శీర్షిక:"పునర్నవి"
(ఇది నా స్వీయ రచన.ఏ ఇతర రచనకు అనువాదం కానీ, కాపీ కానీ కాదు.)
సీత కి నిద్ర రావటం లేదు. ప్రక్కనే వున్న సెల్ తీసి టైం చూసింది.రాత్రి రెండు. ఎంతఆలోచించినా తన సమస్యకు ఒకటే పరిష్కారంగా తోస్తున్నది..ఈ ఇంట్లో తనకింక స్థానo లేదు. వెళ్ళిపోవాలి, యాభై ఏళ్ళవయసులో , తాను వుంటున్న ఈ గూడునీ,
ఈ చిన్ని తోటని, తన అస్థిత్వాన్నీ కోల్పోయి వెళ్లిపోవాల్సిందేనా?వేరే దారిలేదు. ఎలా
వదిలి పోవటం? వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి? అన్నీ ప్రశ్నలే,జవాబు లేని, దొరకని ప్రశ్నలు.
పెళ్లయిన ముప్పయేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సమస్యకి తనకంటే పెద్దవాళ్ళు, అన్నయ్య, అక్కయ్య ఏం పరిష్కారం చూపుతారు ఈ సమస్యకి ?ఎప్పుడో చదివి మర్చి పోయిన పదోక్లాస్ చదువు, వంట చేయటం తప్ప ఎందులోనూ ప్రత్యేక ప్రజ్ఞ లేని తాను బయటికి వెళ్ళి ఎట్లా బ్రతకగలడు.?
ఎనిమిదేళ్లుగా ఒక బంజారా యువతితో కలిసిఉంటున్నాడు, ఇద్దరు పిల్లలు కూడా ఆమెతో. , ఈ ఎనిమిదేళ్లుగా ఇంటికి మూడు వందల మైళ్ళ దూరంలో వుద్యోగం అతనిది. .పిల్లల
చదువులు, మూడేళ్ళక్రితం ఇద్దరి పెళ్లిళ్లు,సక్రమంగా జరిగాయి.
వారం క్రితం ఆమె తన వాళ్ళతో వచ్చింది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని, తనని వదిలేసి వచ్చాడని చెబుతుంటే, నమ్మలేకపోయింది. మురారి వాళ్ళని బతిమిలాడుకొన్నాడు. ఆమెకేలోటూ రానివ్వనని, డబ్బు పంపుతానని, ఆవూళ్ళోనే ఉండమని అడిగాడు.
” వదిలేసి వస్తే అడ్రస్ తెలుసుకోలేమనుకొన్నావురా?" అంటూ అతనిని సోఫా లోంచి లాగి , కొట్టసాగేరు. ఆమె అడ్డుచెప్పలేదు, పైగాఅతన్ని తిడుతున్నది. ఆమె భాష చాలా అసభ్య పదజాలం తో నిండివుంది. కాసేపు వాళ్ళ భాషలో మాట్లాడుతూ, ఒక రకమైన తెలుగు
యాసలో తిడుతున్నది. మురారి ఎటువంటి అగాధం లో పడిపోయాడో అర్ధమైయింది సీతకు.
సీత అతన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకోలేక పోయింద అడ్డంపోయింది,ఆమెకు కూడా రెండు దెబ్బలు తగిలాయి. పదేళ్లుపైబడిన వాడిలా నిస్సహాయంగా కూర్చుండిపోయాడు మురారికి .ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ వుంది అతనికి. అతన్ని ఊళ్ళోనే వేరే ఇల్లు చూస్తానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు,
వెళ్ళిపోతూ ఒకమాట అన్నదిసీతతో ,“ ఇన్నేళ్లు నువ్వున్నావుగా ఈ ఇంట్లో, నీ పిల్లల పెళ్లిళ్లు
అయిపోయాయి వారం తర్వాత నేనొచ్చి వుంటాను, ఇక్కడే, ఈ ఇంట్లోనే, వుండలేకపోతే నువ్వు వేరే ఇల్లు తీసుకొనివుండు”, ఆమె ఎంత పెద్ద కరోడానో సీతకి అర్ధమైంది. ఇదంతా జరిగి వారమైంది.
ఆమె రోజూ ఫోన్ చేస్తూనే వున్నది, అతను రకరకాలుగా బతిమిలాడుకొంటున్నాడు. విసుక్కొనే సాహసం కూడా అతను చేయటం లేదు.
సీతకు ఇదంతా భరించరానిదిగా అయ్యింది. తనతో సౌమ్యంగాఉండేవాడు, పిల్లల చదువు పట్ల ఎంతో భాద్యతగావుండి, అన్నీసక్రమంగా జరిపించాడు. ఇన్నేళ్లు అత్తగారిని అన్న రిటైర్ అయ్యాకపంపుతానని చెబుతూ వచ్చాడు. నమ్మింది, నెలకు వారమైనా వచ్చేవాడు, తరచూ ఫోన్ చేసేవాడు, అందుకే ఆమెకు ఏ అనుమాన౦రాలేదు. ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంతో సంతోషించింది!.
అతను ఈ కారణం చేతనే అనుకుంటా, చాలా డల్ గా ఉంటున్నాడు.తాను కల్లోకూడా ఊహించలేదు, అతనింకో స్త్రీతో సంబంధం పెట్టుకొని తనని మోసం చేయగలడని . దైహికంగా తనుకూడా అతనికి దూరంగా వుంది, ఈ చాపల్యం తనకు కలగ లేదెందుకని? ఎనిమిదేళ్లు, కలిసి జీవిస్తున్నాడు ఆమెతో. ఆమె గురించి చెడు గా అనుకోకూడదు, కారణాలు ఏమైనా కానీ, మురారిదే తప్పు.
కొడుకు శ్రీకాంత్ హైద్రాబాద్ లోనే వున్నాడు. బాగా ఉన్నవాళ్ళ అమ్మాయిని చేసుకొన్నాడు, తన దుస్థితి వాడికి చెప్పుకోలేదు విషయంతెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో? కూతురు సౌమ్య ఆస్ట్రేలియలో వుంది, వాళ్ళ ఫామిలీ అంతా ఎన్నో ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డారు. కొడుకు
దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వెళుతుంది? తాను శ్రీకాంత్ దగ్గర ఉంటే మురారి అక్కడకు వస్తాడు. తండ్రీ, కొడుకు ఘర్షణ పడతారు, అందులో సందేహం లేదు. కోడలికి ఈ వ్యవహారం చికాకు కలిగించవచ్చు. సవ్యంగా సాగిపోతున్న వాడి జీవితం లో కలతలు రేపటం ఆమెకి
ఇష్టం లేదు. ఆస్ట్రేలియా లో వున్న సౌమ్య అత్తా మామలతో కలిసివుంటోంది.పరాయింటిదైన కూతుర్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
చిన్ననాటి స్నేహితురాలు దారి చూపింది, ఇంక ఇక్కడ వుండలేదు. ఆమె కాంపౌండ్ లోనే రెండేసి గదుల వాటాలు మూడు వున్నాయి. ఒకటి తనకు ఏర్పాటు చేసింది. తాను ఎప్పుడో చదివిన 10వ క్లాస్సర్టిఫికెటుతో ఏ వుద్యోగం ఈ వయసులో వస్తుంది? ఏ పనైనా చేస్తానని
చెప్పింది.
మురారి తో బంధం తెంచుకోవటం అంత తేలిక కాదు. ఇంత జరిగినా, అంత తేలిగ్గా అతనిని మరచి పోలేదు తను.అతనితో గడిపిన జీవితమూ, అనుభవాలు, కలిసి పంచుకొన్న అనుభవాలూ, భాద్యతలు, అతని శరీర౦ , మనసు అంతా నాకే స్వంతమనుకొన్నది
ఇన్నాళ్లూ, కానీ అతనికి తానే అంతాకాదని తెలిసిందిప్పుడు, ఇంకా తాను ఈ బంధాన్ని నిలుపుకోలేదు, వెళ్లిపోక తప్పదు , అతని జీవితం లోంచి, అతని ఇంట్లోంచి.
ఆమె నిర్ణయం విన్న అతను దుఃఖం ఆపుకోలేక పోయాడు. ఆమె దుఃఖం అతనికేమి తెలుసు? అతను తప్ప తనకింకో జీవితం లేదు. ఒంటరి తను, ఆమె వస్తుంది, నలుగురిలో కొంతకాలం తలవంపులుగా ఉంటుంది, తర్వాత అంతా మామూలే. అతను ఎక్కడ వున్నా, డబ్బు పంపుతానన్నాడు, చూడటానికి ఒప్పుకోమని బ్రతిమిలాడాడు, ఆమె నిరాసక్తంగా నవ్వి, ఆఖరిసారిఅతనిని కౌగిలించుకొని,కన్నీళ్లతో సెలవు తీసుకొంది
బస్ స్టేషన్ నుండి బయిటికి వచ్చింది.రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన జానకి కార్లో ఇంటికి వెళ్లారు. ఒక గది వంటిల్లు , మూడు వాటాలకు కలిపి కామన్ వరండా. ముప్పై ఏళ్ళు నాది అనుకొని బ్రతికిన సంసారాన్ని, ఇంటినీ వదిలి ఈ చిన్న గూటిలో కొత్త నిరామయ
జీవితం గడపాలి అనే భావన మనసుని వేదనా భరితం చేసింది.
జానకి మంచం, వంటకి కావలిసిన సామాన్లు సెట్ చేసింది. రెండురోజుల తర్వాత ఒక శాకాహార కుటుంబంలో మంటపనికికుదిరింది. ఆ ఇంట్లో అయిదుగురు పెద్దవాళ్ళు, ఇద్దరుపిల్లలు వున్నారు. టిఫిన్, ఉదయం ,సాయంత్రo వంట చేయాలి. చేతి కింద
పనిమనిషి వుంది. ఇరవై వేలు జీతం. జానకి ఒప్పుకొంది.
ఉదయం టిఫిన్ , పనమ్మాయి సారమ్మ తో కలిసి చేసేది. మిగిన కూరలు అవీతీసుకోనని చెప్పేసింది. ఆమె వంట వాళ్లకు బాగా నచ్చింది. ఆమె తన వివరాలు చెప్పడానికి అయిష్టత చూపడంతో వాళ్ళు అడగటంమానేశారు.
కాలం గడిచిపోతోంది. మురారి ఫోన్ చేస్తూనే వున్నాడు అతనిలోని గిల్టీ ఫీలింగ్ ఆమెని భాద పెడుతోంది. ఇంటా, బయటా, బంధువులలో పలుచునై పోయాడు. చివరికి ఓరోజు చెప్పేసింది, ఇంకా తన గురించి ఆలోచించ వద్దనీ, వున్న జీవితాన్ని ఆమెతో సాధ్యమైనంత వరకు సామరస్యంగా గడపమనీ చెప్పింది.
శ్రీకాంత్. సౌమ్య, కొత్తలో చాలా ఆవేశ పడ్డారు. క్రమంగా ఆ ఉద్వేగం తగ్గింది. తల్లి తమ సాయం ఏ రకంగానూ అంగీకరించక పోవఁటుంతో క్రమంగా వాళ్ళు ఫోన్ కాల్స్ తగ్గించారు.
ఇంటి వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్లి పోయాడు. జీతం అయిదు వేలకి చేయమన్నారు. సీత మరో ఇల్లు చూసుకొంటానని చెప్పింది.ఆ రోజు జానకి సీతని పిలిచి ఒక విషయం చెప్పింది. ఆమె అక్కకొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొన్నాడు. ఇప్పుడా అమ్మాయి ప్రెగ్నెంట్ . చాలా బలహీనంగా వుంది US వెళ్ళాలి, "వెళతావా సీతా?"అని అడిగింది. ఇద్దరి తల్లి తండ్రులూ వాళ్ళ పట్ల కనికరం చూపలేదు అందుకని.
.
సత వెంటనే ఒప్పుకొంది. జీవితంలో మరో మలుపు, విదేశీ యానo
ఒకసారి జానకి అడిగింది, పిల్లలగురించి, భర్త గురించి. సీత కళ్ళలోనీళ్లు తిరిగాయి. నెమ్మదిగా అన్నది," ఇంత జరిగినా మురారి అంటేకోపం లేదు. అతనంటే చాలా ఇష్టం నాకు, ఆమె విషయం తెలిసాక అతని జీవితం నుంచి తప్పుకోవాలి, ఇంకా ఆ బంధానికి అర్ధం లేదు, ఎలా వున్నాడో అనిపిస్తుందిఎవరితోనైనా చెబితే అతని పట్ల నాకున్న భావాలని ఏవగించుకొంటారని తెలుసు. ఆ రోజు ఆమెని చూసాక అర్ధమయ్యింది, అతను ఊబిలో పడిపోయాడని. తప్పుచేసాడు, మిగతా జీవితాన్ని ఆమెతో కలిసి బ్రతకాలిసిందే, నచ్చినా, నచ్చక పోయినా...
" శ్రీకాంత్, సౌమ్య పెళ్లిళ్లు అయిపోయాయి. నేను వాళ్ళకి బరువు కాదలచుకోలేదు”. ఆ గొంతులో నిర్వేదం జానకిని కలచి వేసింది.
సీతకి పాస్ పోర్ట్ వుంది. అమెరికా వెళ్ళే అన్నిఏర్పాట్లు వినీత్ చేసాడు.సీతని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకొన్నాడు. ఇంటికెళ్ళాక అతని భార్య శ్రీజ వచ్చి నమస్కరించింది. ఆ అమ్మాయి చాలా బలహీనంగా, నీరసంగా వుంది. పనిరాక, పనిచేయలేక , తిండి సరిగ్గా అమరక అలావుందని అర్ధం చేసుకొంది సీత.
నోటికి హితవుగా అన్నీ వండిపెట్టింది,పాలు, పండ్లరసాలూ టైం ప్రకారం ఇచ్చి,శ్రీజ కోలుకునేలా చేసింది. రోజు పార్క్ లోకి వాఁకింగ్ కి వెళ్ళేవాళ్ళు. వినీత్ నిశ్చింతగా ఆఫీస్ కి
వెళుతున్నాడు. నొప్పులు వస్తున్నప్పుడు తల్లిలా ధైర్యం చెప్పింది.
వినీత్ మరో ఆరునెలలకి పర్మిషన్ తీసుకొన్నాడు సీతకు.ఏడాది కాలం గిర్రున తిరిగింది. పసివాడితో బంధం పెంచుకోకూడదని అనుకొంది కానీ వచ్చేసేటప్పుడు వదలలేక పోయింది. వినీత్ కి సీతని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగేది ఏ రోజూ ఎంత ఇస్తున్నారని
అడగలేదు. ఆమెని ఫ్లైట్ ఎక్కించి, జానకికి ఫోన్ చేసాడు. సీత వస్తోదని, ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు నిండిపోయింది.
"మాకు అమ్మలా సేవ చేసింది పిన్నీ, శ్రీజ చాలా ఏడ్చింది.నెలకుమూడువేల డాలర్స్ చొప్పున వేసాను ఆమె అకౌంట్లో, నువ్వు ఆవిడకుచెప్పు"అన్నాడు.
జానకి అంది, ' అవసరముంటే మళ్ళి వస్తుందిలే' ఓదార్పుగా అన్నది.
జానకి అనుకొన్నది సీతలాంటి స్రీలు పునర్నవి లాంటి వాళ్ళు. పొలాల గట్లమీదా, రోడ్ల ప్రక్కన వుండే పునర్నవి మొక్క విలువ కొద్దిమందికే తెలుసు. అత్యంత పోషక విలువులున్న మొక్క,పునరుజ్జీవనాన్ని ఇవ్వగలిగే శక్తీ వున్న మొక్క అది. సంస్కృతం లో
పునర్నవ" అని పిలిచే మొక్క లాంటిది సీత. ఆమె లాంటి వాళ్ళు ఎటువంటి జీవితాలలోనైనా క్రొత్త జీవ౦ తేగలరు. ఆ విలువ తెలియని మురారి లాంటి వాళ్ళు, జీవితం లో చాలా కోల్పోతారు,
మర్నాడు పునర్నవి ని స్వాగతించడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలని భర్తకు
చెప్పటానికి లేచి వెళ్ళింది జానకి.
(సమాప్తం )
పునర్నవ మొక్క
No comments:
Post a Comment