*ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతోంది అమ్మ. కొడుకు పక్కనే కూర్చుని చదువుకుంటున్నాడు.*
*అంతలో అక్కడికి ఆకుకూరలమ్మే ఒకామె వచ్చింది.*
*‘‘ఆకుకూర కట్ట ఎంత?’’ అడిగింది అమ్మ. ‘‘అయిదు రూపాయలు’’ చెప్పిందామె.*
*‘‘నాలుగు కట్టలు తీసుకుంటాను. కట్ట మూడు రూపాయలు చేసివ్వు’’*
*‘‘నాకు గిట్టదమ్మా...’’ అని ఆకుకూరామె గంప తీసుకొని బయలుదేరింది.*
*అయితే నాలుగడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగి ‘‘అమ్మా, కట్ట నాలుగు చేసుకోండి’’ అంది.*
*‘‘కుదరదు. మూడంటే మూడే’’ అందా అమ్మ.‘‘సరే’’ అని ఆమె ఆకుకూర ఇచ్చి వెళ్లబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించింది.*
*‘‘ఏంటమ్మా, తినలేదా? నిస్సత్తువగా కనిపిస్తున్నావు’’ అమ్మ అడిగింది.*
*‘‘లేదమ్మా. ఇవన్నీ అమ్మి ఇంటికెళ్లి వండుకొని తినాలి’’ అందా కూరలామె.*
*‘‘సరేలే, ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు. ఏమన్నా తిని వెళ్దువుగాని రా’’ అని అమ్మ ఆమెని ఇంట్లోకి తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టింది.*
*వాటిని తృప్తిగా తిని, గంప తీసుకొని ఆ కూరలమ్మి వెళ్లిపోయింది.*
*ఇదంతా గమనిస్తున్న కొడుకు ‘‘అమ్మా, కూరాకు దగ్గర బేరం ఆడావు. కట్ట అయిదు రూపాయల చొప్పున నాలుగింటికి ఇరవై రూపాయలే అవుతుంది.*
*కానీ, నువ్వు ఆమెకి ఆరు ఇడ్లీలు పెట్టావు. హోటల్ రేటు ప్రకారమైతే అవి ముప్పై రూపాయలు అవుతాయి కదా?!’’ అన్నాడు.*
*‘‘కన్నా, వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు. దానంలో వ్యాపారం చూడకూడదు’’ కొడుకు వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పిందా అమ్మ.*
*ఆ మాటలతో కొడుకు మస్తిష్కంలో ఎక్కడో జ్ఞానజ్యోతి వెలిగింది. అది జీవితాంతం అతణ్ని మానవతామూర్తిగా నిలిపే దివ్య జ్యోతి.*
No comments:
Post a Comment