*🌹 కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ 🌹*
*విజయుడు అనే రాజు "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.*
*అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా "మీరేమంటారు మంత్రిగారూ?!" అని అడగడం మొదలుపెట్టాడు..*
*మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. ''ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే'' అనుకున్నాడు ఆయన.*
*"మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.*
*దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ''ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను'' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.*
*ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు ఆవుల్ని మేపుకుంటూ.*
*"ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.*
*"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.*
*పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.*
*"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?" అడిగాడు విజయుడు.*
*''గాలి''.... చెప్పాడు పశువుల కాపరి.*
*అన్నింటికంటే ఉత్తమమైన జలం?*
*"గంగాజలం"*
*అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?*
*" ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే"*
*"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.*
*ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.*
*"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.*
*"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ..." అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.*
*"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.*
*"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి.*
*"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.*
*"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే ''ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి'' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"*
*విజయుడు నివ్వెరపోయాడు. "అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, ''అందరిలోకీ తెలివైనవాళ్ళు'' అంటూ అసలు ఎందుకుండాలి?"_ అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.*
*పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!*
*అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా " మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు"అని పేరు తెచ్చుకున్నాడు.*
*చదివి చదివి కొంత చదువంగ చదువంగ*
*చదువు చదివి యింక చదువు చదివి*
*చదువు మర్మములను చదువలేడయ్యెను*
*విశ్వదాభిరామ! వినురవేమ!*
*భావం:- ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!*
*{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి.*
No comments:
Post a Comment