Thursday, June 19, 2025

*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(9 వ భాగము)*

*ప్రతియొక్కరు పుణ్యకర్మలలో లేదా విధ్యుక్తధర్మాలలో నెలకొనాలని, అటువంటి కర్మలే మనిషికి మహోన్నతస్థితిని కలుగజేస్తాయని జైమిని ఋషి వంటి మీమాంసకులు నిర్ణయించారు. వారు ఒకరకపు తత్త్వవేత్తలు. కాని భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయములో ఇది నిరాకరించబడింది. పుణ్యకర్మలచే జీవుడు స్వర్గ లోకాలకు చేరినా పుణ్యరాశి తరిగిపోగానే అతడు స్వర్గసౌఖ్యాలను వదలి అల్పాయువు, ఆల్పసుఖము కలిగిన మర్త్యలోకానికి వెంటనే పతనము చెందవలసి వస్తుందని శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాడు. "క్షీణేపుణ్యే మర్త్యలోకం విశన్తి" అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. కనుక పుణ్యకార్యాలు పరతత్త్వము చెంతకు చేరుస్తాయనే మీమాంసకుల నిర్ణయము సయుక్తికము కాదని తేలిపోయింది. విశుద్ధ భక్తుడు సహజంగానే పుణ్య కార్యాలు చేయడానికి మొగ్గుచూపినా కేవలము పుణ్యకార్యాలతోనే ఎవ్వడూ భగవంతుని అనుగ్రహాన్ని* *పొందలేడు. రజస్తమోగుణాల వలన కలిగే కల్మషాన్ని పుణ్యకార్యాలు తొలగించగలుగుతాయి; కాని భగవద్గీత, శ్రీమద్భాగవతమువంటి భగవత్కథను వినడంలో నెలకొనిన భక్తునికి అటువంటి పవిత్రీకరణ సహజంగానే కలుగుతుంది. పుణ్యకార్యరతుడు కాకపోయినా భక్తి యోగంలో నెలకొనినవాడు ఆధ్యాత్మికసిద్ధిపథంలో చక్కగా నెలకొనినట్టివాడేనని భగవద్గీత నుండి అర్థమౌతుంది. ప్రేమశ్రద్ధలతో భక్తియోగములో నెలకొనిన వ్యక్తికి అంతరము నుండే భగవంతునిచే నిర్దేశము లభిస్తుందని కూడ భగవద్గీతలో చెప్ప బడింది. పరమాత్మునిగా లేదా ఆధ్యాత్మిక గురువుగా హృదయమందే నిలిచినవాడై భగవంతుడే భక్తునికి క్రమంగా భగవద్ధామాన్ని చేరేవిధంగా సరియైన నిర్దేశాన్ని ఇస్తాడు. మీమాంసకుల సిద్ధాంతము సరియైన అవగాహనకు దారితీసే అసలైన సత్యము కానే కాదు,*

*అదేవిధంగా సాంఖ్యతత్త్వవేత్తలు అనేవారు ఉన్నారు. భౌతికతత్త్వవిచారకులు లేదా లౌకిక శాస్త్రజ్ఞులు తాము కనిపెట్టిన శాస్త్రీయ పద్ధతి ద్వారా ఈ జగత్తును అధ్యయనము చేస్తారే గాని జగత్తుకు సృష్టికర్తగా భగవంతుని గుర్తింపరు. భౌతికతత్త్వముల అంతఃప్రక్రియయే సృష్టికి మూలమని వారు తప్పుగా నిర్ణయిస్తారు.*

*కాని భగవద్గీత ఈ సిద్ధాంతాన్ని నమ్మదు. జగత్కార్యాల వెనుక భగవంతుని నిర్దేశమున్నదని దానిలో స్పష్టంగా చెప్పబడింది. "సద్వా సొమేద్వమగ్ర ఆసీత్" అనే వేదవాక్కుచే ఇది ధ్రువపరుపబడింది. సృష్టికి మూలము జగత్తుకు ముందే ఉన్నదని దాని భావము. కనుక భౌతికతత్త్వాలు సృష్టికి కారణము కానేకావు.. భౌతికతత్త్వాలు నిమిత్త కారణముగా అంగీకరింపబడినను స్వయంగా భగవంతుడే చరమకారణమై యున్నాడు. అందుకే ప్రకృతి శ్రీకృష్ణుని నిర్దేశములో పనిచేస్తున్నదని భగవద్గీత పలికింది.*

*నాస్తిక సాంఖ్యతత్త్వ అభిప్రాయమేమంటే ప్రభావములు (అంటే ఈ భౌతిక జగత్తు యొక్క రూపాలు) తాత్కాలికములు లేదా భ్రాంతిమయాలు కనుక కారణము కూడ భ్రాంతిమయమే. సాంఖ్యతత్త్వవేత్తలు శూన్యవాదాన్ని సమర్థిస్తారు. కాని యథార్థమే మంటే ఆదికారణుడు భగవంతుడు; ఈ భౌతికజగత్తు అతని శక్తి యొక్క తాత్కాలిక ప్రకటము. ఈ తాత్కాలికప్రకటము నశించిపోయినపుడును దానికి మూలము యథాతథముగా నెలకొనియే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికజగత్తు సనాతనధామమని చెప్పబడింది. కనుక సాంఖ్యతత్త్వవేత్తల సిద్ధాంతము సయుక్తికము కాదు.*

*ఇక గౌతమ కణాదుల వంటి తత్త్వవేత్తలు కొందరున్నారు. వారు భౌతికతత్త్వాల కార్యకారణాలను నిశితముగా అధ్యయనము చేసి పరమాణు మేళనమే సృష్టికి ఆది మూలమని నిర్ణయించారు. గౌతముడు, కణాదుడు తెలిపినట్టి ఈ పరమాణు వాదమునే ప్రస్తుతము శాస్త్రజ్ఞులు అనుసరిస్తున్నారు. అయినా ఈ సిద్ధాంతము ఎంతమాత్రము సమర్థనీయము కాదు. ఎందుకంటే సమస్తానికి ఆదికారణము జడ మైన పరమాణువులు కానేకావు. ఇది భగవద్గీతలో, శ్రీమద్భాగవతములో ధ్రువపరుపబడింది. వేదాలలో కూడ “ఏకో నారాయణ ఆసీత్ - సృష్టికి పూర్వము కేవలము నారాయణుడే ఉన్నాడు" అని చెప్పబడింది. మూలకారణుడు సచేతనుడని సృష్టి యందలి సమస్తాన్ని ప్రత్యక్షముగాను పరోక్షముగాను ఎరిగి యున్నాడని శ్రీమద్భాగవతములో, వేదాంత సూత్రములలో చెప్పబడింది. "అహం సర్వస్య ప్రభవః - సమస్తానికి నేనే ఆది కారణుడను”, “మత్తః సర్వం ప్రవర్తతే - నా నుండే సమస్తము ఉనికిలోనికి వచ్చింది" అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు. కనుక పరమాణువులే భౌతికవస్తువులకు కారణమైనను ఆ పరమాణువులు భగవంతుని నుండియే ఉత్పన్న మౌతాయి. ఈ విధముగా గౌతమ కణాదులు సిద్ధాంతము సమర్థనీయము కాబోదు.*

*అదేవిధంగా అష్టావక్రాది నిరాకారవాదులు, ఆ తరువాత శంకరాచార్యులు నిరాకారబ్రహ్మజ్యోతియే సమస్తానికి కారణమని చెప్పారు. వారి సిద్ధాంతము ననుసరించి భౌతిక జగత్తు మిథ్యకాగా, నిరాకారబ్రహ్మజ్యోతి సత్యము. కాని ఈ సిద్ధాంతము కూడ సమర్థనీయము కాదు, ఎందుకంటే బ్రహ్మజ్యోతి తన పైననే ప్రతిష్ఠితమై ఉన్నదని శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణుని దేహకాంతి యని బ్రహ్మసంహితలో ధ్రువపరుపబడింది. కనుక నిరాకారబ్రహ్మము భౌతికజగత్తుకు అదికారణము కాబోదు. పరమపూర్ణుడు, సచేతనుడు, ఆదిపురుషుడునైన గోవిందుడే ఆ అదికారణుడు.*

*భగవంతుడు అవతరించినపుడు త్రిగుణరచితమగు భౌతికదేహాన్ని స్వీకరిస్తాడు అనే నిరాకారవాదుల సిద్ధాంతము అత్యంత ప్రమాదకరమైనది. ఈ మాయావాద సిద్ధాంతము ఘోర అపరాధపూర్ణమైనదని శ్రీ చైతన్యులు ఖండించారు. భగవంతుని దివ్యదేహాన్ని ప్రకృతిమయమని భావించేవాడు విష్ణుపాదపద్మాల చెంత ఘోరమైన అపరాధము చేసినవాడౌతాడని ఆయన అన్నారు. భగవంతుడు మానవ రూపములో 'వచ్చినపుడు ' కేవలము మూర్ఖులు, దుర్మార్గులే అతనిని అపహాస్యము చేస్తారని భగవద్గీతలో కూడ చెప్పబడింది. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీచైతన్యులు మానవ రూపాలలో మానవసంఘములో తిరిగినపుడు ఇది నిజంగా జరిగింది.*

*నిరాకారవాదము ఒక ఘోరమైన అపసిద్ధాంతమని వేదమూర్తులు ఖండించాయి. బ్రహ్మసంహితలో దేవాదిదేవుని దేహము ఆనందచిన్మయరసమని వర్ణించబడింది. భగవంతునికి ఉన్నది ఆధ్యాత్మికదేహమే గాని భౌతికదేహము కాదు. అతడు ఏ దేహాంగము ద్వారానైనా దేనినైనా అనుభవించగలడు. అందుకే అతడు సర్వశక్తి మంతుడు. భౌతికదేహాంగాలు ఏదో ఒక నిర్దుష్టకార్యాన్నే చేయగలుగుతాయి. ఉదాహరణకు చేతులు పట్టుకోగలవే గాని చూడలేవు, వినలేవు. కాని భగవంతుని దేహము ఆనందచిన్మయరసము కనుక, ఆ విధముగా అది సచ్చిదానందవిగ్రహము కనుక దేవదేవుడు తన ఏ దేహాంగములోనైనా దేనినైనా చేయగలడు. భగవంతుని ఆధ్యాత్మికదేహాన్ని భౌతికమని తలచడము అనేది దేవదేవుని బద్ధజీవునితో సమానపరచే స్వభావము వలన కలుగుతుంది. బద్ధ జీవునిది భౌతికదేహము. కనుక భగవంతుడు కూడ భౌతికదేహాన్నే కలిగి ఉంటే దేవదేవుడు, జీవులు సమానమే యనెడి నిరాకారవాద సిద్ధాంతము సులభముగా ప్రచారం కాగలుగుతుంది.*

*యథార్ధానికి భగవంతుడు అవతరించినపుడు తన ఆధ్యాత్మికదేహాన్నే ప్రదర్శిస్తాడు. ఆ విధంగా యశోదమ్మ ఒడిలో పరుండిన అతని శిశుదేహానికి, దానవులతో పోరాడేటప్పటికీ అతని పెద్ద దేహానికి భేదమే ఉండదు. యౌవన ప్రాయంలో అతడు దంతవక్ర శిశుపాలాది దానవులతో ఎంతటి శక్తితో పోరాడాదో అంతే శక్తితో బాల్య రూపంలో పూతన, తృణావర్తి అఘాసురులతో పోరాడాడు. భౌతికజీవనములో బద్ధ జీవుడు దేహత్యాగము చేయగానే కడచిన జన్మకు సంబంధించినది పూర్తిగా మరచిపోతాడు. కాని శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు కనుక కోట్లకొలది సంవత్సరాల క్రిందట భగవద్గీతను సూర్యునికి ఉపదేశించిన విషయాన్ని మరచిపోలేదని గీత నుండి మనకు తెలుస్తున్నది. అందుకే శ్రీకృష్ణుడు పురుషోత్తముడని తెలియబడ్డాడు. అతడు భౌతిక, ఆధ్యాత్మిక జీవులు ఇరువురికిని పరమైనవాడు. భగవంతుడు సర్వకారణకారణుడంటే అతడు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటికి కారణుడని భావము. భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. భౌతికదేహము సర్వశక్తి సంపన్నము గాని, సర్వము నెరిగినది గాని కానందున భగవంతుని దేహము నిక్కముగా భౌతికము కాబోదు.. భగవంతుడు భౌతికదేహముతో ఈ జగత్తులోకి వస్తాడనే మాయావాద సిద్ధాంతము ఏ విధంగాను సమర్థనీయము కాదు.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

No comments:

Post a Comment