*తీర్పు* గల్పిక *చక్రవర్తి*
కోర్టులో కేసు విచారణ మొదలైంది. అది విడాకుల కేసు. వనజ తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. రెండో వాయిదాకు వనజను హాజరుపరచమని న్యాయమూర్తి చెప్పారు. కేసు వాయిదా పడింది.
****
వనజ హాజరైంది.
"పెళ్లి అయి రెండేళ్లు పూర్తికాలేదు. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు? నువ్వే చెప్పు. ఎవరు చెప్పిన మాటలో కాక నువ్వే స్వయంగా నీ అభిప్రాయం చెప్పు." న్యాయమూర్తి.
" నన్ను వాళ్ళు బాగా హెరాస్ చేస్తున్నారు. అందుకే పడలేకపోతున్నాను." వనజ ఆవేశంతో చెప్పింది.
"అందరూ అంటే..." న్యాయమూర్తి అడిగారు.
"మా అత్త, మామ, నా భర్త"
"ఓహ్..అందరూ అన్నమాట. ఎలాగో చెప్పగలవా??"
"చెప్పడమే కాదు. మొత్తం రికార్డులు ఉన్నాయి. వినిపిస్తాను."
"మీ లాయర్ గారు అన్నీ విన్నారా?"
" మొత్తం చెప్పాము. వాయిస్ రికార్డులు విన్నారు కూడా"
"సరే. నీ ఫోన్ రికార్డులు నేను నా ఛాంబర్ లో వింటాను. నువ్వూ,మీ లాయర్, తల్లిదండ్రులు రండి. " అని కోర్టు స్టాఫ్ కి, లాయర్ కి సూచనలిచ్చి జడ్జి తన ఛాంబర్ లోకి వెళ్ళాడు.
****
మధ్యాహ్నం కోర్టు హాల్ లో అందరూ ఉండగా జడ్జి తన స్థానంలో కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు.
"ఈ విడాకుల కేసు నేను ప్రత్యేకంగా తీసుకున్నాను..ఎందుకంటే ఇలాంటి కేసులు ఏళ్ళు ఏళ్ళు తీసుకుంటున్నాయి..ఇందులో కొంత పాత్ర న్యాయవాదులది కూడా ఉంది. వ్యవస్థలది ఉంది. దీనిని గురించి ఆలోచించాను. పెళ్లి అయినప్పటి నుండి రికార్డులు ఉన్నాయి అని మొదటి వాదనలో లాయర్ గారు చెప్పడంతో నాకు ఆసక్తి కలిగింది. అందుకే స్వయంగా ఆమెనే పిలిపించాను. ఛాంబర్ లో విన్నాను. వనజతోపాటు వాళ్ళ తండ్రిగారు కూడా పెళ్లి నుండే కాదు పెళ్ళికి ముందునుండి మాట్లాడుకునేవి కూడా వాళ్ళ మాటలు, ఫోన్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు. అంత అవసరం ఏమి వచ్చింది.?? పెళ్లి తరవాత ఏళ్లకు ఏవో గ్యాప్స్ వస్తే అప్పుడు రికార్డ్ చేయడం వాళ్ళ ఇష్టం. ముందునుండీ ఈ పద్ధతి ఏమిటి!? అక్కడక్కడ వినిపించమన్నాను. భార్యాభర్తలు సాధారణంగా వాదించుకునేవి కూడా రికార్డ్ లో ఉన్నాయి. సాధారణంగా అత్తగారు చేసే సూచనలు కూడా హెరాస్మెంట్ లో భాగంగా వినిపిస్తున్నారు. పిల్ల ఏడుస్తుంది. కనుక లేచి,పాలు ఇమ్మనడం ఒక హెరాస్మెంట్. మామగారికి కాస్త కాఫీ పెట్టీ ఇమ్మనడం, ఇవ్వకపోతే అదేమిటమ్మా అని అడగడం ఒక హెరాస్మెంట్. ఇంట్లో సామాన్లు సద్దకుండ అలాగే ఉంచేస్తే అడగడం ఒక హింస. ఇంట్లో పనిమొత్తం అత్తగారే చేస్తున్నది అని ఈ రికార్డుల ద్వారానే తెలిసింది. ఇలాగే ఉన్నాయి అన్నీ. వనజ తండ్రిగారు అయితే ఇంట్లో పని ఎందుకు చెయ్యాలి అని ఎదురు అడుగుతూ మాటిమాటికి కేసు పెట్టి బొక్కలో తోస్తా అనే అన్నాడు నేను విన్నవాట్లలో. అంటే చట్టం, న్యాయం, పోలీసు వ్యవస్థల పై అతడికి ఎంత చిన్నచూపు ఉందో తెలిసిపోతున్నది. తల్లిదండ్రులు సద్దిచెప్పే ప్రయత్నం చేయలేదు.
న్యాయవాది పూర్తిగా తెలుసుకోలేదు.పసికందుగురించి ఎవరూఆలోచించలేదు. కేసు మాత్రం కోర్టుకు వచ్చేసింది. కుటుంబం చక్కబడడానికి ముందుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చెయ్యాలి కదా!! చిట్టచివరి దశలో కదా కోర్టుకు రావాలి. వీళ్లందరూ కలిసి మొదటి దశలోనే కోర్టుకు వచ్చేశారు. ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి..నేను కూడా దీనిని కొంత సీరియస్ గా తీసుకున్నా. చట్టాలు మార్చాలి. లాయర్స్ మారాలి. న్యాయవ్యవస్థ మారాలి. తొందరగా ఇలాటి కేసులు తేల్చాలి.
ఈ ధోరణి చూసాక, వాది అయిన వనజకు కోర్టు విడాకులు మంజూరు చేయడం లేదు.
సంసారాలలో గతంలోనూ, ఇప్పుడూ కూడా మగవాళ్లు పెట్టే హింసలు చాలా ఉంటూనే ఉన్నాయి..కానీ ఇప్పుడు ఆడవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులు పెట్టే హింసలు కూడా ఉంటున్నాయి. ఈ కేసువరకు ముమ్మాటికీ వాది కుటుంబానిదే దోషం. పెళ్ళికి ముందు జరిగే మాటల నుండే వాళ్ళు రికార్డ్ చెయ్యడమే దానికి నిదర్శనం.. కుటుంబ హింసల చట్టం అవసరాన్ని గుర్తించి స్త్రీ రక్షణకోసం ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ పురుషుల గురించి చట్టాలుతీసుకువచ్చే స్థితివరకు తీసుకురాకూడదు.
వనజ, కుటుంబం ఆలోచనలో మార్పు రావాలని కోర్టు భావిస్తున్నది. సంసారాన్ని సంసారంలా అందరూ చూడాలని కోర్టు సూచిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న ఆధారాలను పరిశీలించి,కోర్టు కేసును కొట్టివేస్తున్నది. భారతదేశ చరిత్రలో రెండు వాయిదాలలో తీర్పు వచ్చిన కేసుగా దీనికి గుర్తింపు ఉంటుందని అనుకుంటున్నాము.
ఆలోచనలు మార్పుచేసుకుంటే ఇలాంటి చిన్నచిన్న తగువులు ముందుముందు కోర్టువరకు రావని నమ్ముతున్నాము."
అని తీర్పు చదవడం ముగించాడు న్యాయమూర్తి.
No comments:
Post a Comment