Sunday, April 30, 2023

:::::: మనస్సు ::::::

 *:::::::: మనస్సు :::::::::::::*
     మనందరిది ఒకే మనస్సు.
ఈ ఒకే మనస్సు ని మనం తలా ఒక ముక్క పంచుకున్నాము. ఒకే తాను లోని బట్టను తలా ఒక ముక్క తీసుకున్నట్లు . ఈ మనస్సు ప్రధానంగా మూడు రకాల పనులు చేస్తుంది.
1) *పనిలో నిమగ్నమవడం*.. మనస్సుశరీరం కలిసి ఏ పని చేస్తున్నా ఆ పని లో మనస్సు నిమగ్నమై వుంటుంది.
2) *ఆలోచించడం.*... మనస్సు ఏ పని లోనూ నిమగ్నం కాక పోతే అది గతం లోకి జారి పడి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వుంటుంది లేదా భవిష్యత్ ను ఊహిస్తూ వుంటుంది.
3) *సంవేదనలతో వుండుటం*.. మనో శారీరక వ్యవస్థ లో ప్రతి క్షణం కలిగే సంవేదనలతో వుండటం.

      ఈ మూడు పనుల్లో,  ఒక్కొక్కరిలో వారి ముక్క మనస్సు ఒకొక్క పనిని, వారి వారి మానసిక ఆరోగ్యం, శిక్షణ, ప్రత్యేక కారణాలను బట్టి, కేటాయించుకొని దానిలో వుండి పోతుంది.
     ధ్యానం మనస్సు ని సరైన పనిలో,సరైన సమయంలో,సరైన విధంగా, వుంచుతుంది.
*షణ్ముఖానంద 98666 99774*

Saturday, April 29, 2023

హృదయ శుద్ధి

 *🌸హృదయ శుద్ధి*🌸

మానవ హృదయమే మహోన్నత దేవాలయం
సమస్త దేవతలకు చక్కటి ప్రశాంతి నిలయం

హృదయం దున్నిన దుక్కిలా ఉండాలి
ఏ క్షణాన తొలకరి జల్లులు వర్షిస్తాయో

ఏ హృదయం అనంత సద్భానలను
చకోర పక్షిలా ఆస్వాదిస్తుందో

ఏ హృదయంలో ఎన్ని జ్ఞాన పుష్పాలు
వికసించి విరబూసి ఉవ్వెత్తున లేస్తాయో

హృదయం ఉషర క్షెత్రమైతే
సంకల్ప బీజం గట్టిదైనా వ్యర్ధమే.

సంకల్ప బీజం బలహీనమైతే
హృదయం శుద్ధమైనా వృధాయే

హృదయం సంకల్పం రెందూ మంచివైనప్పుడు
జ్ఞాన తరంగాలు ఉవ్వెత్తున లేసి ఎగిసిపడు

అణు విస్పోటన ప్రభావం కొంత ప్రదేశం వరకే
హృదయ విస్పోటనం విశ్వ వ్యాపిత ప్రభంజనం.

మానసిక సంకల్పాలకు హృదయమే కేంద్ర స్థానం
అందుకే మనసును హృదయంలో విలీనం చేయి.

అనంత దివ్య శక్తులకు నిలయం హృదయం
ఉద్దీపన గావిస్తే మానవాళికే మహోదయం.

హృదయ స్పందన భాషగా మారి బహిర్గతమైతే
శతకోటి మానవ హృదయాలను పులకింపజేస్తుంది.

తలను కాదు హృదయాన్ని అనంతంగా పెంచాలి.
మానవత్వాన్ని చేతలలో పదుగురికి పంచాలి.

ఒక్క సంఘటన చాలు మనిషి పూర్తిగా మారడానికి
ఒక్క హృదయ స్పందన చాలు మానవాళి గమ్యం చేరడానికి

మేడి పూతలాంటి ఒక్క మెరుపు చాలు
హృదయ వికాసం జరిగి విశ్వవ్యాపితమవడానికి

దేవుడెక్కడో ఆకాశం ఆవల కూర్చుని లేడు.
దయగల హృదయంలోనే దాగి ఉన్నాడు చూడు.

ఒక్క సద్గురువు మాత్రమే మహిలో
సత్ శిష్యుని హృదయ తంతిని మీటగలడు.

యావత్ ప్రపంచానికే బొధించగల
మహా ప్రవక్తగా మార్చగలడు...

*నాలుగు బంధనాలు తొలగాలి*
నాలుగు నాశనాలు జరగాలి....

""స్వప్ననాశాత్  జాగృతస్యతే "".......1

స్వప్నం ...అంటే నేను శరీరమే 
అనుకోవడం....అది నాశనం కానంత వరకూ
జాగృదావస్త కలగదు...నిద్రలో ఇది స్పష్టం అవుతుంది..
శరీరం నిద్రపోతూ వుంటుంది...కానీ కల అని నువ్వు అనుకొనే వాడెవడు...ఆ కలలో విహరించే వాడు ఎవడు..
శరీరం కాదు గా...శరీరం గురకలు పెట్టి నిద్ర పోతుంది గా..
మరి ఆ సూక్ష్మ లోకంలో ఉన్నదెవరు...?

""అజ్ఞాన నాశాత్ మొక్షతస్యతే """........2

భగవంతుడు వేరు  నేను వేరు అనుకోవడం కంటే అజ్ఞానం ఏమీ లేదు.. అది నాశనం కానంత వరకూ,,,మోక్షం లేదు..
అజ్ఞానం నుండి పుట్టే బంధం,,,భాధ,,,దుఃఖాల నుండి
మోక్షం లేదు...కాబట్టి నేను శరీరం కాదు అన్న సత్యాన్ని  తెలుసుకోవడానికే  ధ్యాన సాధన వుంది....

"""గుణ నాశాత్ నిర్గుణస్యతే""..........3

గుణం నాశనం కానంత వరకూ ,,,
ఏదో ఒక పత్యేక  నేనులో తగుల్కొంటూనే వుంటాం..
నేను వేరు మిగతా ""అంతా ""వేరు అని తగొల్కుంటూ వుంటాం...ఇదే గుణం ...ఈ గుణం నాశనం కానంత వరకూ... నిర్గునుడివి కాలేవు...కాబట్టి...గుణం నాశనం కావాలి....

కల్ప నాశాత్ నిర్వాణశ్యతే..........4

ఏదో ఒక కల్పన చేస్తూనే వుంటాం...అది వికల్పమో,,, సంకల్పమో,,,, సవికల్పమో,,, ఎదో ఒక కల్పన,,, మోదుకోవడానికి ఏ రాయి అయితేనేమి....కాబట్టి
ఏ కల్పనలూ లేదు...అప్పుడే...నిర్వాణ స్థితి వస్తుంది...
.
చైతన్యం జీవితం అనుభవం నకు, ప్రతీ అనుభవము నకు కూడా ఆధారంగా ఉంటుంది. 

నీది అనబడే ఆలోచనలకు గాని, స్పర్శ అనుభవం నకు గాని నీకు ఆధారంగా ఉండి, నీలో ఉండే చైతన్యం జీవము యొక్క చైతన్యం వలె పిలువబడుతుంది. స్త్రీ అనబడే స్థితిని స్త్రీ వలె, పురుషుడు అనబడే స్థితిని పురుషుని వలె జీవించడం, ప్రతీ జీవము కలిగిన సమస్తమైన జీవులను కూడా నడిపిస్తుంది చైతన్యం అంటారు. 

చైతన్యం చైతన్యం వలె గుర్తించడం సాధ్యం కాదు. సంస్కారములు పూర్తిగా రహితం చెందితే మనము చైతన్యం గుర్తించడం సాధ్యం అవుతుంది.  ఆలోచనలు యందు నీవు నిఘా ఉంచితే, ఆలోచనలకు సంబంధించిన క్రమం నీవు గుర్తించి, ఆలోచన పూర్తి అయినప్పుడు మరొక ఆలోచన రావటం గుర్తిస్తారు. CONTINUE ఆలోచనలు చేస్తూ ఉన్నాను అనిపిస్తుంది కాని ఆలోచన, ఆలోచన మధ్య SECOND TIME GAP ఉంటుంది. GAP శూన్యం కాదు, విరామం కాదు, అదేమంటే చైతన్యం. అది సంస్కారములు లేనిది పరిశుద్ధ చైతన్యం. దానిని పెంచుకోవడం చెయ్యాలి ...
.
ఒక రోజు కబీర్ దాస్  ఒక ఊరిలో ఉండగా.. 
ఆ ఊరి ధనవంతుడు 
తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. 
కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. 
వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ, 
అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు. ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు. తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. 

ఆత్మ, పరంగా అందరిలో ఉన్న 
భగవంతుడు మాత్రమే శాశ్వతం. 
ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. 
ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...
.
మనతో వచ్చేదేమిటి

ఒక ఆదివారం ఉదయం, ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది. ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ, ఆగి, దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది.

ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి, విశ్లేషించి, ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి, ఆకు మీద నడిచి, అవతలి వైపుకు వెళ్లి, ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది.

దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది, పరిమాణం తక్కువగా ఉంది.., కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది.

కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు - అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది.

చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు..? దానికి అది సాధ్యం కాలేదు..!

అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది.

చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు.

మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము, మన ఉద్యోగం గురించి చింతిస్తాము, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ నివసించాలి, ఎటువంటి వాహనం కొనాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి... అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం.

మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించకోలేము...
.

సేకరణ...

శ్రీ భగవాన్ రమణుల వారి బోదనల ప్రకారం

 *ప్రియమైన ఆత్మీయులారా* ! 

*శ్రీ భగవాన్ రమణుల వారి బోదనల ప్రకారం* 
ప్రతీ మనిషి జీవితం లో తనను తాను తెలుసుకోవడమే జీవిత పరమ లక్ష్యం.

*దీని కోసం సాదన చేయాలంటే మోట్ట మోదటి మెట్టు*.

నీలో కదిలే లేక మెదిలే ప్రతీ ఆలోచనను నీవు పరిశీలించగలగాలి, నీ పరిశీలనలో ఆ ఆలోచనలు నీలో మెదలడానికి సహకరించిన జ్ఞానేంద్రియం ఎదో తెలుసుకోవాలి. ఆ ఆలోచన పూర్వ అనుభవం వల్ల కదిలిందా లేక వర్తమానం వల్ల కదిలిందా లేక భవిష్యత్ వల్ల కదిలిందా చూడగలగాలి ఇదే మోదటి సాదన.

ప్రత్నించి చూడండి. అర్థం కాకుంటే ప్రశ్నంచండి. 

శ్రీ ఆది శంకరాచార్యులు

 *ఓం నమః శివాయ*:
*అమృతస్య పుత్రాః*
*శ్రీ ఆది శంకరాచార్యులు*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః!!

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.
(- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా!!
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).

హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:-

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు.

శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని -  శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.

మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు. తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో ధర్మదండము పేరిట పద్య కావ్యంగా డా. కోడూరి విష్ణునందన్ రచించారు.

సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో  జన్మించారు.

శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు)

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.

గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.

మనీషా పంచకం...

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధాన మయ్యాడు.

*ప్రస్థానత్రయం*

అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.

*వ్యాసమహర్షి*
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.

వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరగా, వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక" అని దీవించాడు.

*శంకరాచార్యుల శిష్యులు*
శంకరులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యులు కొందరు ఉన్నారు.

*పద్మ పాదుడు*
శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగొట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ ఉంది. శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు కాపాలికులు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆ పరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికాడు. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉన్నాడు. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

*కుమారిల భట్టు ను కలవడం*
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు.

శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుల దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరారు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరులతో చెప్పాడు.

*భట్టిపాదుడు*
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి బౌద్ధమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని బౌద్ధ భిక్షువుగా వేషం ధరించి ఒక బౌద్ధ మతగురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒకనాడు ఒక బౌద్ధ బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోయింది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపాటున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షించవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాదుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహా విష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని బౌద్ధ బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు. దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, బౌద్ధంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరులు అక్కడకు వచ్చి వారిస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుల చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరులు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తారు.

*మండన మిశ్రునితో తర్క గోష్ఠి*
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా, మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండనమిశ్రుని మెడలోని మాల వడలిపోయింది. కాని, భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి, శుక్ల పక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరులు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగారు.

శంకరులు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని, మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశారు. చివరికి మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.

*దిగ్విజయ యాత్రలు*
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినపుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరులు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.

తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.

*సర్వజ్ఞపీఠం అధిరోహణ*
శంకరులు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతంలో ఉంది. ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.

తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది.

*శంకరుల జీవిత కాలము*
శంకరుల జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయా లున్నాయి.

క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.
అయితే శంకరులు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుల సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దం వాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత బలంగా ఉండే అవకాశం ఉండవచ్చును.

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగింది.

శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టారు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరులు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు.

శిష్యుడు ,...
(హస్తామలకాచార్యుడు/ గోవర్ధన పీఠం-
పూరి-/ప్రజ్ఞానంబ్రహ్మా/
ఋగ్వేదం/ భోగవార)

(సురేశ్వరాచార్యుడు/ శృంగేరి శారదాపీఠం/
శృంగేరి/ అహం బ్రహ్మాస్మి /యజుర్వేదం/ భూరివార)


(పద్మపాదాచార్యుడు/ కాంచి పీఠం/
ద్వారక /తత్వమసి/ సామవేదం/ కీటవార


(తోటకాచాఱ్యుడు/ జ్యోతిర్మఠం/
బదరీనాధ్/ అయమాత్మా బ్రహ్మా/ అథర్వవేదం/ఆనందవార)


ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించారు.

వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడింది.

ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ
యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి
సామవేదం నుండి తత్త్వమసి
అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ
అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.

సంప్రదాయాలు: సంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరులు నాలుగు మఠాలను నిర్దేశించారు.

పూర్తి వ్యాసం కొరకు చూడండి. - చతుర్ధామాలు (మఠాలు), పూరీ మఠం, ద్వారక మఠం, శృంగేరి, బదరీనాథ్ మఠం

మఠ నిర్వహణలో శంకరుల వ్యవస్థానైపుణ్యము
మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరులు ఏర్పరిచారు. వాటిలో

శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.
వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.
పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.
ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.

*శంకరుల రచనలు*
^^^^^^^^^^^^^^^^^^^^
ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరులు ఉదహరించారు. స్వానుభవానికి శంకరులు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుల రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.

*భాష్యాలు*

బ్రహ్మసూత్రాలు
ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)
బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)
ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)
తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)
ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)
మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము) మరియు గౌడపాదకారిక
ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)
ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)
భగవద్గీత
విష్ణు సహస్రనామ స్తోత్రము
గాయత్రీ మంత్రము
ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరులు వ్రాశారా అన్న విషయం గురించి సందేహాలున్నాయి. బ్రహ్మ సూత్రాలకు శంకరులు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరులు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నారు.

*ప్రకరణ గ్రంథాలు*

ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.

వివేక చూడామణి
ఉపదేశ సహస్రి
శతశ్లోకి
దశశ్లోకి
ఏక శ్లోకి
పంచ శ్లోకి
ఆత్మబోధ
అపరోక్షానుభూతి
సాధనా పంచకము
నిర్వాణ శతకము
మనీషా పంచకము
యతి పంచకము
వాక్య సుధ
తత్వబోధ
సిద్ధాంత తత్వవిందు
వాక్యవృత్తి
నిర్గుణ మానస పూజ
శంకరులు వ్రాసారని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరులు వ్రాసారని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుల పేరు మీద ప్రసిద్ధమయ్యాయని).

*స్తోత్రాలు*

భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరులు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్థనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:

శివ పంచాక్షరీ స్తోత్రం
ప్రస్థానత్రయం
పాండురంగాష్టకం
సాధన పంచకం
వివేకచూడామణి
శివానందలహరి
మనీషాపంచకం
సౌందర్యలహరి
మీనాక్షీ పంచరత్న స్తోత్రం
ఆనందలహరి
గణేశ పంచరత్న స్తోత్రం
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
భజగోవిందం
కనకథారా స్తోత్రం
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
గంగా స్తోత్రము
వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.

శంకరులు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు) నుండి గ్రహించారు.

అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -

బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః
బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.

శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, మహాత్ములు.

శంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.

*శంకరుల ప్రభావం*
బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుల కాలంనాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగవులాడుకొంటుండేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు.

ఆది శంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు.

కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు.
దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరులు నెలకొలిపినవే.

సంప్రదయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు.

శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం

శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోక శంకరం
శంకరుల తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు, సంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. వీరు మువ్వురి కృషివలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈ నాటికీ లభిస్తున్నది. 

*అనంతర పరిణామాలు*

శంకరుల అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. అద్వైత సిద్ధాంతంలో పాండిత్యాన్ని సంపాదించిన పిదప ఎందరో పండితవర్యులు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించిన మీదట నేడు అమలులో ఉన్న అద్వైత వ్యవస్థలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.

నిర్గుణబ్రహ్మ వాదము
బ్రహ్మవివర్త వాదము
అనిర్వచనీయ ఖ్యాతివాదము
జీవన్ముక్తి వాదము
అద్వైత సిధ్ధాంతపు పునాదులపై ప్రతిపాదించ బడిన ఈ నాలుగు సిధ్ధాంతాలూ, ఒకదానికొకటి చక్కని పొంతన కలిగి ఉన్నాయనటంలో సందేహం లేదు.మొదటి రెండు సిద్దాంతాలకూ అధిభౌతిక భావార్థముంటే, మూడవ దానికి అధిభౌతిక మరియు జ్ఞానమీమాంసకు సంబంధించిన భావార్థాలున్నయి. నాలుగవ సిద్ధాంతానికి గొప్ప మౌక్తిక భావార్థమున్నది.

🕉🌞🌎🌙🌟🚩

*జగద్గురు ఆది శంకరాచార్య*

" సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం "
 
         కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు.

చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

 మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

 తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

*శంకరుల రచనలు:*

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము

        ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

*విష్ణు షట్పది:*

మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

*సాధనా పంచకము:*

శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. 

దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

*శివ సువర్ణమాలా స్తుతి:*

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

*ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:*

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. 

శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

*ముగింపు:*

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది....

ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్ గురువులకు శతసహస్రపాదాభివందనములు.

🕉🌞🌎🌙🌟🚩

దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
అద్వైతం లేదా స్మార్తం
విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
ద్వైతం లేదా మధ్వం

హిందూమతాన్ని ఉద్ధరించిన ఆచార్యులలో ముఖ్యులు  త్రిమతాచార్యులు.
త్రిమతాచార్యులు:
ఆది శంకరాచార్యులు
రామానుజాచార్యులు
మధ్వాచార్యులు
ఆది శంకరాచార్యులు:
సమకాలీన హిందూమతం పై అత్యంత ప్రభావం చూపిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. భజ గోవిందం, కనకథారా స్తోత్రం, శివానందలహరి (శ్రీశైలంలో రచించారు), సౌందర్యలహరి, గణేశ పంచరత్న స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఆది శంకరులు 108 గ్రంథాలు రచించారు. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు. తరువాత ఆది శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు.

ఆది శంకరాచార్యులు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్థాపించారు. వీటినే చతుర్ధామాలు, చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుంచి నేటి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏ ప్రాతిపదిక పై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. ఆది శంకరులు స్థాపించిన ఆ నాలుగు మఠాలు ద్వారకా మఠము, గోవర్ధన మఠము, శృంగేరి మఠము, జ్యోతిర్మఠం మఠము.

ద్వారకా మఠము(గుజరాత్‌)
ఈ మఠము శంకరులచే దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము. భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది. ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్‌లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసం తీసుకోబోయే ముందు బ్రహ్మచారిగా చేరి శిక్షణ పొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. తత్త్వమసి అనేది ఈమఠం యొక్క మహావాక్యం. ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింపబడతారు. సింధు, సౌరాష్ట్ర, మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమ భారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో హిందూమత ధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకా మఠానిది.

గోవర్ధన మఠము
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి(సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

శృంగేరీ మఠము
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.

జ్యోతిర్మఠము
దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి.

🕉🌞🌎🌙🌟🚩

సంతృప్తి సంతోషానికి దారి తీస్తుంది

 *🕉సంతృప్తి సంతోషానికి దారి తీస్తుంది* 


మనిషికి జీవితం లో సంతృప్తి ఎంతో అవసరం.ఎంత ధనవంతులైనప్పటికి, అతను సంతృప్తిగా లేకుండా ఉంటే సంతోషంగా ఉండలేడు.

కోరికలను సంతృప్తి పరచడానికి చాలా ప్రయత్నాలు కృషి అవసరం. ఈ ప్రక్రియలో సంతోషం ఏమిలేదు. ఒకవేళ ఆ వస్తువును పొందినప్పటికి, దానిని కాపాడటంలో ఎంతో కష్టం వున్నది. ఇక్కడ కూడా మనం ఆనందాన్ని అనుభవించటం లేదు. ఒకవేళ కష్టపడి సంపాదించిన వస్తువు పోతే దుఃఖం మాత్రమే మిగులుతుంది. అందువల్ల కోరిక మీద కోరికలను పెంచకూడదు. పాత రోజుల్లో ఋషులు అడవులలో నివసించేవారు. సౌకర్యాలు లేకపోయినా వారు సంతోషంగా ఉండేవారు. అది వారి మానసిక సంతృప్తి కారణంగా ఆలా జరిగేది.

మనం ఎంత ధనవంతులైనప్పటికీ, ఓ సాధారణమైన వ్యక్తిగా సంతృప్తికరంగా
ఉండగలం. మనం ప్రయత్నాలు చేపట్టకుండా, ఒకవేళ సంపద మనకు వస్తే దానిని కూడా మంచి ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలి. అలా చేయడం వల్ల మన జీవితాలు శుద్ధి అవుతాయి. పురాణాలలో పరమేశ్వరుడు పులి చర్మం తో కప్పబడి బూడిదను పూసుకోవాలి. ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లు చిత్రికరించబడి ఉంటుంది. అది ఇంద్రియ సుఖాల నుండి నిర్లిప్తతను, విముఖతను సూచిస్తుంది.

అందుకే ప్రాజ్నులు ఎమన్నారంటే ? నిజమైన ధనవంతుడు మరియు నిజమైన పేదవాడు ఎవరు అనే దాని గురించి ఈ క్రింది విధంగా పలికారు. 'ఎవడు ధనవంతుడు అంటే ? కోరికలు లేకుండా సంతృప్తి కరంగా ఉండేవాడు. ధనవంతుడు ఎవరు ఇలా ఉండలేరో వారు పేదవాళ్లు అని '.

అందువల్ల సంతృప్తి తో నిండిన ఆనందాన్ని జీవితం లో ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం వలన ప్రతీ ఒక్కరకి ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి.

🕉🙏
 మనకు సద్గురువు లభించే వరకు మహాత్ముల బోధలు,ధ్యానం రోజు కొద్దిసేపు అవసరం.ఏంత వరకు అవసరమో అంతే చాలు.కష్టపడి సాధనలు చేయవలసిన పనిలేదు. మనకు అదృష్టం ఉంటే మనకోసం కష్టపడే వారు రావచ్చు,చేయచ్చు. సద్గురువులు ఉంటే నీ ఇంటికే వచ్చి నీకు దర్శనం ఇస్తారు.అంత వరకు నిలకడ ఉంటే చాలు.శ్రద్ధ విశ్వాసం ఉంటే ఏందుకు రాడు. వచ్చేది ఏవరో ఏవరికి తెలియదు. కాలదేశాలకు అతీతమైనవాడు క్షణాల్లో ఏక్కడికయైన రాగలడు. అందుకు తగ్గట్లుగా మనం ఉండాలి. జీసస్ మాట్లాడుతూ పెండ్లికొడుకు పెండ్లి కార్యాలు ఉన్నంత వరకు మంచి భోజనాలు రోజు ఉంటాయి. ఏవరు ఉపవాసం ఉండవలసిన పనిలేదు అన్నారు. అంటే సత్పురుషుల ఉన్నంత వరకు ప్రార్థన,సాధనలు అవసరం లేదని అర్థం.

అహం మరియు హృదయం (స్పృహ కేంద్రం)

 *🕉️నమో భగవతే శ్రీ రమణాయ 🙏🙏*
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* చెప్పారు:
🔅"అహం మరియు హృదయం (స్పృహ కేంద్రం):

శరీరం లోపల అహం పుడుతుంది. 
అందువల్ల, మొదటి సందర్భంలో, మీరు దాని మూలం కోసం శరీరం లోపల చూడవచ్చు. 
మీరు మూలాన్ని చేరుకున్నప్పుడు లోపల లేదా వెలుపల ఉండదు ఎందుకంటే ఆత్మ మూలం సర్వవ్యాప్తి చెందుతుంది. 
సాక్షాత్కారమైన తర్వాత అంతా ఆత్మ లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. 
"నేను అనే ఆలోచన"  ఉద్భవించిన ప్రదేశంగా హృదయం నిర్వచించబడింది. 
హృదయం అంటే చైతన్య కేంద్రం. ఇది శరీరంలోని ఏ భాగముతోనూగుర్తించబడదు".
 
_*మూలం: శ్రీ రమణ మహర్షి:
అక్టోబర్ 1969 సంచిక 'ది మౌంటెన్ పాత్"*_

🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

శ్రీరమణీయం: ధ్యానం అనుభవంలోవున్నా గుర్తించలేకపోతున్నామా ? అదెలా జరుగుతుంది !?

 💖💖💖
         💖💖 *"539"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ధ్యానం అనుభవంలోవున్నా గుర్తించలేకపోతున్నామా ? అదెలా జరుగుతుంది !?"*

*"ధ్యానం కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే అనుభవంలోకి వచ్చేది కాదు. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోయామన్న విషయం గ్రహించగలగాలి. ఒక్కసారి ధ్యానం ఆవిష్కరింపబడిన తర్వాత ప్రతి పనిలోనూ దాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఒక్కసారి ఆ స్థితి అర్ధమైతే ఈ లౌకిక జీవనంలో పొందే సుఖదుఃఖాలు అన్నీ కేవలం పాలవంటి ధ్యానంపై ఏర్పడిన నురగతో సమానమని తెలుస్తుంది. అందుకే ధ్యానానుభవం పొందిన వ్యక్తి 99 శాతం స్వీయ ఆనందాన్ని పొందుతూ, ఒకశాతం లౌకిక జీవనంలో ఉంటాడు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

జ్ఞానం కలగాలంటే దీన్ని తొలగించుకోవాలి!!

 జ్ఞానం కలగాలంటే దీన్ని తొలగించుకోవాలి!!

ధూమేనావ్రియతే వహ్నిర్యథా దర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భస్తధా తేనేడమావృతమ్ః||

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మానిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు. ఈ కామము దాని వలసపుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది

ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మ స్వరూపము. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలె ఏర్పడి కప్పి ఉంచుతాయి.

ఎలాగంటే….

అద్ధం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలయితే అగ్ని కనిపించదు. ఊదితే మండుతుంది అప్పుడు పొగ ఉండదు. ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవేకానీ ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సాంగత్యము, నిష్కామ కర్మ భావన లేకుండా కర్మలు ఆచరించడం.

జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగి పోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పొగతో కప్పబడి నప్పుడు అగ్నికి గానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మాచితో కప్పబడినప్పుడు శిశువుకు గానీ ఎటువంటి హానీ జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమౌతాయి. దీని వలన మనకు తేలిందేమిటంటే మనం ఆనంద స్వరూపులము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది. కాని మనం కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము.

మనం అందరం శివస్వరూపులము శివ అంటే ఆనందము. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము. అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము. చాలా మంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు, అందరూ ఆనంద స్వరూపులే, మనం ఆ ఆనందాన్ని చేచేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము.

పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు, ఈ కామము క్రోధమును తొలగించుకోడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా ఖర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికి రాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జాయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు.

కామము మానవునిలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము. కామంతో కళ్లు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడినా, కామము అంటే కోరిక అని అర్ధం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం.

ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ, ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్నినుండి పొగ వస్తుంటే, ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమపడనక్కరలేదు. కాని మరి కొన్ని కోరికలు ఉంటాయి. చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికిలాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్టతీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ తో క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి, ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమపడితేనే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయట పడలేము. ఆ కోరికల ప్రభావంనుండి బయట పడటానికి కొంత కాలము వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎలాగంటే
శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. తొమ్మిది నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే గానీ, ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు. కాలక్రమేణా పోవలసిందేకానీ, మన ప్రయత్నం వలన పోవు, కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి...

సంసారమనే విషవృక్షానికి 
అమృతముతో సమానమైన రెండు ఫలములు ఉంటాయి.

ఒకటి సద్గ్రంథపఠనం, 
రెండోది సత్పురుష సహవాసం. 

గ్రంథాలు చదివినా..వాటిని అర్థము చేసుకోగలిగే విజ్ఞానం అవసరం. కానీ సత్సాంగత్యానికి.. ‘సత్పురుషుడా.. కాదా?’ అని గుర్తించగలిగిన వివేకం ఉంటే సరిపోతుంది.

అందుకే మన పెద్దలు ‘‘సత్సంగశ్చ, వివేకశ్చ నిర్మలం నయనద్వయం’’ అన్నారు. సత్సాంగత్యం వల్ల మానవుడు పొందవలసిన సకల శుభాలూ పొందగలడు.

ఇది కలియుగం. యుగధర్మం ప్రకారం మూడు భాగాలు అధర్మం. ఒక భాగం ధర్మం. ధర్మాధర్మ విచక్షణ కలవారెవరైనాలౌకిక వ్యావహార సరళిని పరిశీలిస్తే యుగ ధర్మ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు మనం కాల ప్రవాహములో పడి కొట్టుకొని పోవడమా! లేక చైతన్యవంతులమైన మానవులుగా విజ్ఞతతో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమా అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భములో.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన *‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’* 
అనే మాట స్ఫురిస్తుంది. ‘ధర్మాన్ని నెలకొల్పడానికి ప్రతియుగంలో అవతరిస్తాను’ అన్న భగవద్వాక్యం ప్రకారం.. ఎక్కువ మోతాదులో ఉన్న అధర్మం కన్నా తక్కువగా ఉన్న ధర్మమే జయించగలదు. *‘ధర్మోరక్షతి రక్షితః’* ధర్మాన్ని మనం కాపాడితే ధర్మపక్షపాతియైున భగవంతుడు మనను కాపాడుతాడు. భగవంతుడు సత్పురుష పక్షపాతి కావున సత్సాంగత్యము చేసిన మనను కూడా రక్షిస్తాడు. దాని వలన మనకు కలిగే లాభం.. అనంతం, అపరిమితం.

సత్సంగత్వే నిస్సంగత్వం 
నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలతత్వం 
నిశ్చలతత్వే జీవన్ముక్తిః

ఇది పారలౌకికం. ఈ లోకానికి సంబంధించి.. సత్సహవాసం వల్లమనిషి సంస్కరింపబడతాడు. వ్యక్తులు సంస్కరింప బడితే సమాజం బాగుపడుతుంది. అప్పుడు దేశం సుఖశాంతులతో వర్థిల్లుతుంది. సత్సాంగత్యం ప్రభావం వర్ణనాతీతం. సత్పరుషులైన సప్తర్షులను కలవడం వలనే బోయవాడు వాల్మీకిగా మారి ప్రపంచప్రసిద్ధి గాంచిన రామాయణ మహాకావ్య రచన చేయగలిగాడు. నాస్తికుడైన ‘నరేంద్రుడు’.. రామకృష్ణ పరమహంస అనే గురువును పొందడం వల్లనే వివేకానందుడుగా మారి భారతదేశానికి, హిందూమతానికి ప్రపంచ ప్రఖ్యాతి కలిగించాడు.

సువాసనగల, అందమైన పూలతో సాంగత్యము చేసి హారంగా మారడం వల్లనే దారానికి భగవంతుని కంఠసీమలో స్థానం లభించింది. పూలలో దాగుండే కొన్ని చిన్న కీటకాలు ఆ పరమేశ్వరుని శిరోభాగమును చేరగలుగుతున్నాయి. ఈ విధంగా సత్సాంగత్యానికి సత్ఫలితం ఉన్నట్లుగానే.. దుస్సాంగత్యానికి దుష్ఫలితం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, మానవులు సత్సాంగత్యం ద్వారా సత్ఫలితాలు పొందగలరని ఆశిద్దాం.....

ప్రశ్న :- నా ప్రమేయం ఏమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేను అనుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా?

 🌹ప్రశ్న :- నా ప్రమేయం ఏమి లేకుండా నాకేదైనా వచ్చిందనుకోండి, దానిని నేను అనుభవిస్తే దాని వల్ల చెడు ఫలితాలుంటాయా?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

అది కాదు విషయం. ప్రతిపనికీ ఫలితము ఉంటుంది. ప్రారబ్ద వశాన నీకేదైనా వస్తే నీవేమీ చేయలేవు దానికి.

వచ్చిన దానిని ఏ మమకారమూ లేకుండా, అదే ఇంకా ఎక్కవ కావాలనే కోరిక లేకుండా, తీసుకుంటే నీకే కీడూ వాటిల్లదు.

దాని వలన మళ్ళీ జన్మ నెత్త వలసి రాదు.

అట్లాకాక, ఎంతో ఆసక్తితో దానిని ఆస్వాదించి, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటే, మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది.

సేకరణ : నీ సహజస్థితిలో ఉండు, ఆంగ్లమూలము డేవిడ్ గాడ్ మ్యాన్ తెలుగు అనువాదము పింగళి సూర్యసుందరము

..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్

శ్రీరమణీయం:బయటి వస్తువులు, విషయాల ద్వారా లభించే సంతోషం, సుఖం తెలుస్తుంది కానీ మనసు తన నుండి తాను పొందేది ఏమిటో అర్థం కావడం లేదు ?

 💖💖💖
       💖💖 *"538"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"బయటి వస్తువులు, విషయాల ద్వారా లభించే సంతోషం, సుఖం తెలుస్తుంది కానీ మనసు తన నుండి తాను పొందేది ఏమిటో అర్థం కావడం లేదు ?"*

*"మనం పొందుతున్న ప్రతి అనుభవంలోనూ మనసు తన నుండి తాను పొందే ఫలం, ఎదుటి వస్తువు నుండి పొందే ఫలం జంటగానే లభిస్తున్నాయి. మనకిప్పుడు ఎదుటి వస్తువు నుండి వచ్చే ఫలమే తెలుస్తుంది. అందులోనే మనసు నుండి మనసు పొందే 'శాంతి 'అనే ఫలం కూడా కలిసిపోయి ఉన్నట్లు గ్రహించలేక పోతున్నాం. అలా నిరంతరాయంగా ఉన్న శాంతి మన గ్రహింపులోకి వచ్చేందుకు మనసును అనుసరించే ఉంటుంది. అందుకే మనసును గమనిస్తూ ఉండటంచేత నిరంతరాయంగా ఉన్న ధ్యానం ఏదో ఒక రోజు దానంతట అదే ఆవిష్కరింప బడుతుంది. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోతున్నామన్న విషయం అప్పుడు అర్థమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

*సాధువులతో సాంగత్యం* ✍️ వంగూరి చిట్టెన్‌రాజు

 *సాధువులతో సాంగత్యం*
                  ✍️ వంగూరి చిట్టెన్‌రాజు
🙏🌹🍁🌹🍁🔯🍁🌹🍁🌹🙏

*“సాధూనాం దర్శనం పుణ్యం*
*స్పర్శనం పాపనాశనమ్*
*సంభాషణం కోటితీర్థం*
*వందనం మోక్ష సాధనమ్”*

​💫 ఉలుకూ పలుకూ లేని విగ్రహరూపంలో దైవ దర్శనంతో, దైవ ధ్యానంతో పుణ్యం సంపాదించుకోవడం కోసమే కాకుండా అక్కడ ఉన్న సాధువులని దర్శించుకుని, వారి పాదాలని స్పృశించి, వారితో సంభాషించి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుని ఐహిక అజ్ఞానాన్ని పోగొట్టుకోడానికీ, మానసిక శాంతిని పొందడానికీ కూడా  పూర్వం పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్లేవారు. 

💫 ఈ 'సాధు' శబ్దం సృష్టిలో సర్వజనులకీ, పశుపక్ష్యాదులకీ కూడా వర్తిస్తుంది. *సత్సాధన సంపత్తి కలిగిన వారందరూ సాధువులే.* అటువంటి వారిని రక్షించడానికే... *“పరిత్రాణాయ సాధునాం, వినాశాయచ దుష్కృతాం”* అనే శ్లోకంలో తన అవతారాలన్నింటికీ ఏకైక కారణంగా ఆ పరమాత్మ ప్రకటించుకున్నాడు. సాధువులతో సమయం గడపడం వలన కలిగే సత్ఫలితాలకి ఉదాహరణగా ఒక ఐతిహాసిక కథ చెప్పుకోవాలి.

💫 ఒక సారి విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. యాగం పూర్తి అయ్యాక అనేక మంది బ్రాహ్మణులకీ, ఋషులకీ వారి వారి స్థాయిని బట్టి దానాలు చేశాడు. వారిలో వసిష్ఠుల వారి వంతు రాగానే ఇంత గొప్ప ఋషికి తగిన దానం ఇవ్వాలని తీవ్రంగా ఆలోచించి తన తపస్సులో ద్వాదశ సంవత్సర తపఃఫలం వసిష్ఠులవారికి ధారాదత్తం చేశాడు విశ్వామిత్రుడు. 

💫 కొన్నేళ్ళ తరువాత వసిష్ఠులు ఒక విశిష్టమైన యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు విశ్వామిత్రుల వారు కూడా అందులో పాల్గొన్నారు.  దానధర్మాల సమయం వచ్చినప్పుడు వసిష్ఠులవారు ఒకప్పుడు సాధుసంఘములో ఒక ఘడియకాలము సమావేశం అయినప్పుడు సమకూరిన ఫలంలో పావు ఘడియ భాగం విశ్వామిత్రుల వారికి దానం చేశారు. 

💫 వెంటనే... “నేను పది సంవత్సరాల తపోఫలం ఇస్తే  ఈయన కేవలం పావు ఘడియ ఫలం నాకు దానం ఇచ్చి అవమానం చేస్తాడా?” అని విశ్వామిత్రులవారికి విపరీతమైన కోపం వచ్చి యజ్ఞవాటిక లోంచి లేచి వెళ్లిపోతాడు. ఋషులందరూ ఎంత నచ్చ చెప్పినా విశ్వామిత్రుడు వినలేదు. 

💫 అప్పుడు ఈ వివాదం పరిష్కరించడానికి నలుగురు న్యాయనిర్ణేతలని ఎంపిక చేసి వారి నిర్ణయానికి కట్టుబడేలా విశ్వామిత్రుడినీ, వసిష్ఠుడినీ ఒప్పించారు. అ నలుగురూ సూర్యుడు, వాయుదేవుడు, ఆదిశేషుడు, అగస్త్యమహర్షి.

💫 ఈ నలుగురినీ ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలీ అనే ప్రశ్న వచ్చినప్పుడు విశ్వామిత్రుడు లేదా వసిష్ఠుల వారు వెళ్తే సమంజసంగా ఉంటుంది అని సాధుసంఘం తీర్మానించింది. ముందు విశ్వామిత్రుడి పేరు సూచించగానే వసిష్ఠులవారు..  “నేను ముందు వెళ్తే ఆ నలుగురినీ నేను వశపరుచుకుంటాను అని కొందరికైనా అనుమానం వస్తుంది” అని విశ్వామిత్రుడే ఆ నలుగురినీ ఆహ్వానించడానికి అంగీకరించారు. 

💫 విశ్వామిత్రుడు ముందు సూర్యుడి దగ్గరకి వెళ్లి విషయం చెప్పి ఆహ్వానించగానే సూర్యుడు “అభ్యంతరం లేదు కానీ, నేను ఒక్క క్షణం ఇక్కడి నుంచి కదిలితే ప్రపంచం అంతా చీకటైపోయి అల్లకల్లోలం అయిపోతుంది. కాలచక్రం ఆగిపోతుంది. ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి?” అన్నాడు. ఏమీ చెప్పలేక విశ్వామిత్రుడు వాయుదేవుడి దగ్గరకి వెళ్ళాడు. 

💫 వాయువు అంతా విని, “నేను సర్వప్రాణులకి ప్రాణప్రదమైన వాయువుని కదా. మీకు తెలియనిది ఏముందీ? నేను వస్తే అంతా నిర్జీవం అయిపోతుంది. మరేమన్నా మార్గం ఉందా?” అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆదిశేషువు దగ్గరకి వెళ్లి విషయం వివరించాడు. ఆదిశేషువు తలలు ఊపి “నేను యావత్ భూమండలాన్నీ నా తలల మీదే మోస్తున్నాను కదా. దానికి మీరు మరో ప్రత్యమ్నాయం ఏర్పాటు చెయ్యగలరా ఋషివర్యా?” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఏమీ చెప్ప లేక అగస్త్యమహర్షి దగ్గరకి వెళ్లి కనీసం మీరైనా ఈ వివాదం తేల్చమని అడిగాడు. “తప్పకుండానూ, కానీ శ్రీకైలాసగిరిలో దాక్షాయణి వివాహ సమయంలో దేవతలు, ఋషులు సువర్ణగిరి మీద కొలువు తీరడం వలన భూమి ఉత్తర భాగానికి ఒరిగిపోయింది కదా! అప్పుడు ఆ భూమిని సరిపరచడానికి పరమశివుడు నన్ను దక్షిణభాగాన ఉన్న మరత్తువామల పర్వతానికి వెళ్లి కొమ్ము కాయమన్నాడు కదా! ఇప్పుడు నేను మీ పంచాయితీకి వస్తే భూమి మళ్ళీ ఉత్తరం వేపుకి వంగిపోకుండా ఏమన్నా మార్గం ఉందా?” అని అడిగాడు.

💫 నిరాశతో వెనక్కి వెళ్లి ఇలా అన్ని చోట్లా జరిగిన సంగతులు విశ్వామిత్రుడు సాధుమండలికి వివరించాడు. ఇప్పుడేం చెయ్యాలా అని అందరూ ఆలోచించి మరే మార్గమూ లేక వసిష్ఠులవారినే మళ్ళీ ప్రయత్నించమన్నారు. “మీరందరూ ఆశీర్వదిస్తే మీ ఆజ్ఞ శిరసావహిస్తాను” అని ముందుగా వసిష్ఠులవారు సూర్యుడి దగ్గరకి వెళ్లి వృత్తాంతం అంతా వివరించారు. సూర్యుడు విశ్వామిత్రుడికి చెప్పినదే చెప్పాడు. దానికి వసిష్ఠుడు, “దానికి ఒక ఉపాయం ఉంది. నాకు పూర్వం ఒక ఘడియ సాధువులతో సమావేశానికి అవకాశం లభించింది. అంత మహిమ గల సాంగత్యం ప్రపంచంలో ఇంకేమీ లేదు. సాధు సంసర్గములో ఒక నిమేషం అనేక దివ్య సంవత్సరాల తపోమహిమ కంటే ఎక్కువే. అట్టి పవిత్రమైన దివ్యఫలాన్ని నేను విశ్వామిత్రుల వారికి నా యజ్ఞదానంగా ఇచ్చాను. కానీ దాని విలువ ఆయనకి తెలియక అది తిరస్కరించారు. అందువలన ఆ సాధుసంపర్కం జరిగిన ఘడియలో పావుభాగము నేను అభిమంత్రించి నా జపమాలలో నిలుపుతాను. సాధు సాంగత్యములో నిజమైన మహిమ ఉంటే అది మీరు తిరిగి వచ్చే వరకు ప్రపంచానికి వెలుగు ఇస్తుంది.” అని తన జపమాలను మంత్రించి నిలపగానే అది సూర్యుని కన్న ఎక్కువ కాంతితో  ప్రకాశించింది.

💫 తర్వాత అదే విధంగా వాయుదేవుడు, ఆదిశేషువు, అగస్త్య మహర్షికి కూడా ఒక్కొక్కరికి పావు ఘడియలో తనకి సాధు సాంగత్యం వలన వచ్చిన తపోఫలాన్ని వారి, వారి స్వధర్మానికి విఘాతం రాకుండా దానం చేసి, వసిష్ఠులవారు ఆ నలుగురినీ వెంటబెట్టుకుని రావడం చూసి విశ్వామిత్రుడు నిర్ఘాంతపోయాడు. తన తపస్సు ఇంకా పరిపక్వం చెందలేదు అనీ, తనలో రజోగుణావశేషాలు మిగిలే ఉన్నాయనీ, శాంతం, వినయం తక్కువగా ఉన్నాయనీ గ్రహించి మళ్ళీ తపస్సు కొనసాగించడానికి వెళ్లిపోయాడు.

💫 ఈ కథలో నీతి ఏమిటంటే సాధువులతో సంభాషించడం, వారు చెప్పేది ఆలకించడం వలన ప్రపంచాన్ని నియంత్రించే శక్తి వస్తుంది. కానీ కాషాయ వస్త్రాలు వేసుకున్న వారందరూ సాధువులు కాదు. సాధన సంపత్తి ఉన్నవారే... కాని, సాధువు వేషంలో ఆర్ధిక సంపత్తి పెంచుకున్న వారు సత్సాంగత్యానికి అర్హులు కాదు. చాలా మంది అభిభాషణలు కేవలం వినడానికి మాత్రమే బావుంటాయి.


*సేకరణ:*  
 🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి*  చెప్పారు:

💥“ఒక వ్యక్తి ఇతరుల తప్పులను పట్టించుకోకుండా, వారి యోగ్యతలను మాత్రమే చూసి, తన మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే, అతని జీవితమంతా సంతోషంగా ఉంటుంది. 
అన్ని విషయాలలో శ్రద్ధ చూపించకుండా, మనస్సు చల్లగా, కోరికలు లేకుండా మరియు ద్వేషం లేకుండా ఉండటం సాధకుడికి అందం."💥

- శ్రీ రమణ మహర్షి (జెమ్స్ ఫ్రం భగవాన్ )

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

:::::: నేను బలపడటం ::::::

 *:::::: నేను బలపడటం :::::::* 
      వివిధ వస్తువులు సమకూర్చుకుంటాం. అవి అన్నీ చూసి తృప్తి పడతాం. రకరకాల సంబంధాలు ఏర్పరచుకుంటాం, ఇవి చూసి నాకెంతో స్నేహబంధాలు వున్నాయి అని గర్వ పడతాం. బోలుడంత ఆస్తి కూడ పెడతాం .ఇది చూసి గొప్పగా ఫీల్ అవుతాము.           ఎన్నో అనుభవాలు పొందుతాం, వాటిని నెమరువేసుకుంటూ పొంగిపోతాం. రకరకాల సిద్ధాంతాలు, నమ్మకాలు పెట్టు కుంటాం.
 పై శనేనే అది, అదే నేను అని ఉబ్బిపోతాం ఈ రకంగా  విషయాలతో ముడిపడిన నాది, నేను,నా అనే భావనతో మనస్సు నిండుతుంది.
   చూసావా ఇదినాది. చూసావా ఇది నేనే, చూసావా నన్ను అని.
     ఈ భావన గర్వాన్ని, సంతోషాన్ని,విలువని, మురిపాన్ని ఇస్తుంది. ఇది మరింతగా నేను ని వృద్ధి చేస్తుంది.
  ఇప్పుడు ఇక్కడ నుండి పతనం మొదలు అవుతుంది.
     ఎందుకంటే ఇవేవీ శాశ్వతంగా వుండవు. వీటిని చూసి ఆకాశానికి పెరిగిన నేను అన్న భావన దుఃఖానికి దారితీస్తుంది
*షణ్ముఖానంద 98666 99774*

స్వరూపమే స్వదేశం-మమనోనాశం-మనోలయం

 స్వరూపమే స్వదేశం-మమనోనాశం-మనోలయం

మనోనాశం, మనోలయం అంటే ఏమి? అని ఒకావిడ గురువు గారిని ప్రశ్న అడిగారు...

నాశనమైతే తిరిగి పూర్వస్థితిని పొందే అవకాశం ఉంటుంది.
లయమైతే ఎప్పటికీ పూర్వస్థితిని పొందే అవకాశం ఉండదు.

అని సమాధానమిచ్చారు గురువుగారు.

మరణంలో జరిగేది - మనోనాశం.
మోక్షంలో జరిగేది - మనోలయం.

మరణంలో నాశనమైన మనసు తిరిగి మొలకెత్తుంది...జన్మకారణం.

భగవంతునిలో లయమైన మనసు తిరిగి మొలకెత్తదు...జన్మరాహిత్యం.

అజ్ఞాని మనసు సంసారమనే తడినేలలో వేసిన విత్తనం లాంటిది.
అది మొలకెత్తుతుంది.

జ్ఞాని మనసు జ్ఞానాగ్నిలో వేగిన విత్తనం లాంటిది.
అది మొలకెత్తదు.

సముద్రంలో కలిసిన నది వలె నామరూపాలు లేకుండా సముద్రమే(దైవమే) అయిపోవడమే
మనోలయం.

* * *

T.V. లో అన్ని రకాల ఛానళ్లూ ఉంటాయి.
మనం ఏ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానెల్ ప్రదర్శితమౌతుంది.

మన హృదయపేటిక కూడా అలాంటిదే.
అన్ని జన్మలూ అందులోనే ఉన్నాయి.
మనం ఏది ఎన్నుకుంటే, పైకి ఆ జన్మ ప్రదర్శితమౌతుంది. మిగతా అన్ని జన్మలూ సూక్ష్మరూపంగా ఉంటాయి.

మరణించేముందు సద్భావనతో ఉండమన్నారంటే,
మరో మంచి ఛానెల్ ను, అనగా మరో మంచిజన్మను తీసుకునే దిశగా వెళతాడు...అని. 

* * *

జన్మ పరంపర అంటే 
ఒక జన్మ తర్వాత మరొక జన్మ అని కాదు.

అన్ని జన్మలయొక్క సమిష్టిరూపంగా నీవున్నావు T.V. వలె.

ఇప్పుడే మానవ జన్మగా ఉండేది నీవే.
ఇప్పుడే చెట్టుజన్మగా ఉండేది నీవే.
ఇప్పుడే పిట్ట జన్మగా ఉండేది నీవే.

ఇప్పుడే సకలజన్మల రూపంలో ఉండేది నీవొక్కడివే.

జన్మపరంపర ఉండేది అడ్డానికి(Horizontal).
నిలువుకి(vertical)కాదు.

* * *

జీవించడం చేతగానివాడే పునర్జన్మ గురించి, జన్మరాహిత్యం గుఱించి ఆలోచిస్తాడు...

రసజ్ఞత లేని మనసే మోక్షాన్ని కోరుకుంటుంది.

మోక్షం అంటే ఏమి?
మరుజన్మ లేకపోవడమా?
నిజంగా అదే అయితే అలాంటి మోక్షం నాకొద్దు అంటాను. 
ప్రకృతి రసాస్వాదనమే తపస్సు...అన్నారు చలం. 

భగవంతుడు మనకు పంచేంద్రియాలను ఇచ్చింది
వాటిని మూసి పెట్టడానికీ కాదు,
అణగద్రొక్కడానికి కాదు,
జయించడానికీ కాదు.

భగవంతుణ్ణి అయిదు విధాలుగా అనుభవించడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే ఈ పంచేంద్రియాలు.

ఇంద్రియసుఖం ఆత్మసుఖానికి భిన్నమైనదేమీ కాదు. వీటి ద్వారా మనం అనుభవించేది ఆత్మనే. 

ఇది కాదు, ఇది కాదు అని అనడం వేద విధానం.

ఇది కూడా, ఇది కూడా అని ఉండడం మన గురు విధానం. 

సుఖం అనేది ఇంద్రియాలకు సంబంధించినది.
సంతోషం అనేది మనసుకు సంబంధించినది.
ఆనందం అనేది ఆత్మకు సంబంధించినది.

ఒకటి బావినీరు.
ఇంకొకటి నది నీరు.
ఇంకొకటి సముద్రపు నీరు.

నీరుగా అంతా ఒకటే.
ఆత్మగా అంతా ఒకటే.

అన్ని అనుభవాలూ ఆత్మానుభవాలే.
అన్ని సుఖాలూ ఆత్మసుఖాలే.
అన్ని శక్తులూ ఆత్మశక్తులే.

మోక్షం అంటే జడత్వం కాదు, చైతన్యం.
మోక్షం అంటే నిరాశావాదం కాదు, ఆశావాదం.
మోక్షం అంటే వైరాగ్యం కాదు, వైభోగం.

మోక్షం అంటే మరుజన్మ లేకుండా చేసుకోవడం కాదు,
ఎన్ని జన్మలైనా సరే ఈ జీవన మాధుర్యాన్ని చవి చూడ్డానికి ఉవ్విళ్లూరటం.

* * *

ఈ భూ గ్రహాన్ని పాడు చేసుకుని, అంగారక గ్రహానికి ప్రయాణం చేయడం గొప్ప సైన్స్ అని చంకలు గుద్దుకుంటోంది మానవసమాజం. 

ఈ లోకంలో సుఖపడడం చేతగానివాడు, స్వర్గలోకసుఖాలను అభిలషిస్తూ కర్మలు చేసేవాడు వెర్రివాడు.

ఏదయినా సరే-
ఈ లోకంలోనే సాధించండి.
ఈ గ్రహంలోనే సాధించండి.
ఈ దేశంలోనే సాధించండి.
ఈ దేహంలోనే సాధించండి.

అదే గురువుగారు చెప్పిన ఇప్పుడు-ఇక్కడ-ఇలా.

ఎప్పుడో-ఎక్కడో-ఎలాగో అనేదే మాయ.
ఇప్పుడు-ఇక్కడ-ఇలాగు అనేదే సత్యం.

* * *

ఉన్నచోటనే హాయిగా జీవించగలిగే పరిస్థితులను దూరం చేసుకొని, మరో దేశంలో, మరో గ్రహంలో, మరో జన్మలో, మరో లోకంలో సుఖపడదామనే ఆలోచనే ఇన్ని పరుగులకు, ఇన్ని వ్యధలకు కారణమైంది. 

పరుగెత్తే కుందేలు పదేళ్లే బ్రతుకుతుంది.
నిదానంగా సాగే తాబేలు వందేళ్లు జీవిస్తుంది.
అని సామెత.

పరుగు - దుఃఖం.
నెమ్మది - సుఖం.

పరుగెత్తి పాలు త్రాగడం కంటే
నిలబడి నీళ్లుత్రాగడం మేలు.

మన ఋషులు తపస్సులు చేసి
ఉన్నచోటునే ఉంటూ దేవుణ్ణి తమ వద్దకు తీసుకురాగలిగారు.

ఆది శంకరులు తామున్న చోటుకే నదిని 
రప్పించుకోగలిగారు.

ఎండమావుల వెంట పరుగులు  మానండి.
ఉన్నచోటనే ఉంటూ సుఖంగా జీవించగలిగే
జీవనవిధానాన్ని ప్రసాదించిన సంస్కృతి మనది.

స్వరూపమే స్వదేశము.
స్వరూపనిష్ఠయే పరమసుఖము.

* * *

*పిల్లలకు సంస్కారం బోధిస్తే… “సుఖంగా” ఉంటారు.* *గుర్తుంచుకొండీ……….* *పిల్లలు… చెప్తే వినరు… పెద్దలు ఆచరిస్తుంటే(చేస్తుంటే) చూసి.., నేర్చుకుంటారు..!*

 కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక *అగరుబత్తి* డబ్బాను కానుకగా ఇచ్చాడు.. 
 
  అది చూసిన తల్లి… ముఖం చీదరించుకుని.., “మీ నాన్న ఎప్పుడూ ఇంతే… మహా పిసినారి..!” అంటూ లోపలికి వెళ్లి, మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది. 

     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని గదిలోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది.
డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది. 
అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.
ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది.. 

    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది.. 

      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  “నీ తండ్రిగా నీకు కానుక” ఇవ్వాలని చాలా ఆలోచించాను.. 

     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు.. 
ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా పిసినారి అనుకుంటున్నావ్ కదా.?!
కాదు.. కాదు.!!

     “*మీ అమ్మ*”, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు *“అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో”*.., నువ్వుకూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి..!

    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక.. 

     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి *“సంస్కారవంతమైన ఇంటి నుండి “* మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం… నిజంగా మేము ధన్యులం..!” అంది.

*పిల్లలకు సంస్కారం బోధిస్తే… “సుఖంగా” ఉంటారు.*

*గుర్తుంచుకొండీ……….*
*పిల్లలు… చెప్తే వినరు… పెద్దలు ఆచరిస్తుంటే(చేస్తుంటే) చూసి.., నేర్చుకుంటారు..!*
(అది… మెట్టినింట, *పుట్టింటి గౌరవం* నిలపాల్సిన “ఆడ”పిల్లలైనా.., మనకు *వృద్ధాప్యంలో/నిస్సహాయ పరిస్థితుల్లో తోడుగా* ఉండవలసిన “మగ”పిల్లలైనా.

సంతోషం

 .    సంతోషం 

గుర్తుంచుకోండి-- మీరు విచారగ్రస్తులుగా ఉన్నారంటే , సాధారణంగా దానికి కారణం మీరు జీవితంలో సాధించదలుచుకున్న గొప్ప కార్యాలను దృఢంగా చిత్రీకరించుకోక పోవడం వల్లా, మీ సంకల్ప శక్తిని ,సృజనాత్మక సామర్ధ్యాన్ని , ఓర్పునూ మీ కలలు నిజమయే వరకూ పట్టుదలతో ఉపయోగించక పోవడం వల్లనేనని. 

శ్రీ శ్రీ పరమహంస యోగానంద
యోగదా సత్సంగ పాఠాలు. 

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

విషయ త్యాగమా? సంగ త్యాగమా? కర్మ త్యాగమా? ఫల త్యాగమా?

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

విషయ త్యాగమా? సంగ త్యాగమా? కర్మ త్యాగమా? ఫల త్యాగమా? 

వైరాగ్యం అంటే సంగ త్యాగం.. ఫల త్యాగం. 

నీవు చేసే సర్వ కర్మలను నాకర్పించెదవేని ... పరమాత్మ .. ఇంతకన్న ఆప్త వాక్యం ఏమి ఉంటుంది. 

నీవు ఏమి జీవనం జీవిస్తున్నావో ఆ జీవనాన్ని ఋషి వలే జీవించు. 

సంగ త్యాగం .. ఫల త్యాగం.. కర్తృత్వ త్యాగం తో జీవించాలి ఋషి. 

గురువుని తన హృదయంలో నిలుపుకోవటం ఉపదేశం 
నీ హృదయంలో గురువు మేల్కొన్నాడ .. అది ఉపదేశం స్వామి నిర్భయానందులు అనేవారు .

గురువు హృదయంలో శిష్యుడు మేల్కొనటం .. గురువు శిష్యుని వెంబడించటం ... సిధ్ధించటం. 
శరణాగతి కానివాడికి ఉపదేశం. 

సదా మెలకువ కల నిద్రల లో 
సదా సాథ్ రహో హే భగవాన్ .. భగవాన్ సత్య సాయి. 

నేను అజ్ఞానిని అని నన్ను వదలకు ... నీ పాద కమల సేవయు .. నీ పాదార్చకుల తోటి నెయ్యము.. నితాంతాపార భూతదయ నాకు దయ సేయగదే నయముగ శ్రీ కృష్ణా!! 

అశరీరవాణి తో మేల్కొనాలి శిష్యుడు... దేహాభిమానం సొరకాయ బుర్ర.. నీళ్ళు తాగటం జీవ చైతన్యం. 

విచార సాగరం చదివితే వైరాగ్యం .. జ్ఞానం .. సాధన ఏది ప్రధానమో చెపుతుంది .. సాధన కూడా భోగమే. 

గురువు అయస్కాంతం లాంటివాడు... శిష్యుడు సూది .. అలా గురువు ఎక్కడ ఉన్నా నిన్నాకర్షిస్తాడు. 

పరమాత్మ అందరికీ గురువు .. సూర్య చంద్రాగ్నులు ప్రకాశింపచేయలేవు నా పరంధామమును. 

అది కదా జీవనం .. ధ్యానం 

జ్ఞానంతో ధ్యానం చేసే వాడికి అంతర్ ముఖం.. బహిర్ముఖం అన్న భేదం లేదు. 

ప్రపంచం .. పరమాత్మ అన్న భేదం లేదు .. పరమాత్మకు భిన్నమైన వస్తువే .. ఆలోచనే లేదు. 

సంగ రహిత: విజ్ఞాని: .. సంగ రహితుడు విజ్ఞాని. సాధన దశలో అన్నీ ఉంటాయి ,సిధ్ధి దశలో ఉండవు. 

విషయాలను కాదయ్యా .. విషయాల పట్ల ఆసక్తి త్యజించు. 
మనసు పోరు పెడుతుంది... ఆరాటపడుతుంది .. ఆసక్తి పడుతుంది... ఆసక్తి త్యాగం చెయ్యాలి. 

గురువు ఏమి చెపితేఅది ఆచరించు.. గురువుకు శాస్త్రం నేర్పకు. 

గురువు అనుభవంతో చెప్పింది పుస్తకం అవుతుంది ..  పుస్తకంలో చెప్పింది విద్య కాదు. 

నీ ఆసక్తిని విడిచే కార్యక్రమం లో నిన్ను ప్రవేశ పెడతారు. గురు కార్యం ప్రథమంచ ... స్వకార్యం ద్వితీయంచ. 

అయ్యేదే చెపుతారు గురువు. ఈశ్వరారాధన వల్ల జ్ఞానాన్ని పొందాలి. 

ముల్లోకాలు.. మూడవస్థలు .. త్రిపుటిని దాటాలి. ఎక్కడికక్కడ ఆసక్తి అడ్డం అవుతుంది .. త్యజించాలి. 

తప్పక ఆసక్తి త్యజించాలి .. జ్ఞానాన్ని పొందగోరువారు. 

భోగం కోసం యాచించకూడదు. ...రాగ ద్వేషాలతో జీవించటం ..  హీనుడు.. దీనుడుచేసేపని .. విడువ దగినది .

గురువు గారికి ఇచ్చిన ఆతిధ్యం ... ప్రతి ఒక్క అన్నం మెతుక్కీ బాధ్యత వహిస్తాడు.. దివ్యమైన ప్ర్జని.. చైతన్యాన్ని వెదజల్లుతూనే ఉంటాడు ... బ్రహ్మనిష్ఠని మేల్కొలుపుతాడు. 

సంగ త్యాగం- ఫలత్యాగం -  మమకార  త్యాగం- అహంకారత్యాగం. ... ఎక్కడకు వచ్చారో చూస్తారు గురువు. 

నిష్కర్షగా చెప్పే గురువు లభించటం ఈశ్వరానుగ్రహము. గురువు చెప్పినట్లుగా జీవించటం శిష్యుడు పని. 

అష్తావక్రగీతను వింటున్న కైవ ల్యాశ్రమ సత్సంగ సభ్యులందరూ.. తప్పక అంతర్ముఖంలో .. సంగత్యాగం.. ఫలత్యాగం.. మమకార త్యాగం.. అహంకారత్యాగం చెయ్యాలి ... ఇవి కలిగిన వారికే ఆత్మజ్ఞానం. 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
అష్టావక్రగీత -15

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

:::::బాహ్య ముఖం vs అంతర్ముఖం:::::

 *బాహ్య ముఖం vs అంతర్ముఖం*
1)ఆకాశం ఖాళీ గా ప్రశాంతంగా వుంది.
మనస్సు ఏ ఆలోచన లేక నిశ్చలంగా వుంది.
2)ఆకాశం మీదకు నలువైపుల నుండి మేఘాలు వస్తున్నాయి.
మనస్సులోకి విషయాలు జననేంద్రియాల ద్వారా జొరబడు తున్నాయి.
3)ఆకాశంలో మేఘాలు నల్లగా తయారు అవుతున్నాయి.
మనస్సులోని విషయాల చుట్టూ రాగ ద్వేష మోహాలు ముసురు  తున్నాయి.
4)ఆకాశం ఏ క్షణంలో అయినా వర్షించడానికి తయారై వుంది.
మనస్సు ఏ క్షణంలో అయినా డిప్రెషన్ లో పడిపోనుంది.
5)ఆకాశం ఉన్నట్లుండి గాలులతో, మెరుపులతో, గర్జిస్తూ, వర్షిస్తుంది.
మనస్సు ఒక్కసారిగా ఆలోచనలతో, ఉద్వేగాలతో , అల్లకల్లోలంగా మారిపోయింది.

      ఆకాశాన్ని గమనించడం బాహ్య ముఖం అయితే.
మనస్సు ను గమనించడం అంతర్ముఖం.

*షణ్ముఖానంద 98666 99774*

ఏది శాశ్వతం..!!

 ఏది శాశ్వతం..!!

మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి. నేర్చుకుంటూ జీవించాలి. బతకడం జీవించడం కోసమే కాదు. జ్ఞాన సముపార్జన కోసం కూడా. జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం

. మనల్ని అతి వేగంగా ఆకర్షించేవి అజ్ఞానం, మోహం. ఆ రెండింటినీ తప్పించుకుని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది.
ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పట్నుంచో వెంటాడుతున్న మరణ భయం తొలగిపోతుంది. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది. ఈ రెండింటినీ పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు. అతడే జ్ఞాని. అతడే యోగి. శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పిన ఉత్తమమైన యోగి అతడే.

శాశ్వతంగా ఉండేది ఏదీ కళ్లకు కనిపించదు. అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది. ఈవేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నో. మరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది?

శాశ్వతంగా ఉండేది ఆత్మ. అది నీలోనే ఉంది. నువ్వు పుడతావు, మరణిస్తావు. కాని నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరూ చంపలేరు. 

ఇది తెలుసుకుని జీవించేవాడే తనకు ఆప్తుడని పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు.
దీన్ని ఎలా నమ్మాలి? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి. నమ్మకం కుదరలేదు. కాని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. ఏం చెయ్యాలి?

చూస్తేనే గాని నమ్మదు మనసు. ఆత్మను మామూలు కళ్లతో చూసే అవకాశం లేదు. అది జ్ఞానంతోనే చూడగలం. అటువంటి జ్ఞాననేత్రం కావాలి. అది అందరికీ ఉంటుంది. కాని, మూసుకుని ఉంటుంది. దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు.
ఈ భూమ్మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవడానికి. ఒకటి శాశ్వతమైనదాని గురించి, రెండోది అశాశ్వతమైనదాని గురించి. ఈ రెండూ తెలిస్తే సర్వమూ తెలిసినట్లే. శాశ్వతమైనది ఆత్మ. అశాశ్వతమైనది శరీరం. ఆత్మ కనిపించదు. శరీరం కనిపిస్తుంది. కనిపించనిది ఎప్పుడూ ఉండేది. కనిపించేది ఎప్పుడూ ఉండనిది. అదే గమ్మత్తు!

జీవించడానికి తిండి, నిద్ర, గాలితోపాటు శుద్ధ జ్ఞానం కూడా కావాలి. ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్యస్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే, ఇక రెండోది తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది. ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం. ఆత్మాన్వేషణే జీవితం. తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని తమ ఆత్మను తాము వెదుక్కోవడమే. ఇదే బతుకు!

శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి.
శరీరం నేను కాదు. ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను. అశాశ్వతమైన దానిలో శాశ్వతమైనవాడు ఉంటున్నాడు. వాడు సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి.

ఎవరైతే మానవసేవను మాధవసేవగా భావిస్తారో, వారు శరీరాన్ని పరులకోసం వినియోగిస్తారు. 

పరోపకారమే పరమార్థంగా భావిస్తారు. శాశ్వతమైన ఆత్మకోసం అశాశ్వతమైనదాన్ని తృణప్రాయంగా భావిస్తారు. అటువంటివారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు!

ఒక వేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు. ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 336 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఒక వేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు. ఆత్మ లేదని నిరూపించినా అంతే.  ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం. 🍀*

*మనిషి శతాబ్దాల నుండి అబద్దాలలో జీవిస్తున్నాడు. అందమైన అబద్ధాలు, కానీ అబద్ధాలే. మనం స్వర్గాన్నీ, నరకాన్నీ నమ్ముతూ పోతున్నాం. దేవుణ్ణి నమ్ముతూ పోతున్నాం. శాశ్వతత్వాన్ని, ఆత్మని నమ్ముతూ పోతున్నాం. ఇవన్నీ విశ్వాసాలు. విశ్వాసాలు అబద్ధాలు. నీ సొంతంగా ఏదీ తెలుసుకోకుండా ఆత్మ లోపల వుందో లేదో తెలుసుకోకుండా నమ్ముతున్నావు. ఒకవేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు.*

*ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఆస్తికులున్నారు. నాస్తికులున్నారు. వాళ్ళందరూ ఒకే రకమయిన జీవితం గడుపుతున్నారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళు. ఒకే రకంగా బతుకుతున్నారు. నీకు సన్నిహితమయినది నీ ఆత్మ. నువ్వు దానిని పరిశోధించలేదు. అట్లాంటప్పుడు ఎక్కడో వున్న స్వర్గ నరకాల గురించి ఆరాటమెందుకు? ప్రార్థనాలయాల్లో అంతా వీటి చర్చే. వాదనలే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

పెద్ద విజయానికి చిన్న - ముఖ్యమైన లింక్ ఆశ... -

 పెద్ద విజయానికి చిన్న - ముఖ్యమైన లింక్ ఆశ... -

నిరాశ మరియు అవిశ్వాసముల భావన విషములాంటిది. ఇది మనిషి జీవితంలో నిరాశని వ్యాపింపజేసి అతని శక్తులన్నింటినీ నష్టం చేస్తుంది. అయితే ఆశ, విశ్వాసముల భావన అమృతం లాంటిది, దాన్ని ఒక్క బొట్టు రుచి చూస్తే మనిషి వాని ఉచ్ఛమైన సంభావనలతో ఆనందమయ జీవనం వైపు నడుస్తారు. * మీ జీవనంలో కూడా నిరాశ అనే విషం వ్యాపిస్తోందా ?

* మీ ముందర అలాంటి పరిస్థితి వస్తోందా. కొద్దిపాటి ఆశా.. కిరణం కూడా దూర దూరం వరకు కనబడటం లేదా ? * మీ మనస్సులో ఎప్పుడైనా సమస్యల చిక్కులకి బదులు మీరు అన్ని

బాధల నుండి విముక్తి కలగాలనే ఆలోచన వచ్చిందా ? * మీరు కూడా నిరాశ అంధకారాన్ని తొలగించి ఉత్సాహం, శాంతి, ధైర్యం, సమృద్ధి మరియు విశ్వాసముల వెలుగులో ముందరకు వెళ్లాలనుకుంటున్నారా ? -

ఒక వేళ ఈ ప్రశ్నలకు మీ జవాబు 'అవును' అయితే కనుక ఈ చిన్ని పుస్తకము మీ మనస్సులో విశ్వాసముతోపాటు ఆశ..ని కూడా నిద్రలేపి జాగృతి పరిచే ఆశ.. ని పుట్టిస్తుంది. ఆశ.. సుఖవంతమైన జీవనానికి ఊహించలేని లింకు,

అది చిన్నదైనా గాని, జీవనానికి ముఖ్య ఆధారము మీ సంతోషమైన జీవితం కోసం ఆశా... భరిత శుభాకాంక్షలు.

సంతోషం

🧘‍♂️ *సంతోషం* 🧘‍♀️

*సంతోషంగా ఉండాలన్న దృఢమైన నిశ్చయం మీకు సాయపడుతుంది. ఇబ్బంది అంతా మీ పరిస్థితులలోనే ఉందన్న తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అవి మారడం కోసం నిరీక్షిస్తూ ఉండకండి.*

      *విచారాన్ని చిరకాలపు అలవాటుగా చేసుకోకండి; దానివల్ల మీరు, మీ తోటి వాళ్ళు బాధపడవలసి వచ్చేలా చేయకండి. మీరు సంతోషంగా ఉంటే అది మీకు, ఇతరులకు కూడా మేలు.* 

      *మీకు సంతోషం ఉంటే అన్ని ఉంటాయి; సంతోషంగా ఉండడమంటే ఈశ్వరుడితో ఏకీభావంతో ఉండడం. సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తి ధ్యానం ద్వారా లభిస్తుంది.*

*శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం*

:::::: స్పందన (Response) :::::::

 *:::::::::  స్పందన (Response) :::::::*

     మనకు ఎదురైన ప్రశ్నలకి , సమస్యలకి, సవాళ్ళకి, ప్రేరణలకు జవాబు ఇస్తాము. ఈ జవాబే స్పందన అంటే.
దీని గురించి.‌‌..
              1) స్పందన మనకు కర్తవ్యాన్ని, బాధ్యతని, గుర్తు చేస్తుంది.
             2) స్పందనకు కావాల్సింది స్పష్టత, సునిశితత్వం, ఖచ్చితత్వం.
               3) స్పందన యాంత్రికంగా, పాక్షికంగా, కట్టుబాట్లు నుండి,ఊహాల నుండి,గతం నుండి  వుండ రాదు.
           4) మంచి మానసిక స్థితి, సరైన స్పందనకు దారి తీస్తుంది.
         5) ఆలోచనలు కూడా స్పందనలే.
          6) స్పందించక పోతే ప్రమాదం, నష్టం , జరిగ వచ్చు. కనుక అవసరం.
              7) స్పందన ఎప్పటికప్పుడు నూతనంగా, సృజనాత్మకంగా, తగినట్లుగా వుండాలి.
       8) మనం ప్రవర్తన అంతా వివిధ స్పందనల కలగలుపు 
       9)ధ్యాని సరిగ్గా స్పందిస్తాడు

*షణ్ముఖానంద 9866699774*

ఆధ్యాత్మిక సాధనకు ప్రాథమిక సూత్రాలు

 *ఆధ్యాత్మిక సాధనకు ప్రాథమిక సూత్రాలు*

ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు...!!_
ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి...
నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి, విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి.
ఈ సూత్రాలు పాటించకుండా ఎవరు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు...
మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది...
వంద వ్యాపకాలలో దైవస్మరణ ఒకటైతే దైవ దర్శనం సులభ సాధ్యం కాదు...
ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది.
నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు.
కానీ సంతోషాన్ని కావాలను కోవటం, దుఃఖాన్ని వద్దను కోవటం చేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి...🙏

ప్రతి పనిలోనూ త్రికరణ శుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది.
అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి...
అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది.
ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చేయ్యాలి... 🙏

క్షణం విత్తం క్షణం చిత్తం* *క్షణం జీవితమావయోః* *యమస్య కరుణా నాస్తి* *తస్మాత్ జాగ్రత జాగ్రత*

 🌹*క్షణం విత్తం క్షణం చిత్తం*
*క్షణం జీవితమావయోః*
*యమస్య కరుణా నాస్తి*
*తస్మాత్ జాగ్రత జాగ్రత*🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

💕~క్షణం భాగ్యం, క్షణం భోగం. జీవితమే క్షణ భంగురం.యమునికి దయ లేదు. కనుక జాగరూకతతో వ్యవహరించు.
🌺జీవితం క్షణ భంగురం, అందులో భోగం క్షణమే, భాగ్యమూ క్షణమే! యముడు కరుణ లేనివాడు, అయ్యో వీడు ధర్మాత్ముడు కొద్ది కాలం ఉండనిద్దాం, వీడు దుర్మార్గుడు వీణ్ణి తొందరగా తీసుకుపోదామనుకోడు. సమయం వచ్చిన వెంఠనే ఎవరైనా సరే ఏ అవస్థలో ఉన్నా సరే పాశం తగిలించి జీవిని తీసుకుపోవడమే ఆయన కర్తవ్యం. అందుకే ఆయనకు సమవర్తి అని పేరు. అటువంటి యముడు ఎప్పుడు వస్తాడో తెలియదు. తస్మాత్ జాగ్రత్త.
💕జీవితంలో జరిగేవాటిని, జరగుతున్నవాటిని వాటిని గురించిన హెచ్చరిక ఇది. 
🌺మొత్తంగా చూస్తే జీవితం క్షణభంగురం, నీ తరవాతేమీ లేదు, నీతోనే అన్నీ ఉన్నాయి, గుర్తించు.
💕నరులనుకూడా జంతువులన్నారు కదా !
‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అని. జీవులన్నీ జంతువులే!అందులో నరజన్మ దొరకడమే గొప్ప! 
ఈ శ్లోకాలలో క్షణభంగురమైన జీవితకాలంలో జరిగేవాటి గురించిన పరివేదన గురించి చెప్పేరు.
❤️ *యావత్కాలం భవేత్కర్మ
తావత్తిష్టంతి జంతవః
తస్మిన్ఖ్షణే వినస్యంతి
తత్ర కా పరివేదనా*
💕~ఈ ఉపాధిలో (ఈ శరీరంతో) కర్మపరిపాకం ఎంతకాలముందో అంతకాలమే మానవులు జీవిస్తారు. కర్మ పూర్తైన మరుక్షణం మరణిస్తారు. ఇది సర్వ సహజం, దాని గురించిన పరివేదన వద్దు.
🌺 “ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా!” ఇది గంజాయి దమ్ము కొట్టిన బైరాగి పాట కాదు, సత్యం. 💕మానవులు మూడు కర్మలతో ఉంటారు. 
🌺సంచితం,ప్రారబ్ధం,ఆగామి. 
💕ఒకటి పుట్టుకతో కూడా తెచ్చుకున్న మూట. 
💕రెండవది ఈ జన్మలో పోగిచేసుకున్న మూట. 
💕మూడవది జీవితాంతానికి ఉండిపోయిన నిలవ, మరుజన్మకి తోడొచ్చేది. 
❤️జన్మ రాహిత్యం కావాలంటే మూట ఉండకూడదు. దాన్ని సాధించడం అంత తేలిక కాదు! 
💕పుణ్యమో పాపమో ఎంతో కొంత సంచిమొదలు తప్పదు. సంచి దులిపేస్తే, అది సాధిస్తే పరమ పదమే! జన్మ రాహిత్యమే! ఈ ఉపాధిలో అంటే ఈ శరీరంతో చేయవలసిన పని పూర్తైన వెంటనే, ఈ శరీరం నశిస్తుంది, దానికి చింతిల్లనవసరమే లేదు.
❤️ *ఋణానుబంధ రూపేణా
పశు పత్ని సుతాదయః
ఋణ క్షయే క్షయంయాంతి
తత్రకా పరివేదనా.*
🌺~ఎంత ఋణానుబంధం ఉన్నదో అంతకాలమే పశువుగాని,పత్నిగాని,
సుతులు మొదలైనవారు మనతో ఉంటారు. మనతో ఋణానుబంధం పూర్తికాగానే వెళిపోతారు. 
ఈ సహజప్రక్రియను అర్థంచేసుకోకుండా చింతించడం ఎందుకు?
💕~పశువులు,పత్ని,సుతులు మొదలైనవారంతా ఋణానుబంధం ఉన్నంత కాలమే మనతో ఉంటారు. మనకి వారుగాని, వారికి మనంగాని ఉన్న ఋణం తీరిన తరవాత వారి దారిన వారు చెల్లిపోతారు. ఇది ఎంతకాలమో తెలియదు. 
💓ఎవరు ఎవరికి బాకీ తెలియదు. మన సంతానమంతా, మనకి బాకీదార్లు. అందుకే పెద్దలు పిల్లల చేతినుంచి డబ్బు తీసుకోడానికి ఒప్పుకోరు. పక్కన ఉంచమంటారు. ఈ బాకీలు ఏ రకమైనా కావచ్చు. 
💝కొంతమంది మంచిమాట చెప్పి కూడా తిట్లు తింటుంటారు. ఇలా మంచిమాట చెప్పేవారంతా బాకీదార్లు. వారు అలా మంచిమాటలు చెప్పి హెచ్చరిక చేయక మానలేరు. 
💕కాలంతో బాకీ తీరిపోతుంది, ఆ తరవాత ఇలా మంచిమాట చెప్పేవారు కూడా జీవితంలో దొరకరు. ఆతర్వాత చింతించీ లాభంలేదు🕉️🚩🕉️