*🕉️🪷-"శ్రీ విష్ణు పురాణం"-🪷🕉️*
*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*
*శ్రీ గురుభ్యోనమః*
*👉 89వ భాగం:-*
*ఎవరి నుండి ఏదీ తీసుకొనక, మిక్కిలి శుచిగా ఉండడం, అహింస, బ్రహ్మచర్యం, దొంగతనం లేకుండడం - కలవాడై యోగాభ్యాసుడుఅయి, ఆ యోగఫలం కోరకూడదు.*
*నియమం, శౌచం, తపస్సు, వేదపఠనం, నాలుక కోరికలు విడవడం, బ్రహ్మదర్శనం (ధ్యానం) దీనికి 'యమ' యోగం అని సంజ్ఞ. పైన చెప్పినది - కామ్య ఫలకాంక్షతో చేస్తే తప్పక సిద్ధిస్తాయి. సందేహం లేదు.*
*సకలాసనాలలో భద్రాసనం అలవాటు చేసుకుని దానితో యోగం అభ్యసిస్తూ పంచగుణాలనూ మనసునూ జోడించి బ్రహ్మధ్యానప్రవృత్తితో ఉండడం 'యమం' అని వచనీయం...*
*ప్రాణవాయువులను తన వశం చేసుకుని బ్రహ్మతత్త్వాన్ని తెలిసి ప్రవర్తించే యోగం ప్రాణాయామయోగం అని తత్త్వవిదులన్నారు.*
*ఊర్ధ్వముఖంగా ఉన్న ప్రాణవాయువును అధోముఖంగా ఉన్న అపానవాయువును సమానస్థాయిలో ప్రవర్తింపచేసేది లంబనయోగం.*
*ఆ లంబనయోగంతో శబ్దాదులకు వశీకరమైన ఇంద్రియ సమూహాన్ని తన వశం చేసుకొనడం ప్రత్యాహారం అనే యోగం అవుతుంది.*
*ఈ యోగాలన్నీ ఆ కేశవుణ్ణి తెలియడానికి స్థూలయోగాలు. సూక్ష్మయోగం ఏదో తెలియదు.*
*అని చెప్పగా ఖాండిక్యుడు సరే. ఆ హరిని ఏ విధంగా భావన చేసి యోగి ముక్తిని పొందునో ఆ విషయం చెప్పవలసిందని అడగగా కేశిధ్వజుడు చెప్పాడు.*
*దివ్యమూర్తియైన విష్ణువు యోగిచిత్తం నందుంటాడు. ఆ మూర్తి స్థూలరూపం, సూక్ష్మరూపం - అని రెండు విధాలు. పర + అపర సంజ్ఞగలవి ఆ మూర్తులు.*
*బ్రహ్మభావన, కర్మభావన, బ్రహ్మకర్మభావన అని భావన మూడు విధాలు. విష్ణుమూర్తి భేదాలను ఈ మూడు భావనలచే చూడవచ్చు. ఆ భావనలను వివరిస్తాను విను.*
*సనకాది మునీంద్రులు బ్రహ్మభావనాపరులు. ఇంద్రాదులు కర్మభావనా నిరతులు. బ్రహ్మాదులు బ్రహ్మకర్మభావనా రతులు.*
*ఈ మూడు భావనలచే నిరంతరం శ్రీహరిని ధ్యానయోగంతో ఆరాధించే పద్ధతి ధారణ అనే యోగం అవుతుంది.*
*జంగమస్థావరాత్మకమైన ఈ ప్రపంచం ఆ ఈశ్వరుని స్థూలరూపం. నరసుర పతుల రూపాలతో ఉండేది హరి సూక్ష్మరూపం.*
*స్థూల సూక్ష్మరూపాలతో ఒప్పే వాసుదేవుని పై చెప్పిన మూడు భావనలతో నిర్మల మనస్కుడై ధ్యానించేవాడే ధ్యాని అని చెప్పదగినవాడు.*
*విష్ణుశక్తి చరాచరజగమునందు సమంగానే ఉంటుంది. భిన్నాభిప్రాయంగల అవివేకులు వేరు రీతిగా మాటాడుతారు.*
*ఇప్పుడు నేను చెప్పిన యోగవిద్యతో జీవితం గడిపేవారి హృదయాలలో శ్రీహరి ఉండి వారి కిల్బిషాలను అణచి సుఖం కలిగిస్తాడు. చివర తన వద్దకు తీసుకుంటాడు.*
*అని సంగ్రహంగా యోగవిద్యనుగూర్చి చెప్పగా సంతోషించి ఖాండిక్యుడు రాజచంద్రా! నీ ఉపదేశంతో నా మనస్సు ప్రసన్నమయింది. పద్మాక్షునిపై నిల్చింది. అని అభినందించగా కేశిధ్వజుడు ఆనందంగా నిజపురానికి వెళ్లాడు. ఖాండిక్యుడు తన కుమారునకు పట్టంకట్టి యోగ విద్యాభ్యాసంలో సకల సుఖాలు పొంది ఆనందంగా ఉన్నాడు.*
*కేశిధ్వజుని తండ్రి మిథిలకు పోయి సత్కర్మలతో పద్మాక్షుని ఆరాధిస్తూ చాలా యజ్ఞాలు చేశాడు. వాసుదేవానుగ్రహంతో దివ్యభోగాలనుభవిస్తూ హాయిగా ఉన్నాడు.*
*అని పరాశరుడు మైత్రేయా! సర్గ ప్రతిసర్గాదుల మన్వంతరాల వృత్తాంతం చెప్పాను. ఇంక ఏమి నీ వినవలసేది! అని అనగా మైత్రేయుడు గురుదేవా! వినవలసినవన్నీ విన్నాను. మనసు నిర్మలమై శాంతగుణ భాసురమయింది. నాలో ఉన్న సందేహాలు పోవాలని మిమ్మల్ని అడగడం మీరు శ్రమపడి చెప్పవలసేది చెప్పి వాటిని పోగొట్టడం అయింది. మీకు నా వల్ల కలిగిన శ్రమకు నన్ను క్షమించండి అని అనగా పరాశరుడు కరుణతో చూసి నువ్వు నాకు చేసిన సేవ వల్ల దేవతలకు కూడా సిద్ధింపని శ్రీవిష్ణుపురాణం నీకు ఆనందంగా చెప్పడం అయింది. ఆలాటి పుణ్యం నాకు కలిగించావు శ్రమ కాదు.*
*రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...*
*జై శ్రీమన్నారాయణ*
*జై శ్రీమన్నారాయణ*
*జై శ్రీమన్నారాయణ*
*సర్వేజనా సుఖినోభవంతు...*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️q🕉️
No comments:
Post a Comment