Saturday, September 5, 2020

ధ్యానం - నీ లోనికి నీ పయనం

🌹ధ్యానం - నీ లోనికి నీ పయనం🌹

హనుమత్ దీక్ష గురుపీఠం సమర్పణ:-

ధ్యానం -
నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.
ధ్యానం -
మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.
ధ్యానం -
ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.
ధ్యానం -
వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.
ధ్యానం -
మనస్సు యొక్క నిశ్చలత్వం.
ధ్యానం -
మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.
ధ్యానం -
ఇతరభావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.
ధ్యానం -
అంతరంగ చైతన్యముకు చేరువకావడం.
ధ్యానం -
హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.

ఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.

ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ. ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావసమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయవాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది. పరమాత్మ ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయవాసనలుండకూడదు. ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటే ఉపాధి.
ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి. ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.
ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.

ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను.

మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు.........
ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.

ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను -
ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా
సమస్తమైన వేదశాస్త్రములును మరల మరల పరిశోధింప ఒకటే గోచరిస్తుంది. అది, సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పది.
ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి -
బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ
ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్
బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననములైన పాపాలన్నియున్ను ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు భస్మమగుచున్నవి.
ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ
సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్
భ్రూమధ్యమందు ప్రణవమంత్రములతో మనస్సును ఐక్య పరచి ఒక ముహుర్తమాత్రం ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.
నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః
క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత)
నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ ఫలితముంటుంది.

నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment