Tuesday, July 14, 2020

మానవుడు నిగ్రహంగా ఎలా ఉండాలో చెప్పిన దత్త సందేశం

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెబుతున్నారు - మగ ఏనుగుకు ఆడ ఏనుగును స్పృశించడం, దాని శరీరానికి తన శరీరాన్ని తాకించి, రాపిడి చేయడం ఎంతో ఇష్టం. అది మగ ఏనుగుకు ఉన్న బలహీనత. అది మావటివానికి తెలుసు. అందుకే మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రదేశంలో ఒక గొయ్యి త్రవ్వి, దాని మీద వల వేసి గొయ్యి కనిపించకుండా, గడ్డి, ఆకులతో కప్పేస్తాడు. దాని మీద గడ్డితో ఆడ ఏనుగు బొమ్మను తయారు చేసి నిలబెడతాడు. అటుగా వచ్చిన మగ ఏనుగు, ఆడ ఏనుగును చూసి, కామోద్రేకానికి గురై, దాన్ని సమీపించగానే ఆ గొయ్యిలో పడిపోతుంది. మావాటి వానికి చిక్కుతుంది. ఏనుగంటే భారీ శరీరము, దానికి కోపం, మదము కూడా అలాగే ఉంటాయి. అందుకే మావాటి వాడు, దాన్ని బంధించి, సరిగ్గా ఆహారం అందించకుండా, అప్పుడప్పుడు అందిస్తాడు. అది మాట వినని పక్షంలో, దాన్ని అనేకమార్లు శూలంవంటి పదునైన వస్తువుతో పొడుస్తాడు. పాపం ఆ ఏనుగు ఆ బాధను భరించలేదు. వాడు అదే పని పదే పదే చేస్తాడు. చివరకు ఏనుగు వాడు చెప్పినట్లు వినడం మొదలుపెడుతుంది. మావటి వాడు ఏనుగు ముందు చిన్న కర్ర పెట్టినా, భయానికి మౌనంగా నిల్చుంటుంది. అతడు చెప్పినట్లు ఆడుతుంది. ఏనుగు అనేది అత్యంత భారీజీవి, చాలా శక్తివంతమైనది కూడా. దానిని చూసి పెద్దపులులు, సింహాలు సైతం భయపడతాయి. కానీ కేవలం తన స్పర్శేంద్రియం మీద నిగ్రహం లేని కారణంగా బలహీనుడైన మావటి వానికి ఊడిగం చేసే స్థాయికి వెళ్ళింది. బక్కపలచని మావటికి భయపడుతుంది. మానవుడు కూడా తన స్పర్శేంద్రియం (చర్మం) మీద నిగ్రహం లేనప్పుడు, ఏనుగు వలె పతనం అవుతాడు. ఇది నేను ఏనుగు నుంచి నేర్చుకున్నాను. అందుకే ఏనుగు నాకు గురువు.

ఈ విషయం పెద్దగా విడమర్చి చెప్పనక్కర్లేదు. మానవులు కామోద్రేకులు ఇతరుల స్పర్శ కోరి, ధర్మబద్ధం కాని సంబంధాల్లోకి వెళతారు, లేదా అటువంటివి కలిగి ఉండాలని భావిస్తారు. అంత పెద్ద జీవి అయిన ఏనుగు మావటి వానికి ఊడిగం చేసిన విధంగా, తమ జీవితంలో పతనం అవుతారు. కనుక ఏనుగు మనకు నిగ్రహం కలిగి ఉండటం నేర్పిస్తోందని దత్తడు సెలవిస్తున్నారు.

No comments:

Post a Comment