తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే ! పిల్లలు పుట్టకపోయినా , జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు.
ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే ... కుమార షష్టి రోజే !
శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట.
అంతే ! మన్మధుడి మీద
శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు.
అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు.
ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది.కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమారషష్టి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు.
అందుకే ఆయనకు షష్టి తిథి* అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం. కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కందపంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది.
వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే !
స్కందపంచమి , కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట.
సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా , రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి , షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలి.
ఓం శం శరవణభవ
No comments:
Post a Comment