Friday, May 2, 2025

 *సైంధవుడు లేదా జయధ్రదుడు*
             

```
మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సలకి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలైన  దుస్సల మగఁడు. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.

ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. 

ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. 

అంతట వీఁడు దానికి ప్రతీకారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. 
కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. 

ఈవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆ ప్రకారము నడపెను.

మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి ‘వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును’ అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ‘ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక’ అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను. 

ఆహేతువునుబట్టి భారతయుద్ధమున అర్జునుఁడు సైంధవునితల శమంతపంచక సమీపమున తపము ఆచరించుచు ఉండిన వృద్ధక్షత్రుని గుండ మహీతలమున పడునట్లు పాశుపతాస్త్రప్రయోగమున చేసెను.
```

*చక్రవ్యూహం (పద్మవ్యూహం)పన్నడం:* ```
సైంధవుడుఅడ్డగించడం
మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరపు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. 

పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని ప్రక్కకి తప్పించడానికి ఒక ప్రణాళిక వేసి ఇద్దరు రాజులను అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు (జయధ్రదుడు) శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. 

ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవలు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రమాణం చేస్తాడు.```


*సైంధవ వధ:*```
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది. సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. 

అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. 

ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడి వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో  సైంధవుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment