Wednesday, July 22, 2020

నిన్ను నీవు తెలుసుకో

నిన్ను నీవు తెలుసుకో

🤘 మానవుడు సంఘజీవి. అతడు ఒంటరిగా జీవనం సాగించలేడు. అందుకే జనజీవనం తప్పదు.
ఒక వ్యక్తిగాని, సమాజంగాని, జాతిగాని అభివృద్ధి పథంలో నడవాలంటే ముందుగా తమ ప్రస్తుత పరిస్థితుల్ని కూలంకషంగా తెలుసుకోవాలి. గతాన్ని, గతం నేర్పిన పాఠాలను వర్తమానంలో ప్రతిబింబింపజేయాలి. అంతే తప్ప- గతాన్ని మరిచిపోయి భవిష్యత్తుకు రాచబాట వేయాలనుకోవడం అవివేకం !!

మనలో చాలామంది ప్రధానంగా రెండు పెద్దతప్పులు చేస్తుంటారు. మొదటిది, గతాన్ని తలచుకొంటూ వర్తమాన కర్తవ్యాన్ని ఉపేక్షించడం. రెండవదేమో, భవిష్యత్తును గురించి కలలుకంటూ తక్షణం  నిర్వర్తించాల్సిన విధులను మరచిపోవడం. ఇవి రెండూ క్షమించరాని తప్పిదాలే. గతం నేర్పిన పాఠాలను మనసులో ఉంచుకొని భవిష్యత్తులో ఎదుర్కోవలసిన పరిస్థితులపై సరైన దృక్పథంతో వ్యవహరించాలి. వర్తమాన కర్తవ్యాన్ని సముచితమైన విజ్ఞత, సందర్భోచితమైన దక్షత, సమయస్ఫూర్తితో నిర్వర్తించాలి.
కాలం మహిమాన్వితం !!

కాలగమనంలో గతం, వర్తమానం, భవితవ్యం అనే ఈ మూడూ నిరంతరం మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫలితంగా వాటి ప్రభావం ఎంతోకొంత మనసుపై పడి తీరుతుంది. నిన్నటి రోజును గుర్తు చేసుకోవడం సింహావలోకనం అవుతుంది. రేపటిని ఊహించుకోవడం ముందుచూపు అంటారు. నిన్నటికి, రేపటికి మధ్య ఉన్నదే వర్తమానం. దీన్ని విస్మరించకూడదు. మన జీవిత సౌధానికి ఇదే పునాది.
రేపటి ఉన్నతి కోసం మనలోని మంచి, చెడు, బలహీనతల్ని గుర్తించాలి. ఇది చాలా ముఖ్యం. ఒక బలహీనుడు ఉన్నాడు. అతడు తన బలహీనతల్ని ససేమిరా అంగీకరించడు. అలాంటి వ్యక్తి జన్మలో బలవంతుడు కాలేడు. ఇంకొకతనేమో పుట్టెడు దుఃఖాల్లో మునిగి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తన బాధలకు కారణాలను వాటికి అనుకూలించిన పరిస్థితులను వెతుక్కొని జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని సంతోషంగా ఉండేలా అడుగు ముందుకు వేయాలి. అప్పుడే అతడు సుఖసౌఖ్యాలను పొందగలుగుతాడు. అతనలా చేయకపోగా నాకేం... సుఖంగా ఉన్నాను అని బాహ్యాడంబరాన్ని ప్రదర్శించాడా- అతడెన్నటికీ నిజమైన ఆనందభోగాలు అనుభవించలేడు !!

రోగికి జబ్బునయం కావాలంటే ముందుగా రోగలక్షణాలను తెలుసుకోవాలి. రోగ కారణాలు కనుక్కోవాలి. అటుపై తగిన మోతాదులో సరైన మందులు వాడితే రోగనివారణ సాధ్యపడుతుంది. ఇదే సూత్రం వ్యక్తికి, జాతికి సైతం వర్తిస్తుంది.
జీవితంలో మంచి చెడులు నేనంటే నేనే ముందంటూ మనిషి జీవితంలో ప్రవేశించడానికి పోటీపడతాయి. అలాగే జాతి చరిత్రలోనూ స్వర్ణశకాలు చీకటి యుగాలు చోటుచేసుకుంటాయి. ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించే వీల్లేదు !!

నేటి యువతరాన్ని నైరాశ్యం నిస్పృహలు పట్టిపీడిస్తున్నాయి. వాటిని అధిగమించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటేనే జీవితంలో ముందడుగు వేయగలమన్న పెద్దల మాట చద్దిమూట.
‘నిన్ను నీవు తెలుసుకో’ అంటారు తత్త్వవేత్తలు. ఆంధ్రమహాభారతం శాంతి పర్వంలో చెప్పిన విధంగా- మన జీవితం సొంత ఇంటిలో అలవాటు ప్రకారం బతికే అంధుడి బతుకు వంటిది కాకూడదు. ధైర్యంగా కష్టాలనెదుర్కొంటూ ముందుకెళ్ళాలి. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టాలి. దుఃఖం, పరాజయం, పతనాన్ని పక్కకు నెట్టి ఆనందాన్ని, విజయాన్ని, అభ్యుదయాన్ని సొంతం చేసుకోవాలి.🙏



Source - Whatsapp Message

No comments:

Post a Comment