Saturday, September 12, 2020

దైవదర్శనానికి మార్గం

దైవదర్శనానికి మార్గం

చెడును పట్టుకోవడం సులభం. వదలడం కష్టం. మంచిని పట్టుకొని చిరకాలం ఉండడం కష్టం. వదలడం సులువు.

అందుకే ఎవరైనా, దేనిని పట్టుకోవాలి.. దేనిని వదలాలి అనే విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.

సంసారం, కుటుంబం వంటి లంపటాలు తమను బంధిస్తున్నాయని ఆ బాదరబందీ వల్లనే భక్తి మార్గం పట్టలేకున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు.

కానీ, అది నిజం కాదు. అవి మనల్ని పట్టుకోవడం కాదు.. మనమే సంసారాన్ని, కుటుంబాన్ని, లోకాన్ని, సకల ప్రాపంచిక విషయాలనూ గట్టిగా పట్టుకొని కూర్చుంటున్నాం.

ఉదాహరణకు ఒక కథ.

కోతులను పట్టుకునేవాళ్లు.. ఇరుకు మెడ ఉండే బరువైన కూజాలో వేరుశనగ పప్పులను వేసి చెట్టుకింద పెడతారు.

అటువైపు వచ్చిన కోతి.. ఆ కూజాలోకి చేతిని పోనిచ్చి గుప్పెట నిండా గింజలను పట్టుకొని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది.

మూతి ఇరుగ్గా ఉండడంతో.. పిడికిలి బయటకు రాదు. చేతిలో ఉన్న వేరుశనగ పప్పులను వదిలేస్తే చెయ్యి సులభంగానే బయటకొచ్చేస్తుంది.

కానీ, ఆశ.. ఆ గింజలను వదలనీయదు. కూజాతో సహా అక్కడి నుంచి పారిపోదామా అంటే.. అది బరువుగా ఉంటుంది.

దీంతో, కోతి అక్కడే ఉంటుంది.
కోతులు పట్టేవారు అక్కడికి వచ్చి దాన్ని బంధిస్తారు.

పట్టు విడవడం తెలియక కోతి బందీ అయినట్లుగా.. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని క్రమేణా విడిచిపెట్టడం తెలియక ఆధ్యాత్మిక చింతనాసక్తులు దారితప్పుతుంటారు.

పట్టుకోకూడనిదాన్ని తెలివితక్కువగా పట్టుకోవడం.. తీరా పట్టుకున్నాక దానివల్ల కలిగే ముప్పు గురించి తెలిసినా, దాన్ని విడిచే ఆలోచన చేయకపోవడం.. ఫలితంగా కడగండ్లకు గురికావడం.. ఇదీ జరుగుతున్నది.

తనది కాని స్ర్తీని పొందాలనుకొని పట్టుపట్టిన రావణాసురుడు.. ఆమెను విడిచిపెట్టాలంటూ తన శ్రేయోభిలాషులు చెప్పిన మాటలను విని ఉంటే కొడుకులను, సోదరుడు కుంభకర్ణుడిని, బంధువులను, పరివారాన్ని, రాజ్యాన్ని, చివరకు ప్రాణాల్ని పోగొట్టుకుని ఉండేవాడు కాదు.

అలాగే భారతంలో పాండవులకు ‘సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వనంటూ పట్టిన పట్టు విడువక అహంకరించిన దుర్యోధనుడికి చివరికి ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే.

దురదృష్టం ఏమిటంటే బాహ్య విషయాలపై పట్టు గురించి ఆలోచిస్తామేగానీ.. మన అంతర్గత, ఆధ్యాత్మిక విషయాల పట్ల ‘పట్టు’ సాధించటానికి ప్రయత్నించం.

మనసు, జిహ్వ, ఇంద్రియాలపైన పట్టులేకపోవటం చేతనే భగవంతుడు మెచ్చే కార్యాలు చేయలేకున్నాం.

ఆయన అనుగ్రహానికి పాత్రులం కాలేకపోతున్నాం.

మనం ‘పట్టు’ వదల వలసింది.. లౌకిక విషయాల్లో! పట్టు బిగించవలసింది..
ఆధ్యాత్మిక సాధనాంశాల్లో!!

అప్పుడే మనం భగవంతునితో అనుబంధాన్ని పెంచుకోగలం.
ఉదయం ఆకాశం ఎరుపు రంగుకు తిరిగితే చాలు ఇక సూర్యుడు వచ్చినట్లే.

చెట్టుకు పూలు పూస్తే చాలు, ఇక ఫలాలు వచ్చినట్లే.

అలాగే నీ అంతఃకరణంలో దైవీసంపద కూడుకుంటే చాలు ఆత్మజ్ఞానం - తద్వారా పరమాత్మ నీలో ప్రవేశించినట్లే.
కనుక ఈ అధ్యాయంలోని విశేషాలను చక్కగా గ్రహించి ఆసురీ సంపదను దూరంగాత్రోసివేసి దైవీసంపదను ఆహ్వానిద్దాం, వృద్ధి చేసుకుందాం.

వేదాంతంలో జీవుణ్ణి పక్షితో పోలుస్తారు. పక్షికి ముఖం సన్నగా ఉండి రెండు కళ్ళూ ముఖానికి అటూ ఇటూ ఉండి వేరు వేరు దృశ్యాలను చూపిస్తాయి. కాని మానవుడిలో ఆధ్యాత్మికమో - ప్రాపంచికమో ఏదో ఒక్క దృష్టే ప్రబలంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడు ఇంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకొని తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక దృష్టి ప్రబలంగా ఉన్నవాడు ప్రపంచంలోనే కూరుకుపోతాడు. అతడు తనలోని వాసనలను గురించి పట్టించుకోడు. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ - మరణిస్తూ ఈ సంసార జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఆధ్యాత్మిక దృష్టి గలవాడు తనలోని వాసనల గురించి విశ్లేషించి, అవి ఆసురీసంపద అయితే త్రోసివేసి, దైవీసంపదను వృద్ధి చేసుకుంటాడు. పరమాత్మకు దగ్గరవుతాడు.
మన మూర్ఖత్వప్రవర్తనతో
జీవించి ఉండగా మరణించడమా! లేక విజ్ఞానం మరియు దైవ జ్ఞానం తో మరణించిన తరువాత కూడా జీవించివుండటమా!


Source - Whatsapp Message

No comments:

Post a Comment