్న. అన్నీ ఆయనే అయి, సమస్తమూ ఇవ్వగల భగవంతుడే కనబడి మనలను కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ధనమా! మరణం లేని జీవితమా! ప్రభుత్వమా! శాశ్వత యౌవనమా! పెద్దచిక్కే కదా! ఏది కోరితే శాశ్వతత్వం లభిస్తుందో దాన్ని కోరుకోవడమే సరైనది. ఇంతకీ అది ఏది?
మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతోమంది మునులు, రాక్షసులు కఠోరమైన తపస్సు చేసి తీరా భగవంతుడు దర్శనమిచ్చాక ఏం కోరుకోవాలో తెలియక తికమక పడ్డ సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. విచిత్రంగా ఎందరో రాక్షసులు మరణం రావొద్దని, సమస్త విశ్వానికి ఆధిపత్యాన్ని కోరుకొని కోలుకోలేని దెబ్బతిన్నారు. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని వధించాడని శ్రీహరిపై పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని మెప్పించాడు. విష్ణుమూర్తిని ఎదిరించాలనే లక్ష్యంతో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని విధాతను కోరాడు. ఆ వరం ఇవ్వడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అప్పుడు తనకు మరణం లేకుండా కొన్ని షరతులతో కూడిన వరం అడుగుతాడు హిరణ్యకశిపుడు.

శా॥గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్‌, దిక్కులన్‌,
రేలన్‌, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
వ్యాళాదిత్య, నరాదిజంతుకలహ వ్యాప్తిన్‌, సమస్తాస్త్ర శ
స్ర్తాళిన్‌, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.

‘గాలిలో, నేలమీద, నిప్పుతో, నీటిలో, ఆకాశంలో, దిక్కులలో, రాత్రిగానీ, పగలుగానీ, చీకట్లోగానీ, పగలుగానీ, భూచరాలతోగానీ, జలచరాలతోగానీ, పాములతోగానీ, రాక్షసులతోగానీ, దేవతలతోగానీ, మానవులతో గానీ, అస్ర్తాల వల్ల గానీ, శస్ర్తాల వల్ల గానీ మృత్యువు లేకుండా వరం ప్రసాదించమన్నాడు. యుద్ధాల్లో తన ఎదుట ఎవరూ నిలవలేని శౌర్యాన్నీ, లోకాలన్నీ జయించగల శక్తినీ ఇమ్మని కోరుకున్నాడు.
చాలా తెలివిగా చావేలేని వరాలు కోరాననుకున్నాడు కానీ, భగవంతుని ప్రణాళికను ఈ వరాలేవీ అడ్డుకోలేకపోయాయి. ఇందులో ఆశ్చర్యం ఏమంటే తన సోదరుడిని చంపినవాడు, తననూ చంపుతాడేమోనన్న భయం ఒకవంక, తాను కోరినవాటికంటే భిన్నమైన మృత్యుకారక మార్గాలు మరేవీ ఉండవనే అవివేకం మరోవంక హిరణ్యకశిపుడిని మరణానికి దగ్గర చేశాయి. రావణుడు ఇలాగే నరవానరులను వదిలేసి మరెవరిచేత చావు రాకూడదని కోరుకొని మరణించాడు. అంటే, అనివార్యమైన మరణాన్ని ఏ వరాలు ఆపలేవన్నది నిజం. నహుషుడు ఏకంగా ఇంద్రపదవి కోరి తపించి సాధించి అహంకారం నెత్తికెక్కి స్వర్గం నుంచి భూమిపై కొండచిలువగా జారిపడ్డాడు. అలాగే భస్మాసురుడు తానుపొందిన వరంతో తానే భస్మమయ్యాడు.
మనం కోరే కోరిక మనకు మాత్రమే కాదు, సమాజానికీ హితం చేసేదై ఉండాలి. సకల జీవుల సంక్షేమం కోసం దివిజగంగ భువికి రప్పించిన భగీరథుని కోరిక ఉన్నతమైనది. తన శరీరాన్ని దేవతల కోసం అర్పించిన దధీచి త్యాగం అందరికీ ఆదర్శం. కేవలం స్వీయ ఆధిపత్యానికి, మరణాది ప్రకృతి సిద్ధమైన లక్షణాలకు విరుద్ధంగా భగవంతుని కోరే కోరికలన్నీ నిష్ఫలాలే అవుతాయి. నిజానికి భగవంతుని కోరదగింది అనాయాసమైన మరణం, దైన్యంలేని జీవనం, సదాగోవింద స్మరణం అని మన పెద్దలు చెప్పారు. వీటిని కాదని, ఎన్ని ఐశ్వర్యాలను కోరినా అవన్నీ అశాశ్వతాలే అవుతాయి. పరమభక్తుడైనవాడు ఏమి కోరుకోవాలంటే..

నీపాదకమలసేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము నితాం
తాపారభూతదయయును, తాపసమందార నాకు దయసేయగదే!

పోతన చెప్పినట్లు భగవంతుని పాదకమలసేవ, భగవత్‌ భక్తులతో స్నేహం, అంతులేని భూతదయ. ఇవే మనల్ని భగవంతుని దరికి చేర్చే మార్గాలు. ఇవే భగవంతుడిని కోరాల్సిన వరాలు.

సేకరణ

No comments:

Post a Comment