Wednesday, September 29, 2021

దైవభీతి

దైవభీతి
➖➖➖✍️

భగవంతుడికి ఎందుకు భయపడాలి?
వాస్తవానికి, దేవుణ్ని చూసి భయపడాల్సిన పనిలేదు. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. దేవుడి కంటే ఆత్మ బంధువు మరొకరు ఉండరు. ఆయనకు తరతమ భేదాలు ఉండవు.

అటువంటి ఆత్మ స్వరూపమైన భగవంతుడు భయాన్ని ఎందుకు కలిగిస్తాడు?

సర్వం తెలిసినవాడు, శక్తిమంతుడు, రంగు, రూపంలేని దేవుడు ఉన్నాడనేది- సద్భావన.
అక్కడ భయానికి తావులేదు. ఆయన విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఒక్క క్షణం కూడా క్రమం తప్పని క్రమబద్ధీకరణతో విశ్వ పయనం నిరంతరాయంగా కొనసాగుతుంది.

భూమిపై జన్మించిన ప్రతి ప్రాణి లోనూ ఈ క్రమం గోచరమవుతుంది. బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలు... ఏ ప్రాణీ తప్పించుకోలేని దశలు.

బాల్యాన్ని భగవత్స్వరూపంగా భావిస్తాం. కల్మషరహితంగా, నిస్వార్థంగా, గతానికి భవిష్యత్తుకు అతీతంగా వర్తమానంలోనే జీవించాలని తెలిపే మహోన్నత దశ అది.

యౌవనంలో ఊహలు వికసించి వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. అవగాహన ఏర్పడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు నాటే ఆధ్యాత్మిక బీజాలు మనసులో అంకురాలు అవుతాయి.

కౌమారంలో పరిపూర్ణ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిత్వంలో విచక్షణ మొదలవుతుంది. ఆధ్యాత్మిక భావనలు విస్తృతమై అవగాహనతో కూడిన సాధన వైపు ప్రయాణం మొదలవుతుంది.

కొన్ని అనవసర భయాలు బాల్యంలోనే మనసులో చొరబడతాయి. వాటిని ఉంచుకోలేం, వదిలించుకోలేం అన్నట్లు ఉంటాయి. అవి తలపునకు వస్తే చాలు- వార్ధక్యంలోనూ గగుర్పాటు కలుగుతుంది. వచ్చీపోయే తాత్కాలిక భయాలు ఆధ్యాత్మిక పరిణతి వల్ల తొలగిపోతాయి.

జీవితాంతం వెంబడించే శాశ్వత భయం మరణం. దీన్ని సాధన ద్వారానే జయించగలుగుతాం. మొగ్గ, పువ్వు, కాయ, పండు... ఏదో ఒకరోజు రాలిపోక తప్పదన్న స్థితప్రజ్ఞ సిద్ధిస్తుంది.

పదహారేళ్ల ప్రాయంలోనే మరణానుభూతి పొంది, ఆ భీతి నుంచి శాశ్వతంగా బయటపడి, మౌనం ద్వారా ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసుకున్నారు భగవాన్‌ రమణ మహర్షి.

భయానికి మూల కారణం అభద్రతా భావమే.

ఆదిలోనే దాన్ని అదుపు చేయకపోతే వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోనే నిండిపోతుంది.

భయం ఎప్పుడూ ఒంటరిగా రాదు. మనకు తెలిసిన దాన్ని గురించి గానీ, ఎవరో ఒకరు తెలియజేసినదాన్ని గురించి గానీ, చేయబోయేదాన్ని గురించి గానీ భయం మొదలవుతుంది.

ఉన్న స్థితి నుంచి ఉండాలనుకునే స్థితికి మధ్య ఊగిసలాటే భయానికి నాంది.

భయం అనే పదం మదిలో మెదిలితే చాలు, మనసు పరాధీనమవుతుంది. భయపడే మనసు స్వేచ్ఛను కోల్పోతుంది. ధైర్యంగా భయాన్ని ఎదుర్కోగలిగేవారికే విజయం దక్కుతుంది.

కలుపు మొక్కల్లాంటి భయం యొక్క మొలకల్ని ఎప్పటికప్పుడు పెరికి వేస్తుండాలి.

భయం ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండాలి.

అప్పుడే అది మనం జాగ్రత్తగా మసలుకునేలా చేస్తుంది. నిప్పును చూసి భయపడతారు. ధైర్యం చేసి ముట్టుకుంటే, ఏం జరుగుతుందో తెలుసు. భయం ఒక హెచ్చరిక.

అపాయం గురించి తెలిసినప్పుడు, దాన్ని ఎలా దాటాలన్న పద్ధతులను అన్వేషించే ప్రేరణ భయం కావాలి.ఈ దృష్టితో ఆలోచించి భయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి.

అది మనలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసే అవకాశంగా భయాన్ని భావించాలి.

అప్పుడు అది మనలో ఉన్న ఆత్మ సామ్రాజ్యానికి మనల్ని అధిపతిని చేస్తుంది!✍️

. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవంతు

సేకరణ

No comments:

Post a Comment