Tuesday, September 30, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


    *సీతాదేవిని గాయపరిచిన*
                 *కాకి కథ:*
               ➖➖➖✍️

```
సుందరకాండలో హనుమంతుడు సీతా దేవిని కలుసుకొని రాముడిచ్చిన ఉంగరమును ఆమెకు చూపించి ఆమెకు ఆనందాన్ని కలిగించాడు.

రాముడికి కూడా సీతా దేవిని తానూ చూసినట్టు చెప్పటానికి ఏదైనా ఒక రహస్య సంఘటన చెప్పమని అడుగుతాడు.

అప్పుడు సీతా దేవి తనకు రాముడికి మాత్రమే తెలిసిన కాకాసురుడి వృత్తాంతం చెప్తుంది...

ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
(రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు)

అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి౦ది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి 'సీతా! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావా' అన్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. కళ్ళనుండి కన్నీరు కారాయి, అప్పుడు రాముడు నన్ను ఓదార్చాడు తన ఒడిలోకి నన్ను చేర్చుకున్నాడు, నేను తన ఒడిలోనే తల పెట్టుకొని నేను నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను.

అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది 'ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు?’ అని గద్దించాడు. 

అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో కాకి కనపడింది.

అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. 

అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది, కాని అందరూ 'రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో' అన్నారు. 

ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).

రాముడు ఆ కాకిని చూసి 'నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు.

అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment