*జ్ఞాన🕉️మార్గ* *శ్రద్ధ లేకుండా కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు*
వేరువేరు కర్మలు వేరు వేరు ఫలాలనిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో పలువురు తాము ఆచరించిన కర్మలకు తామనుకున్నట్లు కలగకపోవడంతో శాస్త్రాల ప్రామాణికతను సందేహిస్తున్నారు.
గీతలో కృష్ణభగవానుడిలా అన్నాడు:
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్!
అసదిత్యుచ్యతే పార్థ నచ త్ప్రేత్య నో ఇహ!!
శ్రద్ధలేని కర్మ కోరిన ఫలితాన్నివ్వదు. అందువలన మీరు చేసిన ఏ కర్మైనా కోరిన ఫలమివ్వలేదంటే ఆ కర్మను మీరు శ్రద్ధతో చేయలేదని అర్థం.
శ్రద్ధ లేకుండా కర్మనాచరించినందువలన ఫలం దక్కలేదు కాబట్టి శాస్త్రాలను నిందించరాదు. సర్వకాలాలలోను సందేహాతీతమైన ప్రామాణ్యం కలవి శాస్త్రాలు.
అందువలన శ్రద్ధతో కర్మలనాచరించాలనేది చాలా ముఖ్యం.
అయితే శ్రద్ధ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆదిశంకరులు ఇలా సమాధానమిచ్చారు.
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యాsవధారణా!సాశ్రద్ధా కథితా సద్భిః!! అని
శాస్త్రాలలో గురువాక్యంలో అచంచలమైన నమ్మకమే శ్రద్ధ అని. ఇటువంటి దృఢమైన నమ్మకముంటే సత్ఫలితాలు తప్పక లభిస్తాయి. పురాణాలలో దక్షప్రజాపతి ఈశ్వరద్వేషంతో యజ్ఞంచేయ తలపెట్టాడు. యజ్ఞం సత్ఫలితాలనివ్వకపోగా, అది ఘోరమైన విధ్వంసంతో ముగిసింది.గురువుగారి ఉపదేశాన్ని శ్రద్ధతో గ్రహించేవానికే జ్ఞానం లభిస్తుంది. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” – అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అందువలన మనిషి జీవితంలో శ్రద్ధ చాలా అవసరం.
అందరూ శ్రద్ధతో కర్మల నాచరించి శ్రేయస్సును పొందుదురుగాక.
No comments:
Post a Comment