*సహనమే ధీరుడిని అజేయుణ్ణిచేస్తుంది*
*మార్గదర్శి 2వ రోజు...*
*శరీరానికి పంచభూతాల్లో ఏదో ఒకదానివల్ల, ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం రావచ్చు. అవి మనసును కలత చెందిస్తాయి. కలవర పరుస్తాయి.*
*అతి సుఖం వల్ల, అతి దుఃఖం వల్ల కర్తవ్యాన్ని మర్చిపోతుంటాం. కర్తవ్యాన్ని మరచిపోవడం అన్ని అనర్థాలకి మూలం. అలాంటి అనర్థం రాకూడదంటే మన బాధ్యతను మరువకూడదు. సుఖదుఃఖాలే బాధ్యతను మరపించేవైతే, సుఖదుఃఖాలు హద్దుమీరకుండ ఉండాలి. సుఖదుఃఖాలకి కారణం భూత, భౌతిక స్పర్శలు. 'భూత స్పర్శ'లంటే పంచభూతాల వల్ల కలిగే ఎండ, వాన, చలి, వేడి, చల్లన, మృదు, కఠిన స్పర్శలు మొదలగునవి. బంధువులు, మిత్రులు, శత్రువులు ఇతర ప్రాణులవల్ల కలిగేవి "భౌతిక స్పర్శ లంటారు. ఇవి అనుకూలంగా ఉంటే ఇష్టమౌతుంది. ప్రతికూలంగా ఉంటే కష్టమనిపిస్తుంది. అవైనా 'నేను సాధించాను' అనుకుంటే అత్యానందం.*
*ఎవరో పోగొట్టారనుకుంటే పట్టరాని శోకం, కోపం కలుగుతాయి. ఈ భూతభౌతికాల సంబంధాన్నే 'మాత్రాస్పర్శ' లంటారు. ఈ మాత్రాస్పర్శలు పంచభూతాలవల్ల కలిగినా, భౌతికాల వల్ల కలిగినా మనకి ఏదో ఒకరకమైన వేదనను కల్గిస్తాయి. ఆ వేదనవల్లే కర్తవ్య విముఖులము అవుతుంటాం. ఈ స్పర్శలు మనం కోరితే వచ్చినవి కావు. పొమ్మంటే పోయేవి కావు. ఎండ, వాన, గాలి వచ్చినట్టే వాటి వాటి సమయంలో అవి వస్తాయి. ఎండ, గాలి, వానలను చూచి, అవి పెరిగాయనో, తరిగాయనో మన పనులు మానుకోవటం లేదు. అలా అని వాటిని దూషించడం లేదు. వాటిని సహిస్తున్నాం. అలానే మాత్రాస్పర్శలను సహించమంటుంది భగవద్వాణి. ఇలాంటి సహనాన్ని అభ్యసించినవాడు ధీరుడగును తన కర్తవ్యాన్ని మానడు. సుఖమైనా, కష్టమైనా కర్తవ్యపాలనను చేసేవాడు అమృతత్వాన్ని పొందుతాడు. అంటే. పాపాలన్ని నశిస్తాయి. అహంకార బంధం తొలగును. దుఃఖమే అంటని నిత్యానందస్థితిని పొందును.*
*ధీరుడంటే బుద్ధిమంతుడు అని అర్థం. ఎలాంటి బుద్ధి ఉంటే ధీరుడంటారు? సుఖదుఃఖాలను సమానంగ సహించే బుద్ధినభ్యసించాలి ఎలా? లభించినదేదో పొందడం బాధ్యత. అలాకాక “ఇది నాకిష్టం”. "ఇదే సుఖాన్నిస్తుంది'. అని ఆసక్తితో పొందామనుకోండి. అది పోయిననాడు “ నా సుఖం పోయిందే” అని దుఃఖం వస్తుంది. మొదటే ఆసక్తి లేకుండా ఎండనో, మందునో ‘ఇదీ నా మంచికోసం. కష్టమే కాని తప్పదు' అనుకొని పొందితే ఆ వస్తువు దూరమైనా, దరిచేరినా మనస్సు ఏడవదు. అలా అనుకోవడాన్నే 'సమదృష్టి' అంటారు. ఇది కలగడం చాల కష్టం కానీ, కలిగితే వాడు చాల గొప్పవాడే. చూడండి! ధుఃఖాన్ని సుఖంలాగ, సుఖాన్ని దుఃఖంలాగ మనం భావించగలమా? ఇల్లు వదలి అడవికి పోవడం దుః ఖం. రాముడికి అది ఎదురైంది. వెళ్ళక తప్పదు. అది కష్టం అనుకుంటే ఏడుస్తూ వెళ్ళవలసి వస్తుంది. ఎలాగూ వెళ్ళడం తప్పనిసరి అయితే, ఏడుస్తూ వెళ్ళడమెందుకు సంతోషంగా వెళ్ళాలి. అంటే, వనయాత్ర దుః ఖకరమనుకో కూడదు. అది 'విహారయాత్ర'గ భావించాలి. అదే చేసాడు రాముడు. తన సవతి తల్లి కైకమ్మతో, “నామీద ప్రేమ నీకెక్కువ కనుక, కఠినమైన రాజ్యపాలన చిన్నవాడైన భరతునిపై పెట్టి, హాయిగా వనవిహారం చేసే బాధ్యత నాకప్పచెప్పావమ్మా! నాపై నీకుండే ప్రేమ అపారమని తెలిసింది" అన్నాడు. దీనివల్ల కైకమ్మమీద తనకీ కోపంరాలేదు. అంగీకరించి అడవికి పోయాడు కనుక కైకకీ కోపం రాలేదు. తండ్రిమాట పాలించిన పేరూ వచ్చె. ఋషుల సేవా దక్కె రాక్షసవధ జరిగింది. ఎన్నో మంచి పనులు జరిగాయి. మనకీ ఆదర్శమయ్యాడు. మంచి మనిషిగ అందరి ఆరాధననూ అందుకుంటున్నాడు. ఆ వనయాత్రను లక్ష్మణుడనుకున్నట్లు 'ఇది కష్టం' అని శ్రీరాముడు కూడా అనుకొని ఉంటే ఇదంతా వ్యతిరేకమై ఉండేది. (కుంతిగూడ మరో దృష్టానం)*
*అలానే సుఖాన్ని గూడ దుఃఖంలా భావించగలగాలి. దుఃఖాలుపోతే, ఏడవము. సంతోషిస్తాం. సామాన్యంగ సుఖం పోగానే ఏడుపొస్తుంది. కానీ, అదీ దుఃఖంలా భావిస్తే దానిమీద ఆసక్తి పెంచుకోం, తగ్గించుకుంటాం. అప్పుడు కాలవశం చేతో, కర్మ ప్రభావం చేత సుఖకరమైనవి పోయినా, అతి దుఃఖం పొందము. దీనికీ శ్రీరాముడే ఉదాహరణ.*
*ముందురోజు సభలో 'రాజ్యమిస్తున్నాం' అని తండ్రి ప్రకటిస్తే దానిమీద అత్యాసక్తితో ఎగిరి గంతేయలేదు. కనుకనే, మరునాడు ఆయనమాటమీదే 'నీకు రాజ్యంకాదు వనవాసమే గతి' అన్నా పై భావన ఉండటంవల్ల శోకంతో క్రుంగిపోలేదు. అలాంటివాడే 'ధీరుడు". మంచి బుద్ధిమంతుడు. అంటే, బయటి శరీరానికి కలిగేవేవీ మనస్సుని మార్పుచేయవన్న మాట. సుఖాలొస్తే “మా కష్టార్జితమిది" అంటూ ఆనందరాగాలాలపిస్తారు. పంటలు, సంపదలు, పదవులు పోయి నష్టం వస్తే మాత్రం 'దేమునికి దయలేదు. ఓర్వలేకపోయాడే సుఖాన్ని' అంటూ విషాదగీతికలు కక్కుతారు. రెండూ వాడిచ్చేవే అనుకుంటే ఏ బాధా ఉండదు. వేసవిలో మధ్యాహ్నం కరెంటుపోయి 'ఫ్యాను ఆగితే ఏడవము. సహిస్తాం. మార్గాంతరం వెతుకుతాం. ఏడవకపోవడమే మొదటి మెట్టు. ఆపై సహించడం రెండవమెట్టు. బుద్ధి కలిగి కర్తవ్యపాలన చేస్తూ ముందుకు సాగడం చివరిమెట్టు. అదిగుర్తించినవాడే ధీరుడు. వాడే సమదృష్టికలవాడు. వానికే అమృతత్వం సిద్ధిస్తుంది. ఇది భగవదాదేశం.*
*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌻🌼 🙏🕉️🙏 🌼🌻🌼
No comments:
Post a Comment