Monday, April 21, 2025

 3. భారతీయ వైజ్ఞానిక రంగంలో మహిళలు.


ఫిబ్రవరి 28ని భారతదేశ ప్రజలందరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన రోజు. 1930లో భారతీయ శాస్త్రవేత్త సి.వి. రామన్, నోబెల్ బహుమతిని సాధించింది. 

ఈ రోజునే ఆ సందర్భాన్ని స్మరించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం దేశంలో ఫిబ్రవరి 28ని జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)గా జరుపుకుంటున్నాం. 

అలాగే ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక అంశాన్ని (థీమ్ని) ఎంచుకుంటున్నాం. 2020 సంవత్సరానికి "వైజ్ఞానిక రంగంలో మహిళలు (ఉమెన్ ఇన్ సైన్స్)" అనేది ముఖ్యాంశంగా ఎన్నుకున్నాం.

కొంతమంది జీవితాలు తెరచిన పుస్తకాలు. ఆ పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా కొన్ని కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. పుస్తకం తెరచి ఉన్నా, చూడాల్సిన కోణంలోంచి చూసి, అవగాహన చేసుకోవాల్సిన అంశాలు అవగాహన చేసుకోవడం కొందరికే చేతనవుతుంది. 

భారతదేశానికే కాదు, అసలు ఆసియా ఖండానికే మొట్టమొదటిసారి వైజ్ఞానిక రంగంలో నోబెల్ బహుమతి సాధించి పెట్టిన మహామేధావి సర్ సి.వి. (చంద్రశేఖర్ వెంకట రామన్) జీవితమూ అలాంటిదే! భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీతగా చాలామందికి తెలుసు. కానీ, ఒక మహోన్నతమైన వ్యక్తిగా,
జాతీయవాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్దిమందికే తెలుసు, 

నేటి యువతీ యువకులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు స్వలాభం కోసం దేశాన్ని అమ్మడానికైనా సిద్ధపడే కుట్రదారులు, పైరవీకారులు ఆయన జీవితంలోంచి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆచరించాల్సి ఉంది.

వైజ్ఞానిక పరిశోధనా రంగంలో రాజకీయాల జోక్యం ఏమాత్రం సహించని సి.వి. రామన్ బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ పదవి. - తనకు తానై వదులుకున్నారు. హాలెండ్ లోని ఒక ప్రముఖ పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా రమ్మని ఆహ్వానం వస్తే, మర్యాదగా తిరస్కరించారు. ఎందుకంటే జీవితాంతం తన సేవలు మాతృభూమికే అర్పించాలని దృఢంగా నిర్ణయించుకున్నారు గనక. 

అలాంటి అతి సున్నితమైన మరో కారణం వల్లనే లండన్ రాయల్ సొసైటీ ఫెలోషిప్కు రాజీనామా చేశారు. వీటన్నిటికంటే ఎంతో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారత ఉప రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే, ఆయన ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. బాధ్యతాయుతమైన ఒక శాస్త్రవేత్తగానే ఆయన ఉండదలిచారు. 

రాజకీయాలు - పరిపాలనా వ్యవహారాల మధ్య - తనలోని శాస్త్రవేత్తను ఆయన అణగదొక్కదలుచుకోలేదు. సైన్సు పట్ల, దేశం పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను బేరీజు వేయడం కష్టం! ఏ కొద్దిపాటి ఆసరా దొరికినా, విదేశాలకు పరుగులు తీసేవారూ, ఏ చిన్నపాటి ఉన్నత పదవి లభించేట్లు ఉన్నా - నైతికంగా పతనమై పదవుల కోసం పాకులాడే వాళ్ళూ ఉన్న నేటి సమాజంలో సర్ సి.వి. రామన్ నెలకొల్పిన జీవిత విలువలు, ఉన్నత ఆదర్శాలు అర్థం చేసుకోగలిగేవారు ఎంత మంది?

సి. వి. రామన్ 1927లో 'రామన్ ఎఫెక్ట్ 'ను ప్రపంచానికి ప్రకటించాడు. మూడేండ్లు రామన్ ఎఫెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు, చర్చలూ జరిగాయి. 1930లో నోబెల్ బహుమతులు ప్రకటించడానికి ముందే ఆయన స్టాక్ హోమ్ వెళ్ళి రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. బహుమతి ప్రకటించకముందే వెళ్ళి రావడానికి ఏర్పాట్లు చేసుకోవడం పిచ్చి పనిగానే తోస్తుంది. కానీ, ఆయన ఆత్మవిశ్వాసం అంత బలమైంది.

 తెల్లవాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట, ఒక భారతీయుడికి అందునా దక్షిణ భారతీయుడికి అంటే ఒక నల్లవాడికి నోబెల్ పురస్కారం వంటి ఒక అపూర్వ గౌరవం లభించడం జరిగేపని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని అంత బలంగా నమ్ముకుని ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

రామన్ విషయాలు అలా ఉంచి, "ఉమెన్ ఇన్ సైన్స్" అనే అంశంపై దృష్టి సారిద్దాం. అన్ని రంగాలలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. సమాజ స్వరూపాన్ని కొద్ది కొద్దిగా మార్చేస్తున్నారు. 

అయితే ఇప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలలో వారి పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. మన దైనందిన జీవితానికీ, శాస్త్ర సాంకేతిక రంగాలకూ, విడదీయరాని బంధం ఏర్పడి ఉంది. అందువల్ల సమాజ పురోగతికీ, దేశాభ్యున్నతికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాలలో సహజంగా మహిళలు ఇంకా ఎక్కువగా పాల్గొనాల్సి ఉంది. అన్నిటినీ అధిగమించి, ఏండ్ల కేండ్లు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో నిలదొక్కుకుని ఉండగలగడం స్త్రీలకు కష్టసాధ్యమే తప్ప, సామాన్యంగా, సహజంగా జరిగే పనికాదు. సైన్స్ లో పట్టభద్రులైన మహిళలు చాలావరకు జూనియర్. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులవుతున్నారు తప్పితే, శాస్త్రవేత్తలు కావడం తక్కువ.

గతంలో తల్లిదండ్రులు తమ కూతుళ్ళకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి విషయాలలో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీలు ఆడపిల్లలకు ఎందుకులే అనే భావం ఉండేది. క్రమంగా మార్పు వచ్చింది. మెడిసిన్, ఇంజనీరింగ్, కంప్యూటర్స్ లో అమ్మాయిల్ని చేర్పించసాగారు. ఫలితంగా ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు. వైజ్ఞానిక, పరిశోధనాశాలల్లో కర్మాగారాలలో స్త్రీలు పనిచేయడం లేదని కాదు. వర్కర్లుగా, రిసెప్షనిస్టులుగా, టెలిఫోన్ ఆపరేటర్లుగా, క్లర్కులుగా, టైపిస్టులుగా ఎంతోమంది పనిచేస్తున్నారు. నిజమే కానీ, శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా చాలా కొద్దిమంది మాత్రమే ఎదగ గల్గుతున్నారు.

 బాధ్యతాయుతమైన డైరెక్టర్, సెంటర్ ఇన్ఛార్జి వంటి ఉన్నత పదవులలో కొద్ది మంది మహిళలు మాత్రమే ఉంటున్నారు. అదీగాక, స్వాతంత్య్రానంతరం భారతీయ వైజ్ఞానిక పరిశోధనలు పరిశీలిస్తే, అందులో మహిళా శాస్త్రవేత్తల కృషి పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీలేదు. ఒక జగదీశ్ చంద్రబోస్, ఒక సి. వి. రామన్ వంటి మహిళా శాస్త్రవేత్తలింకా తయారుకాలేదు. శ్రీనివాస రామానుజన్, మహేంద్రలాల్ సర్కార్, బోస్, సాహా, భట్నాగర్, సలీం అలీ, హోమీజె. బాబా, రాజా రామన్న వంటి శాస్త్రవేత్తల స్థాయికి ఎదిగిన మహిళా శాస్త్రవేత్తలు కూడా మనకు లేరు. అయితే తప్పు వారిది కాదు, పురుషాధిక్య ప్రపంచానిది. అగ్రవర్ణాల వారు శూద్రుల్ని విద్యకు దూరం చేసిన విధంగానే, పురుష ప్రపంచం చాలా కాలం స్త్రీలను విద్యకు దూరం చేసింది.

పూర్వకాలంలో కూడా నృత్యాంగనలు, గాయనీమణులు, కవయిత్రులు ఉండేవారు తప్పిస్తే, ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి వారి స్థాయి గల మహిళా శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. ఆనాటి పురుష ప్రపంచం తమ ఆనంద విలాసాల కోసం స్త్రీలను ఆమేరకే ప్రోత్సహించింది. అనుమతించింది. 

పరిపాలన, రక్షణ, ఆర్ధికరంగాలలో వారిని భాగస్వాములుగా చేయలేదు. అందుకే రాజుల ఆస్థానాలలో స్త్రీలు మంత్రులుగా, సలహాదారులుగా, కోశాధికారులుగా, సైన్యాధిపతులుగా లేరు. ఇటీవల కాలం వరకూ అలాగే కొనసాగింది. 

అచిర కాలంలో స్త్రీలు పేరు, డబ్బు సంపాదించుకోవాలంటే వారు సినిమా, టీవీ కళాకారులుగానో, యాంకర్లుగానో, మోడల్స్ గానో, లేక అందాల పోటీల్లో పోటీదారులవుతున్నారు తప్పితే, మహోన్నత వ్యక్తులుగా, మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా, ఇంజనీర్లుగా నిలబడుతున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే. అందుకు వ్యవస్థలోని లోపాలు, వివక్ష వంటివి ముఖ్య కారణాలు.

ఘనవిజయాలు సాధించిన పురుషుల జీవితాలలో స్త్రీలు ఉన్నట్టుగానే, స్త్రీల జీవితాలలో కూడా పురుషులు ఉంటారు. ఉండాలి కూడా! ఉదాహరణకు మనం కొందరిని గుర్తుచేసుకోవచ్చు. వైద్య శాస్త్రంలో తొలి అమెరికన్ డిగ్రీ సాధించిన ఆనందీబాయి జోషి భర్త గోపాలరావు జోషి ఒక మామూలు గుమస్తా. పధ్నాలుగేండ్లకే తల్లయి కొడుకును పోగొట్టుకున్న ఆమె, ఎలాగయినా తను వైద్య శాస్త్రం చదవాలనుకుంది. భర్త సహకరించి తోడ్పడి అమెరికా పంపించాడు. 1886లో ఎం.డి. పట్టా స్వీకరించిన ఆనందీబాయి తిరిగి వచ్చి స్వదేశానికి ఉపయోగపడలేక పోయింది. డిగ్రీ తీసుకున్న సంవత్సరానికే ఆమె క్షయ వల్ల మరణించింది. అయితే ఆమె చూపిన చొరవ ఎంతోమంది భారతీయ మహిళలకు స్ఫూర్తినిచ్చింది. 

వృక్షశాస్త్రంలో మిషిగన్ అమెరికాలో పరిశోధనలు చేసిన జానకీ అమ్మాళ్ - జమ్మూలోని రీజనల్ రీసెర్చ్ లేబొరేటరీలో మూడున్నర వేల వృక్షజాతుల జన్యువుల మీద పరిశోధనలు చేశారు. బ్రిటిష్ ఇండియాలో సైన్స్లో తొలి డాక్టరేట్ సాధించిన అసీమా ఛటర్జీ, అమెరికా వెళ్ళి విస్కాన్సిన్, కాలిఫోర్నియాలలో పరిశోధనలు చేసి వచ్చారు. దేశంలో మలేరియా, కేన్సర్ల నివారణకు ఆమె పరిశోధనల ఫలితంగానే మందులు తయారయ్యాయి. 

నీరా (తాటికల్లు) లోని పోషక విలువలపై పరిశోధనలు చేసి, రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన ధీరవనిత కమలా సోహానీ. ఈమె ప్రతిభను గుర్తించి కేంబ్రిడ్జి యూనివర్సిటీవారు ఆహ్వానించారు. అప్పుడక్కడ గింజధాన్యాలలోని పోషక విలువలపై ఆమె పరిశోధనలు చేశారు. దేశంలోనే తొలి వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి.

బాల్యంలో ఆమె తండ్రి ఆమెకు వజ్రాల చెవిరింగులు కొనిపెడతానంటే.. తనకు అవి అవసరం లేదనీ, తనకు 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా' కొనిపెట్టమని మారాం చేసింది. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన అన్నామణి ప్రపంచ వాతావరణ సంస్థకు (డబ్ల్యూఎంఓ)కు కన్సల్టెంట్గా కూడా ఉన్నారు. 

ఇలా వేళ్ళమీద లెక్కబెట్టగలిగే మహిళా శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది మన దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం మన గర్వకారణం. అంతకంటే ప్రపంచంలోనే తొలి అనస్తీషియా నిపుణురాలు మన హైదరాబాదు. నగరానికి చెందిన రూపాబాయి ఫర్దూన్జీ. హైదరాబాదులోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టి హైదరాబాదు మెడికల్ కాలేజి నుంచి హకీం (డాక్టరు) పట్టా తీసుకుని, ఎన్నో విదేశీ సంస్థలలో పరిశోధనలు చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చి, ఏండ్లకేండ్లు శస్త్ర చికిత్సలలో తన సహకారం అందించారు. 1929లో చాదర్ ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పదవీ విమరణ చేశారు.

 ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇటీవలి కాలంలో "మిస్సైల్ ఉమెన్"గా ప్రసిద్ధి చెందిన టెస్సీ థామస్ అగ్ని క్షిపణి ప్రాజెక్ట్కు నేతృత్వం వహించడం మరో ఎత్తు! అంటార్కిటికాను చుట్టి వచ్చిన తొలి భారతీయురాలు అదితి పంతో సహా అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు దేశ పురోగతిలో భాగస్వాములవుతున్నారు. అవకాశం వస్తే తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని మహిళలు తేల్చి చెపుతున్నారు. అయితే, మారిన పరిస్థితుల్లో వైజ్ఞానిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఇంకా గణనీయంగా పెరగాల్సి ఉంది.

_____________________________________




4. సూడో సైన్స్ ప్రచారకులున్నారు.. జాగ్రత్త!!





“నేను ప్రతిదీ లెక్కగట్టగలను. కాంతి వెలాసిటీని కూడా లెక్కగట్టగలను. కానీ, మనిషి నవ్వు వెనక దాగిన ఈర్ష్య, అసూయ, కుట్ర-కుతంత్రాల్ని లెక్కగట్టలేను.”

- ఆల్బర్ట్ ఐన్ స్టీన్.

No comments:

Post a Comment