*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 78*
*సంగీత కళాకారులు*
*వీణావాదనంతో నాదోపాసన - గాయత్రి*
తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే సంగీత కోవిదుల నిలయమైన చెన్నపురిలో వీణకచేరి. మరో రెండేళ్లకు కంచి కామకోటి పీఠంలో పరమాచార్యుల సన్నిధిలో వీణావాదనం.
ఈ ఆబాల్య వైణిక ప్రతిభామూర్తి ఇచ్చంపాటి గాయత్రి. *'వీణ గాయత్రి'* అంటే సంగీత ప్రపంచంలో ప్రసిద్ధం. పుట్టింది 1959 నవంబరు 9న సంగీత కుటుంబంలో. ఆమె తండ్రి సుప్రసిద్ధ చలన చిత్ర సంగీత దర్శకుడు అశ్వత్థామ. తల్లి వీణా విదుషి కమల.
*'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ' కదా*, గాయత్రి పూర్తి పేరు గాయత్రి వసంత శోభ. ఆమె తొలి గురువులు తల్లి దండ్రులే. తర్వాత సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు, స్వరకర్త టి.ఎమ్. త్యాగరాజన్ వద్ద సుశిక్షితులయ్యారు.
తొమ్మిదేళ్ల వయసులో మద్రాసులో పార్ధసారధి స్వామి సభలో ఆమె కచేరీ చేసినపుడు సాంబమూర్తి వంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఈమెను *బాలమేధావి*' గా ప్రశంసించారు.
గాయత్రి దేశ విదేశాల్లో 5 వేలకు పైగా కచేరీలు చేసారు.
మలేసియా, సింగపూర్, అమెరికా, ఇంగ్లాడు, ఫ్రాన్సు మొదలైన విదేశాల్లో
సైతం ఆమె వీణ శ్రోతలను ఉర్రూతలూగించారు.
ఆమె వీణకచేరీలు, జుగల్బంది కచేరీలు, ప్రయోగాత్మక కచేరీలు మనోహరమైన ఆకర్షణగా నిలిచాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఉస్తాద్ అహ్మద్ హుస్సేన్ ఖాన్ వంటి మహోన్నత సంగీత విద్వాంసుల సరసన వీణావాదనం చేసి ఘనతకెక్కారు.
అసంఖ్యాకంగా ఆడియో కేసెట్లు, సి.డిలు హెచ్.ఎం.వి వంటి సుప్రసిద్ధ రికార్డింగ్ కంపెనీల ద్వారా విడుదలైన కీర్తి గాయత్రి స్వంతం, కొన్ని చలన చిత్రాల్లో కూడా పాటల్లో గాయత్రి వీణానాదం వన్నె చేకూర్చింది. బంగ్లాదేశ్ శరణార్థుల సహాయార్ధం నిధుల సేకరణకు ఈమె చేసిన కచేరీల్లో సంగీతాభిమానులు ధన వర్షం కురిపించారు.
కంచి కామకోటి పీఠాధిపతి సమక్షంలో ఆమె వీణా వాదనం చేసినపుడు ఆయన గంధపు చెక్కతో చేసిన కిరీటం, తులసిమాల గాయత్రికి బహూకరించారు.
వీణ మనిషిలోని వెన్నెముక వంటిదని, వీణను సాధన చేస్తే ధ్యానయోగంతో, మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు కుండలినీ శక్తిని మేల్కొలిపే విద్య సాధ్యమవుతుందని అభిభాషించారు. తనకు ఆ చిన్న వయసులో ఆ మాటల భావం అర్ధం కాకపోయినా, వీణా సాధనను ఒక ధ్యానంగా భావిస్తూ బాహ్య ప్రపంచాన్ని మరచి ఏకాగ్రతతో కచేరీ చేస్తుంటే దివ్యానుభూతి కలుగుతుంటుందని గాయత్రి తన అనుభూతిని వ్యక్తం చేస్తుంటారు.
కళాకారిణిగా గాయత్రి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వరించాయి. 1984లో తమిళనాడుముఖ్యమంత్రి యం.జి. రామచంద్రన్ *'కలైమామణి'* బిరుదంతో సత్కరించారు. కంచి కామకోటి పీఠాధిపతి వీణానాదమణి బిరుదు ప్రదానం చేసారు. తిరుపతి శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ వారు 2000 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన *'సప్తగిరి సంగీత విద్వన్మణి'* బిరుదంతో సమ్మానించారు.
2011లో మద్రాస్ రోటరీ క్లబ్ వారు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఎన్నో సంస్థలు వీణాగాన విశారద, వీణావాణి, వీణా భారతి, మహతీరాజ్ఞి వంటి బిరుదులు ఆమెకు ప్రదానం చేసాయి. 2002లో డా|| అబ్దుల్ కలామ్ సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, 1999లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కుమార గంధర్వ బిరుదం గాయత్రి ప్రతిభకు గీటురాళ్లు. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గాయత్రిని చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరువయ్యూరు ప్రభుత్వ సంగీత కళాశాలలకు గౌరవ సంచాలకులుగా నియమించడం ఆమె వైదుష్యానికి సముచిత సత్కారం. సంగీతం ద్వారానే భగవద్దర్శనం సాధించాలని, ఆత్మ సాక్షాత్కారానికి నాదోపాసనే మార్గమని భావించే గాయత్రి దాక్షిణాత్య సంగీత ప్రపంచానికి *అమూల్యాభరణం.*
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)
No comments:
Post a Comment