*మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగా లంటే మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ.*
*ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది.*
*అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది.*
*మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించ సాగింది.*
*అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పుసీసా మూత తీయడం జరిగింది.వెంటనే బ్రతికేనురా జీవుడా అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది.*
*కాని సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంట బడింది.*
*వెంటనే ఆ చీమ “ఏం మిత్రమా! అలా అయిపోయేవు? క్షేమమేనా?”అని అడిగింది. “ఏం క్షేమం?అంతా క్షామమే” అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది.*
*అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది.*
*చిత్రం! ఆ మొదటి చీమ అతిమధురమైన పంచదారనే వెగటుగా ఉంది అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది.*
*కారణం అంతుబట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమను నోటిని తెరవమని అందులో ఉన్న ఉప్పు కణాలను తీసివేసింది.*
*అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు.*
*అలాగే మనిషిలో అరిషడ్వర్గాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది.*
*ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం.*
No comments:
Post a Comment